రాజమండ్రీ జ్ఞాపకాలలో, మేము, ఏ.పి.ఆర్.టి.సీ వారి ధర్మమా అని చేసిన ” నవ జనార్ధన” టూర్ ఒకటి.ధవళేశ్వరం లో మొదలుపెట్టి,మడికి,జొన్నాడ, ఆలమూరు,కపిలేశ్వరపురం,మాచర,కోరుమిల్లి, కోటిపల్లి, మండపేట లలో ఉన్న 9 వైష్ణవ క్షేత్రాలు చూపించారు. అదీ 100/- రూపాయలు టిక్కెట్టుతో(ఒక్కొక్కరికి). ప్రొద్దుటే వెళ్ళి, సాయంత్రానికి వచ్చేశాము. చాలా బాగుంది. ఈ సందర్భం లోనే, మండపేట వెళ్ళినప్పుడు, నేను 1956 లో చదివిన స్కూలును ఒకసారి చూసుకునే భాగ్యం కలిగింది.
కడియం పూలతోటల సంగతి చెప్పనక్కరలేదు కదా!! అదో మరువలేని అనుభూతి. అదీ , మా అమ్మాయీ,అల్లుడూ,పిల్లలతో వెళ్ళడం వల్ల ఇంకా ఆనందం.అలాగే అంతర్వేది, యానాం ఆ ట్రిప్పులోనే వెళ్ళాం.
చూద్దామనుకుంటూనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడలేకపోయాము. …పిఠాపురం,పాలకొల్లు, భీమవరం, మందపల్లి, వాడపల్లి లాటివి. ఎంత ప్రాప్తం ఉందో అంత చూడకలిగాము. మర్చిపోయానండోయ్ పాపికొండలుకూడా చూడలేదు కారణం–అంతసేపు పడవలో ప్రయాణం చేయడం నాకు భయం, మా ఇంటావిడ ఒక్కత్తీ వెళ్ళనంది. అయినా ఎలాగోలాగ ” త్యాగం” చేసేద్దామనుకున్నా, కానీ తను మూడు వారాలు ముందుగానే పూణే వెళ్ళవలసివచ్చింది.
యు.ఎస్. లో ఉన్న మా అన్నయ్యగారి అమ్మాయి, భర్తా, కుమారుడితో వచ్చి మాతో గడపడం చాలా బాగుంది.ఆ సందర్భంలో మల్కిపురం వెళ్ళాము.” మోరి ” వెళ్ళి చీరలు తీసికొందామనుకుంటే టైము చాలలెదు. అందువలన ఇక్కడే వాళ్ళ ఔట్లెట్ కి వెళ్ళి, ఓ అరడజను చీరలు కొన్నాను ( నాకు నచ్చినవి). బండార్లంక చీరలైతే మా ఇంటావిడతో నే కలిసి కొన్నాము. చీరల సంగతి అదండీ.
ఇంక రాజమండ్రీ లో చూడడానికి –మా ఇంటి పక్కన ఉన్న రాళ్ళబండి సుబ్బారావు గారి మ్యూజియం, గౌతమీ గ్రంధాలయం, వీరేశ్వరలింగంగారి జన్మగృహమూ చూశాను. దేవాలయాల సంగతి అడక్కండి.
” అడుగడుగునా గుడి ఉందీ ” అంటూ ఎక్కడచూసినా గుడులే !! అక్కడి వాతావరణం, వారు గోత్రనామాలతో చేయించే పూజలూ, నిజంగా జన్మ ధన్యమైపోయింది.ఎప్పుడో పెట్టిపుట్టాననిపిస్తుంది నాకైతే.ప్రతీ రోజూ ఇచ్చే ప్రసాదాలు ( కట్టుపొంగలీ, దధ్ధోజనం) జన్మలో మరువలెను !!
ఇంక స్నేహితుల గురించి చెప్పవలసి వస్తే బ్లాగ్గు మిత్రులు శ్రీ మల్లిన నరసింహరావు గారు వచ్చి మాతో గడిపిన కొన్ని గంటలు తీపి గుర్తుగా ఉంటాయి. శ్రీ ఎం.వీ. అప్పారావుగారితో పరిచయం గురించి ఇదివరలో వ్రాశాను. ఈ ఏదాది మార్చిలో జరిగిన ” త్యాగరాజ ఆరాధన ” ఉత్సవాలు, మా బాల్కనీ లోనుండే వినే అవకాశం కలిగింది. అలాగని అక్కడికి వెళ్ళలేదని కాదు, అక్కడ కంటే మా ఇంట్లోనుండి వినడానికి చాలా బాగుంది ( ఏక్ దం రింగ్ సైడ్ సీట్ !!). ప్రక్కనే గోదావరి గలగలలూ, వీనులకింపైన సంగీతమూ ఇంకేమి కావాలీ !!
వీటన్నిటికీ మించింది ” సోనే పే సుహాగా” అన్నట్లుగా, మా ఎదురు ఫ్లాట్ లో ఉండే వారు చేసిన ఋషిపంచమి నోమూ, ఆ సందర్భంలో మాకు శ్రవణానందమైన వేదఘోషా. ఎంత డబ్బు పెడితే వస్తుందండీ ఇలాటి ఆనందం? ఇవన్నీ డబ్బుతో కొలిచేవి కావు. ఏ జన్మలోనో మేమిద్దరమూ చేసికొన్న పుణ్యం !!
ఇవన్నీ ఒక ఎత్తైతే మేము వ్రతం చేసికొన్న శ్రీ సత్యనారాయణ దేవస్థానం అన్నవరం ట్రిప్పూ, కల్యాణం చేసికున్న ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం ఒక ఎత్తూ. నా అరువైనాలుగేళ్ళ జీవితంలోనూ,పూర్తిగా మనస్సారా ఆనందించిన ఒక ఏడాది జ్ఞాపకాలూ, తీపి గుర్తులూ, మధుర క్షణాలూ ఇవి.
నేను ఇచ్చే సలహా ఏమిటంటే, వీలైనంతవరకూ ప్రతీ వారూ, జీవితంలో ఒక్కసారైనా భార్యతో కలిసి మీకు ఇష్టమైన ప్రదేశంలో ఒక్క ఏదాది గడపకలిగారంటే చాలు, మీ బ్యాటరీలు మళ్ళీ రీఛార్జ్ అయిపోతాయి!!
నాకు గోదావరి అంటే ఇష్టం కాబట్టి రాజమండ్రీ లో ఉన్నాను, కోనసీమ అందాలు ఆస్వాదించాము. కొంతమందికి కృష్ణాతీరం నచ్చొచ్చు, కొంతమందికి ఇంకో ప్రదేశమేదో నచ్చొచ్చు. ఏదో ఒకటి నచ్చుతుందికదా,ఠింగురంగా మంటూ కాపురం పెట్టేయండి. డబ్బుకోసం చూసుకోవద్దు. ఎంత డబ్బు సంపాదించినా ఈ ఆనందం ఎక్కడా కొనలేరు.హొటళ్ళలో ఉంటే ఈ ఆనందం సంపాదించలేరు. జీవిత సహధర్మచారిణి స్వయంగా చేత్తో చేసిన వంట తింటూ హాయిగా గడిపేయండి. ఇలాగంటే అందరి గృహిణులూ నామీద దండయాత్ర చేస్తారు. ” మీరందరూ రిటైర్ అయినా మాకు ఈ తిప్పలు తప్పవా ” అంటూ. ఆయనచెత కూడా ఎదో ఒక పని చేయించండి. ఇదీ “కంఫర్ట్ జోన్ “ అంటే !! మీ ఇష్టం ఏంకావాలంటే అది చెయ్యొచ్చు, అడిగేవాడుండడు. అడిగినా చెప్పొచ్చు–” మా ఇష్టం వచ్చినట్లుంటాము.నిన్నేమైనా అడిగేమా ” అని ఝణాయించేయ్యొచ్చు.
ఇన్నింటిలోనూ నాకు నచ్చనిదేమంటే మా అబ్బాయీ, కోడలూ, మనవరాలూ రాలేకపోయారు.ఇంకో రెండేళ్ళలో ( నేను బ్రతికి బావుంటే) ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి అన్నీ చూపించాలని ఉంది. అప్పటికి కొత్తగా మాకు మళ్ళీ మనవడో, మనవరాలో వస్తుంది కాబట్టి ” కంప్లీట్ ఫ్యామిలీ ” తో వద్దామని ఉంది.ఏం రాసి పెట్టి ఉందో !!
పైన ఇచ్చిన ఫొటోలు మా బాల్కని లోంచి తీసినవి. తలుపు తీయగానే గోదావరి తల్లి దర్శనం. కొద్దిగా నడిస్తే లాంచీల రేవు. ఇంకేం కావాలండి ?
Filed under: Uncategorized | 14 Comments »
You must be logged in to post a comment.