గూబ గుయ్యిమనడం, ఎప్పుడో చిన్నప్పుడు, పాకబడిలో, మాస్టారికి, ఏ కోపం వచ్చినప్పుడో, లేదా నాన్నగారికి, పరీక్షలో మార్కులు తక్కువొచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడో, వేసిన చెంపదెబ్బలకి, అనుభవం అయేది. మళ్ళీ, అప్పటికి, ఈరోజుల్లో తెలుస్తోంది. ఓవైపున మన భారత ప్రభుత్వం వారేమో, నోటిలెక్కలు కట్టేసి, అదేదో, ద్రవ్యోల్బణం ( inflation) సింగిల్ డిజిట్ లోకి వచ్చేసిందీ అంటున్నారు.. కానీ, మార్కెట్ కి వెళ్ళడానికే భయంగా ఉంటోంది. గుప్తుల “ స్వర్ణయుగం” లో , మరీ అంతకాకపోయినా, ఓ మూడునాలుగేళ్ళ క్రితం వరకూ, మరీ పెళ్ళి విందులోలాగ కాకపోయినా, సంసారపక్షం గా, ఓ కూరా, పప్పూ, పచ్చడి లతో కడుపునిండా భోజనం చేసేవాళ్ళం. అతిథులెవరైనా వస్తే, మహా అయితే, ఇంకో కూర,, ఓ స్వీటూ, అదనంగా ఉంటే సరిపోయేది.. ఒకానొకప్పుడు, అతిథులనిబట్టి, పప్పుపులుసూ, వీలునిబట్టి, కందిపప్పు వేయించి, పచ్చడీ, దాంట్లో నలుచుకోడానికి ఉల్లిపాయల పులుసూ… హో… ఏం భోగంగా ఉండేదండీ. ఏ పోపులోనో వేసిన శనగపప్పు బద్దో, పంట్లో గుచ్చుకుని, ఆ తరువాతెప్పుడో , సావకాశంగా, నాలుకతో సుతారంగా, బయటకి తీసి మళ్ళీ నవలడం, అసలా రుచే వేరు. శనగపప్పుతో పాఠోలీ చేస్తే, ఆ రుచి మర్చిపోగలమంటారా? ఎంత లగ్జరీ అంటే, “ చెడిన కాపరం ఎలాగూ చెడిందీ, చంద్రకాంతలు చేయవే భామామణీ.. “ అన్నట్టు అప్పుడప్పుడు చంద్రకాంతాలూ, పెసరట్టూ, ఉప్మా అయితే సరే సరి… ఇలా రకరకాల వంటకాలూ అవీనూ.
ఇంక మినప్పప్పు విషయానికొస్తే, శనివారం ఫలహారాలకి వాసినపోళ్ళూ ( ఇడ్లీలు), పోలాలమావాశ్యకి పొట్టెక్కబుట్టలూ, ఆరారగా నోట్లో వేసికోడానికి మినపసున్నుండలూ, మధ్యాన్నం చాయ్ తో తినడానికి, ఓ కారప్పూసో,కారబ్బూందో… ఇలా చెప్పుకుంటూ పోతే, అన్నిరకాల పప్పులతో, ఎన్నోరకాల పదార్ధాలు చేసికుని, మనం తిని, ఇంటికొచ్చినవారికి పెట్టి, హాయిగా ఉండేవాళ్ళం.అసలు ముద్దపప్పో, మామిడికాయ దొరికేరోజుల్లో, మామిడికాయతోనో, ఆ తరువాత, సంవత్సరం పొడుగునా ఎండిన మామిడి ఒరుగులతోనో, పప్పు, అందులోకి నెయ్యీలేకుండా అసలు ముద్ద దిగేదా? అలాటి మధురస్మృతులన్నీ, ఊరికే గుర్తుచేసికోడానికే సరిపోతాయి.
అలాటిది, ఇప్పుడు, వీలునిబట్టి, పోపులోకి కూడా , శనగపప్పు వాడితే, ఏం ముంచుకొస్తుందో అనే భయం. కారణం- పప్పుల ధరలన్నీ, చెప్పాపెట్టకుండా, ఆకాశాన్నంటేశాయి. . ప్రతీరోజూ పేపర్లలో వార్తలోటీ, ఇవేళ 50,000 టన్నుల దాచుంచిన పప్పులు స్వాధీనం చేసికున్నారూ అంటూ. పోనీ, అవేమైనా మనకి దొరుకుతాయా అంటే అదీ లేదూ, అవన్నీ Public Distribution System లో కవరయినవారికే, ఇస్తారుట. ఆ భోగం మనకైతే లేనే లేదాయె.పోనీ, ఈ ధరలు పెరగడానికి, వ్యాపారస్థులే కారణమూ, నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తోందీ అంటారు. అప్పుడెప్పుడో ఉల్లిపాయలధరలు , కోయకుండానే, కన్నీళ్ళు తెప్పించాయి. ఇప్పుడేమో పప్పులూ.
ఈ విషయం వదిలేయండి, ప్రభుత్వం వారు, చాపకిందనీరు లా, చెప్పాపెట్టకుండా, ధరలు పెంచేయడం మాటేమిటీ? మన రైల్వే మంత్రి , బడ్జెట్ లో రైళ్ళ టిక్కెట్ల ధరలు పెంచడం మానేసి, జైట్లీతో,నువ్వు పన్నులు పెంచేసి, అందులో కొంత నాకిచ్చేసేయమ్మా అంటాడు. ఉదాహరణకి, ఏణ్ణర్ధం క్రితం, మేము పూణె నుండి సికిందరాబాద్, శతాబ్ది లో వెళ్ళడానికి ఇద్దరికీ కలిపి, సీనియర్ సిటిజెన్ రాయితీలతో , ఓ 700- 800 తో పనైపోయేది. ఇప్పుడో, రాయితీతో ఒక్కోరికి 700 పైగా అవుతోంది. విషయం ఏమిటా అని చూస్తే, బేసిక్ రేటు అలాగే ఉంచేసి, మిగతావన్నీ ఎడా పెడా పెంచేశారు. అలాగే, పెట్రోల్ ధరలు తగ్గించడం తరవాయి, రాష్ట్రప్రభుత్వాలు, ఏదో రూపంలో, సర్ ఛార్జి పేరుతో, లీటరుకి, 2-3 రూపాయలు పెంచేయడం. పైగా డబ్బున్నవాళ్ళే పెట్రోలూ, డీసెలూ వాడతారూ, ఆంఆద్మీకి ఏమీ ఉండదూ… అని ఓ సమర్ధింపోటీ. డీసెల్ పెంపు కారణంతో, రవాణాఖర్చు పేరుచెప్పి, మిగిలిన ధరలన్నీ పెరిగిపోవడమూ. పైగా, వీటితోపాటు, ప్రతీవాడూ, పూజలు చేయించే పురోహితులదగ్గరనుండి, క్షవరం చేసేవాళ్ళూ, చివరాఖరికి బట్టలుకుట్టేవాళ్ళూ.. ఇలా ఒకరేమిటి అందరూ.. “ పెట్రోల్ ధరలు పెరిగాయి కదండీ… “అనేవాడే. ప్రభుత్వాల లెక్కల ప్రకారం మాత్రం, inflation మైనస్సులోనే ఉంటుంది.
ఇదివరకటిరోజుల్లో, నాకు గుర్తున్నంతవరకూ, 1971 లో బంగ్లాదేశ్ కాందిశీకుల్ని పోషించడానికి, కొంత సర్ ఛార్జీ వసూలుచేశారు. కానీ, ఇప్పుడు, రైతులఅత్మహత్యల మొదలు, స్వఛ్ఛ భారత్ అభియాన్, గంగా అభియాన్, ఇంకో సింగినాదం అభియాన్ పేర్లతో ఎడాపెడా వసూలు చేసేస్తున్నారు. పోనీ వీటివలన ఆత్మహత్యలు ఆగాయా, లేక దేశమంతా అద్దంలా మెరిసిపోతోందా అంటే, అదీ లేదూ.
ఈలోపులో , శంకుస్థాపనలు, విదేశ పర్యటనలూ , పేరు చెప్పి, కోటానుకోట్లు ఖర్చుపెట్టడం మాత్రం మానడంలేదు, మన ప్రియతమ నాయకులు…
సర్వేజనా సుఖినోభవంతూ…
Filed under: Uncategorized | 7 Comments »
You must be logged in to post a comment.