బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. సుబ్బారాయుడు షష్టి

 డిశంబరువచ్చిందంటే  చాలు, మాకు అమలాపురం లో హడావిడే హడావిడి. స్కూలుకెళ్ళే దారిలో సుబ్బారాయుడి గుడుంది. పెద్దాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడూ అని అనేవారనుకోండి, కానీ పిల్లలందరికీ సుబ్బారాయుడే! ఆ గుడేమీ మరీ పెద్దది కాదు ఆ రోజుల్లో. ఈమధ్యన 50 ఏళ్ళ తరువాత చూసేసరికి, సదుపాయాలెన్నో చేశారు. ఆ రోజుల్లో, సుబ్బారాయుడి షష్టికి స్కూలు శలవు. అంతకుముందు ప్రతీ రోజూ స్కూలికి వెళ్ళేటప్పుడు, కొట్లవాళ్ళు, పందిళ్ళు వేస్తూ కనిపించేవారు. అబ్బో ఎన్నెన్ని కొట్లో! అటు స్కూలుదాకా, ఇటు చెరువు గట్టుదాకా కొట్లే కొట్లు.

ఇంక ఆలశ్యం అయితే, గుడిలో దర్శనానికి టైము పడుతుందని, తెల్లవారుఝామునే లేపేసేవారు. ఆ చలిలో నూతి దగ్గర నూతిలోంచి,చేదతో నీళ్ళు తోడుకుని ఓసారి నెత్తిమీద గుమ్మరించుకునేసరికి చలి కాస్తా మాయమైపోయేది. గుడికెళ్ళాలన్న ఉత్సాహమో, లేక తెల్లారకట్ల నూతిలో నీళ్ళు మరీ అంత చల్లగా ఉండకపోవడమో తెలియదు కానీ, ఏడవకుండా, పేచీ పెట్టకుండా స్నాన కార్యక్రమం పూర్తయేది. ప్రొద్దుటే నాన్నగారి చెయ్యి పట్టుకుని గుడి కి వెళ్ళడం. ఆ ఊర్లో స్కూలుకి హెడ్ మాస్టారు కావడం చేత, దర్శనం మరీ అంత ఆలశ్యం అయేది కాదు. ఆ గుడిలోపల మహ అయితే ఓ పదిహేను మంది పట్టేవారు. లోపల ఓ పుట్టా, దానిమీద శివ లింగమూ ఇప్పటికీ గుర్తె. అక్కడ మా అస్థాన పురోహితుడు శ్రీ తోపెల్లనరసింహం గారూ, శ్రీ వాడ్రేవు మహదేవుడు గారూ ప్రధాన అర్చకులు. ఏదో మొత్తానికి ఎక్కడా తప్పిపోకుండా, బయటకి వచ్చి, మళ్ళి ఓ దండం పెట్టుకుని, కొంపకి చేరడం. అప్పటికి తెలుగులో వార్తలు ( రేడియోలో) వస్తూండేవి.

అసలు హడావిడంతా ప్రొద్దుట పది దాటింతర్వాతే! కొనేందుకు డబ్బులివ్వకపోయినా, ఓ రౌండేసికోడానికి వెళ్ళి, అమ్మతో మధ్యాన్నం తీర్థానికి వెళ్ళినప్పుడు, ఏమేం కొనాలో తెలియొద్దూ? ఎక్కడ చూసినా పేద్ద పేద్ద గుట్టలు ఖజ్జూరం పళ్ళూ, పక్కనే మిఠాయి కొమ్ములూ, జీళ్ళూ– నోరూరేసేది! ఆటబొమ్మలూ, రంగుల రాట్నాలూ, అబ్బో ఏం జనమండి, ఏం హడావిడి, పెద్దాళ్ళకంటే వాళ్ళతో పిల్లలకే ఆనందం అంతానూ. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, ఏవో పూలూ,పడగలూ ఇచ్చుకునేవారు.

ఆ తరువాత తీర్థంలోకి వెళ్ళడం. తామరాకుల్లో కట్టి ఖర్జూరాలూ, మిఠాయి కొమ్ములూ, జీళ్ళూ, అందులో మళ్ళీ వెరైటీలు- కొమ్ములూ, గుండ్రంగా ఉండేవీనూ. ఓసారి రంగులరాట్నం లో తిరిగేయడమూ, అన్నిటికంటే చివరగా ఓ రంగుల కళ్ళజోడోటి కొనుక్కుని మరి అందరికీ తెలియొద్దూ తీర్థానికి వెళ్ళొచ్చామనీ! ఎంత సంతోషంగా ఉండేదో! ఇప్పుడా తీర్హాలున్నాయా, ఆ సంతోషాలున్నాయా! గుర్తుచేసికోడానికైనా ఇదివరకటి వాళ్ళకి ఇలాటి మధుర జ్ఞాపకాలున్నాయి!…

బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–ఎప్పుడూ కలలోకూడా అనుకోలేదు….

నేను గత ఆరు నెలలనుండీ , ఈ మాధ్యమానికి దూరంగా ఉండాల్సొచ్చింది.. అలాగని పూర్తిగా రాయడం మానలేదూ.. ఫేస్ బుక్ లో రాస్తూనే ఉన్నాను.. కానీ నా బ్లాగు మిత్రులు చాలామంది అక్కడ కనిపించలేదు.అలాగని , మిమ్మల్నందరినీ నా ‘ బారి’ నుండి తప్పించుకోనిస్తానా? అందుకనే మళ్ళీ వచ్చేసాను.. భరించాలి మరి  సరేనా ?..

   1940 ల్లో అనుకుంటా.. ప్రఖ్యాత తెలుగురచయిత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, “ బారిస్టర్ పార్వతీశం” అని ఒక నవల రాసారు..అందులో తను మొదటిసారి లండన్ వెళ్ళడం, అక్కడ తన అనుభవాలు రాసారు(ట).. ‘ట’ అని ఎందుకన్నానంటే,అప్పటికి నేనింకా ఈ భూమ్మీదకి రాలేదు..నేను పుట్టడం 1944 లో కదా మరి..మనవైపు ఓ అలవాటుంది.. పిల్లలు పుట్టగానే వారి జాతకం రాయిస్తూంటారు..నాకు చదవడం రాగానే ఈ విషయం తెలిసి, సరే అని..నా భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుందే కదా.. చూస్తే..” ఈ జాతకం లో విదేశయానం అని స్పష్టంగా ఉంది..” అని రాసారు..ఎప్పుడు పెద్దయేది, చదువు పూర్తయేదీ..చదవగానే.. నా మాటెలా ఉన్నా, ఇంట్లోవాళ్ళకి మాత్రం ఎంతో సంతోషం వేసిందిట. పైగా అప్పుడే మొక్కపాటి వారి నవల ప్రభావంలో కూడా ఉన్నారేమో.. “పిల్లాడు ప్రయోజకుడవుతాడూ..” అని..( అవలేదు ..అది వేరేవిషయమనుకోండి)..ఆ పుస్తకానికీ, మీ జాతకానికీ, మమ్మల్నందరినీ ఇంతలా ‘బోరు’ కొట్టడానికీ సంబంధం ఏమిటీ..అని అందరూ అనుకోవచ్చు.. సరీగ్గా అక్కడకే వస్తూంట..పై మూడు విషయాలకీ లంకె ఉన్నట్టు మీరే అంటారు పూర్తయాక..

2005 లో రిటైరయాక  చూస్తే, ఎక్కడ చూసినా, విదేశాలకి వెళ్ళేవారు విపరీతంగా పెరిగిపోయారు. చేతిలో ఏదో ఒక ‘ కళ’ ఉన్న ప్రతీవారికీ బయటకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చాయి.. ఏ కళా లేకపోయినా, దేశం లోని చాలామంది “ అమ్మలు” వారివారి పిల్లల పురుళ్ళకో, మరోదానికో వెళ్ళేవారు. తల్లి వెళ్తే, తండ్రిని ఏం చేయడం? Buy One Get One  లో లాగ, ఈ తండ్రిగారుకూడా వెళ్ళేవారు. పైచదువులకైతే చెప్పాల్సిన అవసరమే లేదూ.. మన దేశం లోఉండే రూల్స్  ధర్మమా అని, పైచదువులకి, ఎంత తెలివితేటలున్న విద్యార్ధికైనా, సీటు వస్తుందో రాదో తెలిసేది కాదు.. పైగా ఈ విదేశీ చదువులకి కూడా, బాంకులు అప్పులు ఇవ్వడం ప్రారంభం అవడంతో అవకాశాలు వచ్చిన విద్యార్ధులందరూ, విదేశాల వైపే మొగ్గుచూపేవారు. ఆతావేతా జరిగిందేమిటంటే, పూజలు చేయించే పురోహితులదగ్గరనుండి, పై చదువులకి వెళ్ళే విద్యార్ధులదాకా, విదేశాలకి వెళ్ళడమే.

ఎవరిని చూసినా, అమెరికా , ఇంగ్లాండ్ కబుర్లే.. అసలంటూ వెళ్ళినా, వెళ్ళకపోయినా, అందరిలాగా నాక్కూడా ఓ  Passport  ఉంటే బావుంటుందనిపించింది…పైగా అదో స్టేటస్ సింబలోటీ.. ఏదైనా ID  అడిగినప్పుడు చూపించడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగూ లేదాయే,మరీ రేషన్ కార్డ్ చూపించడానికి నామోషీ… ఈ Passport చూపిస్తే, మన స్థాయి కూడా పెరుగుతుందీ అనే ఓ ఆశ..అప్పటికింకా ‘ఆధార్’ కార్డులు రాలేదాయే..పాస్ పోర్ట్ తీసుకునేందుకు ఇన్ని ‘ సమర్ధింపులా’ అనిపించొచ్చు.. ఏంచేయనూ?

 ఏదొ మొత్తానికి దగ్గరేఉన్న ఓ ఏజంట్ ని పట్టుకుని ‘పాస్ పోర్ట్ పర్వం’ ప్రారంభించాను. మరీ ఒక్కడికీ ఏమిటీ అనుకుని, నా భార్యకి కూడా apply  చేసాము.అదేదో సామెత చెప్పినట్టుగా.. మా పనికి అన్నీ ‘విఘ్నాలే’.. మొట్టమొదట, నాభార్య , SSLC Book ( జన్మతిథి దాఖలా) లో “ పరిమి’ అని ఉమ్దీ..’ భమిడిపాటి’ ఎలా అయిందీ అంటూ.. అప్పటికి పెళ్ళై 33 సంవత్సరాలయి, ఇద్దరు ఎదిగొచ్చిన పిల్లలకి , తల్లి తండ్రులమయాక, మా “ శీలాల’ మీద ప్రశ్నార్ధకం వచ్చింది.. కారణం ఈరోజుల్లోలాగ, మారోజుల్లో ఈ సర్టిఫికేట్లూ, రిగిస్ట్రేషన్లూ ఉండేవి కావాయె.. అన్నవరం సత్యనారాయణస్వామి సన్నిధి లో , సశాస్త్రీయంగా జరిగిందన్నా లాభం లేకపోయింది.. అదృష్టవశాత్తూ, అప్పటి శుభలేఖ, మా పినమామగారు తీయించిన ఫొటో ( తాళి కడుతూండగా) దొరగ్గా, వాటిని జతచేసి , ఓ affidavit చేసాక , మొత్తానికి మావివాహబంధం చట్టపరంగా అంగీకరించి, ఎప్లికేషన్ అంగీకరించారు…అంతా ఓ పేద్ద కథా. ఎన్నో ఎన్నెన్నో విఘ్నాలు అధిగమించి. చివరికి పాస్ పోర్ట్ లు చేతికి వచ్చేసరికి, ఒక రోజు తక్కువగా ఏడాదీ పట్టింది ( 363 రోజులు). మొత్తానికి సాధించాను… ఆ పాస్ పోర్ట్ చూసేసరికి ఎంత ముచ్చటేసిందో….

మొక్కపాటి వారు రాసినంత అద్భుతంగా అయితే నేను రాయలేను..పైగా నా వ్యాస పరంపర ఏదీ “ ట్రావెలాగ్” లాగ కూడా ఉండకపోవచ్చు.. ట్రావెలాగ్ లలోసాధారణంగా, మనం ఎక్కడికైనావెళ్ళినప్పుడు, అక్కడి వివరాలు, ఖర్చులూ, వగైరాలతో వివరంగా రాస్తారు..భవిష్యత్తులో ఎవరైనా వెళ్ళాల్సినా, ఈ ట్రావెలాగ్ చదివితే అన్నీ తెలుస్తాయి. కానీ , నేను ఇటుపైరాసే వ్యాసాల్లో, మిగిలిన వాటి మాటెలాఉన్నా, ఖర్చులూ, ఖరీదులూ మాత్రం నాకు తెలియదు.. కారణం—వీసా ఫీజునుండి, మేము ముంబయి తిరిగివచ్చేదాకా, మాచేత ఓఖ్ఖ పైసా ఖర్చు చేయనీయలేదు, మా అల్లుడు,అమ్మాయీనూ.. పైగా ఎప్పుడైనా అడిగే ధైర్యం చేద్దామన్నా, ఆ అవకాశం కూడా రానీయకుండా, ఒకలా చెప్పాలంటే “ మమ్మల్ని పువ్వుల్లో పెట్టి ,పువ్వుల్లోనే తిరిగి పంపించారు” పిల్లలు. అంతా మా పూర్వజన్మసుకృతం, భగవంతుడి దయా అని నమ్ముతాము .

(సశేషం)

#OFFTOLONDON–1

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు…’ feel good’ అనుభవం..

సాధారణంగా  ఈ రోజుల్లో ఎప్పుడో గానీ ‘feel good’  అనుభవాలు రావు.. అలాగని ఏదో లాటరీలో ప్రైజే రావాలనే లేదు.. ప్రతీరోజూ జరిగే ఏ ఒక సంఘటన కూడా, మనకి ఆ సంతోషం కలిగించొచ్చు. మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.. కొంతమంది ఇలాటివారిని ‘ అల్ప సంతోషులు’ అని కూడా హేళన చేయొచ్చు.. so..what.. మన మనసుకి నచ్చింది…. మిగిలినవాళ్ళేమనుకుంటే మనకేమిటీ?

నామట్టుకు నాకు సోషల్ మీడియా  Facebook  ధర్మమా అని, వందలాది స్నేహితులు లభించారు. మహా అయితే ఓ వందమందితో , personal contact  లు ఉన్నాయి. దానికి కారణం, నాతో ఎవరైనా స్నేహం చేస్తే, నేను వారిని, మరీ మొదటి పరిచయం లోనే కాకుండా, వారు నేను ప్రతీరోజూ పెట్టే పోస్టులను చూసనండి, లేక అవతలివారి పోస్టులు చదివనండి, ఉజ్జాయింపుగా మన వ్యక్తిత్వం వారికి తెలిసిందని నమ్మకం కలిగాకనే, నేను వారి ఫోన్ నెంబరు అడుగుతూ, నా నెంబర్ కూడా ఇస్తూంటాను. నూటికి తొంభైతొమ్మిది మంది దాకా  oblige చేస్తూంటారు.. ఎక్కడో ఉంటూంటారు.. అడగ్గానే ఇచ్చేస్తే వారి విలువ తగ్గిపోతుందేమోనని కొందరు, అస్తమానూ ఫోన్ చేసి ఇబ్బంది పెడతానేమోనని కొందరు,వారి  so called privacy  violate  చేస్తానేమోనని కొందరూ  ఇవ్వడానికిబ్బంది పడుతూంటారు.. ఎవరిష్టం వారిదీ.. ఇచ్చేరని వెంటనే ఫోను చేసేయను.. వారికి ఇబ్బందిలేకపోతే, వారి అనుమతి తోనే నేనే ఫోను చేసి మాట్టాడ్డం అలవాటు.. దేశ విదేశాల్లోని ఎంతో మందితో మాట్టాడుతూంటాను ( వారి అనుమతి తోనే).. ఏం చేయనూ ఒకసారి పరిచయం అయితే  కానీసం ఓ పావుగంట కబుర్లు చెప్పడం ఖాయం.. ఏం చేయనూ, ‘స్నేహం ‘ చేయడం నా బలహీనత.

ప్రస్తుతం ఉన్న ఈ  Virtual world  లో ఎవరెవరో తెలిసికోవడం కూడా చాలా కష్టం.. నలుగురితో మాట్టాడితేనే కదా తెలిసేదీ..మన మాట పధ్ధతి, ప్రవర్తనా నచ్చిందా, మళ్ళీ మాట్టాడ్డానికి ప్రయత్నం చేస్తారు.. లేదా ఎవరికి వారే యమునా తీరే.. ఈ ఫోన్ నెంబర్ల పంచుకోవడం ప్రక్రియ వలన, నేను ఎప్పుడైనా , ప్రయాణాలంటూ చేస్తే, వారుండే ఊరుకి వెళ్ళడమంటూ తటస్థిస్తే, వారిని వ్యక్తిగతంగా కూడా కలవచ్చని ఓ ఆశ, ఇప్పటికి రెండు మూడుసార్లు హైదరాబాదులోనూ, రాజమండ్రీ లోనూ, తణుకులోనూ, భద్రాచలం లోనూ  కూడా జరిగాయి. వారు ఫోను చేసి కలవాలనుందని చెప్పినప్పుడు ఎంత సంతోషమనిపించిందో మాటల్లో చెప్పలేను.. ఇవన్నీ గత పుష్కరంలోనూ జరిగినవి.. ఇప్పటికీ ఆ స్నేహం అలాగే కొనసాగడం నా అదృష్టం. అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణల ధర్మమా అని, వారికి “ పూణె’ అనగానే నేనే గుర్తొస్తానని చెప్పడం, ఎంతో సంతోషం కలిగిస్తుంది.అంతే కాకుండా,  అలాటి స్నేహితులు, ఏ కారణం చేతైనా పూణె అంటూ వస్తే, తప్పకుండా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తూంటారు. అది మా అదృష్టం. ఇలాటివాటినే “  Feel Good “  అనేది.

 ఇప్పటికే 80 కి దగ్గరలో ఉన్నాను… ఇంక బతికేదెంత కాలం?  నలుగురితో కలిసి, వారి వారి అనుభవాల ద్వారా, కొత్త విషయాలు తెలుసుకోవడం లో నష్టమేమీ లేదని నా అభిప్రాయం.

ఇప్పుడంటే, ప్రసారమాధ్యమాలద్వారానూ,  సోషల్ మీడియా ద్వారానూ, “ సెలెబ్రెటీ’ లుగా మారిపోతున్నారు.   సమాజంలో పేరు తెచ్చుకోడానికి, నలుగురికీ నచ్చే పనేదో చేయాలనేది ‘ ఇదివరకటి’ మాట.. ఇప్పుడు  to hell with that concept.. ఓ దరిద్రపు పని చేసినా , మీడియా ద్వారా కావాల్సినంత పబ్లిసిటీ లభిస్తోంది.. ఒకానొకప్పుడు, పోలీసుల దృష్టిలో పడ్డమన్నా, అరెస్టవడమన్నా  జరిగితే , ‘ఆత్మహత్యలు’ చేసుకున్న ఉదంతాలు విన్నాము/ చదివాము.. ఇప్పుడో అలాటివన్నీ ఓ  STATUS SYMBOL  గా భావిస్తున్నారు. ఓ  ED Ride, IT Raid  లాటివన్నీ  సర్వసాధారణం అయిపోయాయి.. మన దేశంలో శాసన సభ్యుల పార్టీ మార్పిడి అనేది ఓ రొటీన్ అయిపోయింది. వారిగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

  నా చిన్నప్పుడు ఇలాటి ‘ ప్రచారసాధనాలు’ లేనిరోజుల్లో కూడా, చాలామంది వ్యక్తులు , తమ “ చేత”ల ద్వారానూ “రాత” ల ద్వారానూ గొప్పవారయారు. వారివారి రచనలంటే, ప్రాణం ఇచ్చేవారం.. ఏ లైబ్రరీకో వెళ్ళో, చివరాఖరికి కొన్ని చోట్ల అద్దెకు కూడా తెచ్చుకుని , పుస్తకాలు చదివిన రోజులున్నాయి. వారిలో మరో ‘ప్రత్యేకత’ ఏమిటంటే, వారి రచనలు, ఇప్పటిరోజుల్లోలాగ ‘Book promotion’  సభల ద్వారా ప్రసిధ్ధి చెందినవి కావు… జస్ట్ ‘ నోటిమాట’ ద్వారా ప్రచారమయేవి.. ఒక్కో పుస్తకం రెండో మూడో పునర్ముద్రణాలు కూడా వెళ్ళేవి.. కారణం వాటిలోని “ విషయం’ (content).  తెలుగురచయితల్లో చాలామంది గొప్పవారున్నారు.. ఇప్పటి రోజుల్లోలాగ  Virtual world  లో కాకుండా ‘నిజజీవితంలో పేరు సంపాదించిన వారు..   వారిపేర్లే వారి “ Brand name”  గా మారినవారు. అలాటివారిలో కొంతమందితో నాకు పరిచయం ఉండడం , నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తాను.  Facebook  ధర్మమా అని చాలామంది స్నేహితులని సంపాదించుకోవడం కూడా నా అదృష్టం.

అలా సంపాదించుకున్న ఒక ‘ స్నేహితుడు’  శ్రీ యండమూరి వీరేంద్రనాధ్  గారు.  అలాటి ప్రముఖ వ్యక్తి మనకు స్నేహితుడని చెప్పుకుంటే, మన ‘ స్టేటస్’ కూడా పెరిగిపోతుంది.  ఈ మధ్యన , నేను ప్రతీ రోజూ  Facebook  లో పెట్టే కొన్ని పోస్టులకి , ఆయన స్పందించడం నా అదృష్టం.. అంత గొప్పాయన కి నేను పెట్టిన పోస్ట్  నచ్చడం, దానికి ఆయన వ్యాఖ్య రూపంలో స్పందించడం ఓ  Feel good కదా మరి.. ఎలాగోలాగ ఒక్కసారి ఆయనతో మాట్టాడితే బావుండునూ అనిపించి, మొన్న, వారికి ఓ message  పెట్టాను.. ‘అభ్యంతరం లేకపోతే మీ నెంబరు ఇవ్వగలరా, నాది ఫలానా..’ అని.  స్పందన లేదు.. ఆయన్ని అలాగ అడిగే వారెంతమందో ఉండుంటారు.. పెట్టేదేమిటిలే అని వదిలేసుంటారనుకున్నాను.. ఇవేళ పొద్దుటే చూద్దునుకదా, వారి నెంబరు ఇచ్చారు..ఇంకా  online  లోనే ఉండడం గమనించి.. ముందుగా ధన్యవాదాలు చెప్పి, ‘ 9 గంటలకి  call  చేయొచ్చునా …అని అడిగితే.. ‘ sure’  అని జవాబిచ్చారు. ఇంకేముందీ తొమ్మిదెప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ… పూజ, బ్రేక్ ఫాస్టూ పూర్తిచేసుకుని కూర్చున్నాను. ఠంచనుగా 9 కి ఫోన్ చేస్తే , జవాబు లేదు.. పట్టివిడవని విక్రమార్కుడి లాగ మరోసారి చేసినా ఫలితం లేకపోయింది.

అప్పుడనుకున్నాను , ఏదో నెంబరంటూ ఇచ్చి, తన గొప్ప మనసు చాటుకున్నారే కానీ, మనం చేసే ఫోన్లతో వారి టైమెందుకు వేస్ట్ చేసుకుంటారూ..అని..  ఫోను రింగయి, పేరు చూస్తే యండమూరి వారిదే..మొట్టమొదటగా ఆయన, నేను ఫోన్ చేసినప్పుడు , ఎత్తలేకపోవడానికి ‘సంఝాయిషీ’..  చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? నేనేమైనా అడిగే ధైర్యం చేస్తాననే? కానీ ఇలాటి చిన్న చిన్న విషయాలకి ప్రాధాన్యం ఇవ్వడంలోనే ఉంటుంది గొప్పతనం. ఆయన రాసిన  Personality development పుస్తకాల్లో  ఊరికే రాసినట్టుగాకాకుండా, నిజజీవితంలో కూడా ఆచరించడం “ నిండుకుండల” ప్రత్యేకత.  ఏదో  Formal  గా పరిచయాలు, క్షేమసమాచారాలూ మాట్టాడుకుని, చివరగా ఆయన అనుమతి తోనే ఈ పోస్ట్.

 He made my day..thank you  యండమూరి వీరేంద్రనాథ్  గారూ..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పుస్తక ప్రపంచం…

ఈరోజుల్లో పుస్తకాల ఖరీదు ఆకాశాన్నంటుతూన్నా, ఇంకా కొంతమంది పుస్తక ప్రేమికులు ఉండబట్టే గా, “ పుస్తక ప్రదర్శనలు” ఇప్పటికీ నిరాటంకంగా జరుపుతున్నారూ… పాపం తమకు ఇష్టమైన పుస్తకాలు ఖరీదు ఎంతైనా కొనుక్కోవడమూ, వాటి గురించి ఫొటోలు తీసుకుని, ఫేస్ బుక్ లో పెట్టుకోవడమూ కొంతమందికి చాలా ఇష్టం..మూడేళ్ళ క్రితం కోవిడ్ టీకాలు వచ్చినప్పుడు కూడా ఇదే రంధి..ఎక్కడచూసినా అవే ఫొటోలు… ఎవరి సరదా వారిదీ.. వారిని విమర్శించడానికి కాదు ఈ పోస్ట్ .

పుస్తకాలు కొనకపోవడానికి, ఎవరి కారణాలు వారికి ఉంటాయి..

ఈరోజుల్లో పుస్తక ప్రచురణకి చాలా ఖర్చుపెట్టడం మూలాన, పుస్తకాల ఖరీదు లకి రెక్కలొచ్చేసాయి. అయినా చదివేవాళ్ళు కొంటూనే ఉంటారు.

కొంతమందికి, అరే నూటయాభై పేజీల పుస్తకం మరీ రెండేసివందలు పెట్టి కొనడం , అవసరమా అనుకునే ఆస్కారం ఉంది.

కొంతమంది అంతంత ఖరీదులు పెట్టి కొనలేక, ఊళ్ళో ఉండే ఏ గ్రంధాలయానికో వెళ్ళి చదివేవారూ ఉన్నారు.

ఈరోజుల్లో ఇంగ్లీషైనా, తెలుగైనా , టెక్నాలజీ ధర్మమా అని అన్నీ  PDF  రూపంలో, అంతర్జాలం లో ఉచితంగా దొరుకుతున్నాయి. ఆమధ్య వరకూ, అదేదో సైట్ లో లక్షపైగా, కొత్త ( latest editions)  కూడా దొరికేవి, ఈ మధ్యనే  మూసేసారు.. అలనాటి పుస్తకాలు చాలా మట్టుకు  Telegram  లోనూ  Internet Archives  లోనూ దొరకనే దొరుకుతున్నాయి. “అసలు సిసలు పుస్తకం, పేజీలు తిప్పుకుంటూ, ఓ పడక్కుర్చీలో కూర్చుని, ఆరారగా  భార్య పక్కనే పెట్టిన కాఫీయో, చాయో మధ్యమధ్యలో తాగుతూ, చదువుకోవడంలో ఉండే ‘మజా’,   ఇప్పుడొస్తున్న  Kindle  లో చదువుకుంటే ఎక్కడొస్తుంది మాస్టారూ…” అనేవారూ ఉన్నారు. ఎవరిష్టం వారిది.కొత్త పుస్తకం నుంచి వచ్చే సువాసన “ ఆఘ్రాణించడానికి” పెట్టిపుట్టాలి మాస్టారూ, అనేవారూ ఉన్నారు.

కొంతమందైతే ప్రపంచం లో ఎక్కడున్నా, వెతికి పట్టుకుని , ఖరీదెంతైనా కొని, తమ పుస్తకాల బీరువాలో అందరికీ తెలిసేలా, ఫొటోలు కూడా తీసి,  Social Media  లో పెడితేనే కానీ, నిద్రపట్టదు. 

 ఈ వ్యాసం ప్రస్తుతం ‘ తెలుగు పుస్తకాల గురించి మాత్రమే.ప్రస్తుత వాతావరణం లో, కనీసం భారతదేశంలో, ( విదేశాల్లో తెలుగు ఇంకా బతికే ఉన్నట్టు దాఖలాలు చాలానే ఉన్నాయి), ఈ ఆధునిక యుగం లో ఎంతమంది ఇళ్ళల్లో, ఇప్పుడున్నవారు కాకుండా, తరవాతి తరం వారిలో తెలుగు చదవగలిగినవారు , ఎంతమందున్నారో, గుండెల మీద చెయ్యేసుకుని, ఎంతమంది “ పుస్తకప్రియులు” చెప్పగలరూ?.. పాపం తెలుగు మాట్టాడ్డమైతే వచ్చు భగవంతుడి దయవలన, కానీ రాయడం, చదవడం నేర్చుకునే అవకాశం బహు తక్కువ. ముఖ్య కారణం విద్యావిధానం,  obcession with marks..ఎక్కడ చూసినా  Corporate Schools, Convents  మధ్యలో, తెలుగులో నవ్వితేనే మహాపాపం ట.    KG  నుండీ ఇంగ్లీషులోనే ఏడవడం నేర్పుతారుట  Oh mummy..  అంటూ. ఈమధ్య వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు లో పాఠాలు నేర్పేవారు. ఈమధ్య తెలుగు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయని చదివాము.. “ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలోనే బోధన..” అని.  కనీసం స్కూల్లోనైనా నేర్చుకుంటారనే ఆశ కాస్తా అడుగంటిపోయింది.  కొంతమంది తల్లితండ్రులకి ఎంతగానో ఉంటుంది.. తమ పిల్లలకి మాతృభాష నేర్పాలని… కానీ టైమెక్కడిదీ? రోజంతా హోంవర్కూ, ప్రాజెక్టులూ, శలవల్లో కూడా అవేవో మాయదారి  assignments  ట.. ఇంత హడావిడిలో, ఆ పసిప్రాణాల్ని “ తెలుగు” తో హింసించడం  ఎందుకూ ..అనుకుని, ఆ “ తెలుగు యజ్ఞం” కి మంగళం పాడేస్తారు. “కథ కంచికీ మనం ఇంటికీ”.

ఏదో  ఇల్లులాటివి  ఉన్నవాళ్ళెవరో , పుస్తకాల కోసం , “ బీరువాలేం కర్మ, విడిగా గదులు కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ ఈరోజుల్లోని “ ఎపార్ట్మెంట్’ లలో పుస్తకాలకి ప్రత్యేకంగా ఓ రూమ్ము కేటాయించడం, ఏదో పిల్లలతో కాకుండా, విడిగా ఉంటే సాధ్యమేమో కానీ,  సెంటిమెంటుకో, అవసరార్ధమో పిల్లలతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా కష్టమేమో అని నా అభిప్రాయం.కొత్త దంపతులకి పిల్లలు పుట్టేదాకా, ఈ దబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లు బాగానే ఉంటాయి..ఓ పిల్లో పిల్లాడో పుట్టాక, అమ్మమ్మ/నానమ్మ తో మనవరాలో మనవడో… తాతయ్యగారికి ఏ బాల్కనీలోనో, హాల్లోనో మడత మంచమూనూ.ఇంత హడావిడిలో పుస్తకాలకి ప్రత్యేక హోదా కావాలంటే కుదిరే పనేనా? ఇవన్నీ ముందరే ఊహించి, కొంతమంది విజ్ఞులు పుస్తకాలు కొనడం మానుకున్నారు.

 ఇన్ని అవరోధాలు దాటుకుంటూ పుస్తకాలు కొని ఎవరిని ఉధ్దరించడానికీ అనుకునేవారు కొందరూ.. పుస్తకాలు అమ్మడానికి ఇచ్చిన కొట్టువాడు, పాపం కొద్దికాలం, తన కమిషన్ తగ్గించుకుని, తృణమో పణమో ఇస్తాడు.. చివరకి తన  inventory  పెరిగిపోతోందని, అమ్ముడు కాని పుస్తకాలు , రచయితకి తిరిగి ఇచ్చేస్తాడు..చివరకి ఆ రచయిత, ఈమధ్యన సోషల్ మీడియాలో జరిగే పదబంధాలకి, ప్రహేళికలకీ.. బహుమతి గా ప్రదానం చేయడమో, లేక ఇంటికి ఎవరైనా వచ్చినా, తను ఎవరింటికైనా వెళ్ళినా వారి చేతిలో పెట్టడం .

 పాతిక ముఫైసంవత్సరాలక్రితం  పుస్తక ప్రచురణ కిట్టుబాటయేది.. కొంతమంది ప్రసిధ్ధ రచయితలు “కోటేశ్వరులు” అయారనడం లో సందేహం లేదు. ఒక్కోపుస్తకం నాలుగైదు ప్రచురణలకి కూడా వెళ్ళేది.వాటికి కూడా కారణాలనేకం.. కొంతమంది రచయితలు తమకున్న “ పలుకుబడి” తో , రాష్ట్రం లో ఉండే ప్రతీ ప్రభుత్వ గ్రంధాలయం లోనూ, వారిచేత “కొనిపించి” పెట్టగలిగేవారు. అవేకాకుండా, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ కూడా..ఇవేకాకుండా, పుస్తకం “ content “ ని బట్టి , కిళ్ళీకొట్ల ద్వారా, పుస్తకాలు “అద్దెకు’ కూడా దొరికేవి, చవకలో పనైపోయేది. ఇన్నేసి అవకాశాలున్నప్పుడు, పేరొందిన రచయితలు “ కోటీశ్వరులు” అవడం లో ఆశ్చర్యం ఏముందీ? అసలు వారు రాసే నవలలో, కథలో చదువరులకు నచ్చడం ముఖ్య కారణం.. పుస్తక ప్రపంచం లో ఓసారి పేరొచ్చాక, సాధారణంగా జీవితాంతం ఆ ప్రఖ్యాతి ఉంటూనే ఉంటుంది కూడా.. కొన్ని పత్రికలైతే, రచయిత పేరు చూసి, బహుమతులు కూడా ఇవ్వడం చూసాము..అందులో  content  ఎలా ఉన్నాసరే..

 కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటీ?పుస్తక ప్రచురణకి ఒకానొకప్పుడున్న ప్రముఖ సంస్థలు మూతబడిపోయాయి.. కారణం “కిట్టుబాటు” కాకపోవడం మూలాన. పుస్తకం “అచ్చు” వేయడానికి , ఏదో ఓ Estimate  ఇస్తారు,వాళ్ళు చెప్పే ఖరీదుకి, మహా అయితే, ఎక్కీ తొక్కీ ఓ 500-600 పుస్తకాలకి ఆర్డరిస్తారు. ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే అమ్ముడవవుగా,ఏదో పుస్తకాల షాప్ వాడిని పట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళకి కమిషనూ..పుస్తకానికి ఇంత .. అని.. పోనీ ఆ షాపు వాడైనా నిజాయితీగా , మన పుస్తకాన్ని అమ్ముతాడా అంటే .. తనేమైనా మన మేనత్తకొడుకా ఏమిటీ… మనలాగ “కమిషన్” ( పుస్తకం అమ్మడానికి) ఇచ్చే రచయితలు ఎంతో మందుంటారు..ప్రస్తుత  Commercial atmosphere  లో, ఎవడెక్కువిస్తే , వాడి పుస్తకమే  Prominent  గా కనిపిస్తుంది పుస్తకాల  దుకాణం లో..అదీ నలుగౌరైదుగురు రచయితల  genre  కూడా ఒకటే అయితే..అంతే సంగతులు.. ఎవరి పుస్తకం  Best Seller  గా ఉంటుందో అడగక్కర్లేదు.  రాసిన పుస్తకాలకి వార్తాపత్రికల్లో రివ్యూలు రాయడానికి, ప్రతీ పేపర్ వాడికీ , ఉచితంగా తన పుస్తకం పంపిణీ చేయాలి. ఇవన్నీ ఓ ఎత్తూ, ఈ పుస్తకాల   “ ఆవిష్కరణ” మరో ఎత్తూ.. ఎవరినో పట్టుకుని, ఓ సభ ఏర్పాటు చేయాలి, ఓ ముఖ్య అతిథి, వక్తలు ఏర్పాటు చేయాలి..ఇదివరకటి రోజుల్లో, ఆ “ మహాసభ” కి వచ్చిన ప్రేక్షకులకి , ఆవిష్కరణ చేసిన పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలో, ఆ కార్యక్రమానికి స్వస్థి చెప్పి, వేదికమీద ఉండే ప్రముఖులకి మాత్రమే ఇచ్చి, కావలసిన వారు ప్రాంగణం బయట పెట్టిన స్టాల్ లో కొనుక్కోమంటున్నారు.

చివరకి ఆతావేతా తేలిందేమిటంటే, ఏడాదికోసారి ఏ హైదరాబాదులోనో, విజయవాడలోనో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఎన్ని పుస్తకాలు అమ్ముడైతే అన్ని విక్రయించుకుని సంతోషించడం మిగిలింది.

 ఇదేదో ఎవరినీ చిన్నబుచ్చడానికి కానీ, పుస్తక ప్రదర్శన నిర్వాహకులని హేళన చేయడానికి కానీ రాసింది కాదని, వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నది మాత్రమే..

ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకోమని మనవి. ఇంక అయితే పుస్తకాలు రాయడం మానేసి, మాలో ఉన్న సృజనాశక్తి మాటేమిటీ అనొచ్చు.. రాయడం మానేయమని ఎవరన్నారు? హాయిగా రాసుకోండి.. అభివృధ్దిచెందుతున్న టెక్నాలజీ ఉపయోగించుకుని, అంతర్జాలం లో….

సర్వే జనా సుఖినోభవంతూ

లక్ష్మిఫణి -బాతాఖాని కబుర్లు–జ్ఞానోదయం

గత యాభై ఏళ్ళగా, మెడ్రాస్ లో రుచిమరిగిన  BRU Instant Coffee  కే అలవాటు పడిపోయాము. మిగిలినవి బాగోవని కాదు… ఎవరి taste  వారిదీ.. మొదట్లో బయట మార్కెట్ లో కొనేవాడిని, ఆ తరవాత మా  CSD Canteen లో దొరికేది, పైగా బయటకంటే చవకలో… ఓసారెప్పుడో, ఓ కొట్టతను అడిగాడు..’ మీకు కావాల్సిన BRU, మీ కాంటీన్ ధరకంటే తక్కువకి ఇస్తానూ… కొంటారా రెగ్యులర్ గానూ..’ అని అడిగాడు. చూపించమంటే చూపించాడు..  HUL వారి దే..  Tripti Blended  అని ఏక్ దం బ్రూ కాఫీయే.. సగానికి సగం రేటులో దొరికేది.. విషయమేమిటంటే, 200 gms Packets  5 ఉంటాయి, పేద్ద carton  లో, వాటిని విడిగా అమ్మేవాడు.. వాడెలా అమ్మితే మనకేమిటీ..మనక్కావల్సినదేదో దొరుకుతోంది..అదే బ్రాండ్ అదే కాఫీ.. కొద్దిగా పేరు తేడా.. మా రాజమండ్రీ కాపరం లో కూడా, మొదట్లో దొరికేది కాదు..కిరాణా కొట్టువాడితో చెప్తే.. HUL agent  ద్వారా తెప్పించి ఇచ్చేవాడు.. ఆ రోజుల్లో  Amazon లో 1 కిలో Packet ( Five Sachets of 200 gms)  దొరికితే, మా చుట్టాలకి తెప్పించాను కూడా..అదంతా పూర్వ కథ…

ఈ కరోనా ధర్మమా అని, ఇంటి బయటకి 2020 మార్చ్ తరవాత అడుగు బయటకు పెట్టలేదు..ఏదో మొదట్లో,  సరుకులు తెప్పించుకోడానికి శ్రమ అనిపించినా, క్రమక్రమంగా ,అలవాటయిపోయింది. ఈ రెండేళ్ళలోనూ అనుభవం తో పాటు జ్ఞానోదయం కూడా అయింది. సాధారణంగా  Amazon  లో, చాలామట్టుకు సరుకులు దొరుకుతూంటాయి..పైగా మనం ఆర్డర్ చేసిన సరుకు ఏ కారణం చేతైనా ,నచ్చకపోయినా, నప్పకపోయినా, వెంటనే తిరిగి తీసుకునే సౌలభ్యం కూడా ఉండడం తో, నామట్టుకు నేను, చాలా సరుకులు , అక్కణ్ణించే తెప్పించుకునే వాడిని. పైగా  free delivery  అనడంతో, నిజమే కాబోసు… మనమంటే ఎంత అభిమానమో.. అనుకునేవాడిని.. ఓ ఐటం విషయంలో మాత్రం అది కాదని తేలింది.

 ప్రస్తుతానికి వస్తే, 2020 లో కరోనా వచ్చాక బయటకి వెళ్ళకపోవడంతో,  Amazon  వాడే దిక్కయాడు..200Gms Packet కి 365   చొప్పున వసూలు చేసేవాడు గత రెండేళ్ళగా.. పైగా  Free Shipping  అనోటీ..మరో option  లేక అలాగే కానిచ్చేసేవాడిని. ఈ మధ్య ఓరోజున, నాకు ఇదివరకు అదే   Bru  ఇచ్చే కొట్టతనికి ఫోన్ చేసి అడిగాను.. ఇంకా ఇదివరకటిలాగ దొరుకుతోందా, రేటెంతా అని..రేటెంతో చెప్పగానే, గత రెండున్నరేళ్ళుగా నేను ఎంత బుధ్ధితక్కువ పని చేసేనో తెలిసింది.  Amazon  వాడు అమ్మిన 365/- రూపాయల 200 Gms Sachet,  అక్షరాలా 150/- రూపాయలన్నాడు.. పోనీ ఏ ఆటోలోనో వెళ్ళి ఓ రెండు మూడు పాకెట్లు కొన్నా, కిట్టుబాటవుతుందీ అనుకుంటే,  ఊబర్ ఆటో కి రానూపోనూ 250 దాకా పెడితే, మొత్తం తడిపి మోపెడవుతుంది. పోనీ ఏ  DUNZO  వాడిని అడిగితే వాడు 150/-  Charges for pick up and delivery  అన్నాడు. ఇవన్నీ ఆ కొట్టతనికి ఫోన్ చేసి చెప్పాను ( తెలిసినవాడేలెండి)..నా Address  తీసుకుని, రెండు పాకెట్లు ( రెండూ కలిపి 300/-) + కొరియర్ ఛార్జెస్ 80. అంతాకలిపి 380 లో రెండు పాకెట్లు దొరికాయి.

 అప్పుడు తెలిసింది.. మన e commerce కంపెనీలు, ఎలా దోచేస్తున్నారో?

అలాగే హైదరాబాద్ నుండి ఓ ఐటం తెప్పించడానికి ఓ కొరియర్ కంపెనీ వాడు.. 190/- రూపాయలు ఛార్జ్ చేసాడు.. ప్రొఫెషనల్ కొరియర్స్ వాడు. హైదరాబాదు నుంచి పుణె సరుకు  deliver  చేయడానికి 10 రోజులు. నడిచొచ్చినా 10 రోజులు పట్టదు.

 అదేవిటో, మొదటినుండీ నేను షేవింగ్ చేసుకునేటప్పుడు,  Godrej  వారి shaving round  వాడడమే అలవాటు..ఆ క్రీమ్ములూ వగైరా వాడను. కరోనా పూర్వం బయట కొట్టుకి వెళ్ళి కొనుక్కునేవాడిని..ఖరీదు 22/- రూపాయలు.. ఓ నాలుగైదు నెలలు వస్తుంది. కరోనా టైములో, బయటకి వెళ్ళే అవకాశం లేక, ఈ ఎమజాన్ లో తెప్పించుకుంటే, 44+ Shipping 50/- మొత్తం 94 అయింది. మరోసారి తెప్పించే ఆలోచన వచ్చి, ఓసారి మా కాంప్లెక్స్ లో ఉండే కిరాణా కొట్టులో అడిగితే, రెండు రౌండులు కలిపి 44/- లో దొరికాయి.

 చెప్పొచ్చేదేమిటంటే, మన  e-commerce వాళ్ళు చెప్పుకునేటంత ఉదారస్వభావులు మాత్రం కారు.. ఈ మధ్యన జొమాటో, స్విగ్గీ వాళ్ళైతే , ఏవేవో ఛార్జీలతో కలిపి, తీసుకునే సరుక్కి మూడింతలు వదులుతోంది..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Obituary.. Ordnance Factories.. R I P…

 ఎంతో కాలం , మనజీవితాలతో ముడేసుకున్న కొన్ని విషయాలు,  కనుమరుగైపోయినప్పుడు కలిగే బాధ మాటల్లో వ్యక్తపరచడం చాలా కష్టం..  ఎవరైనా వ్యక్తి స్వర్గస్థులైతే, “ మనిషన్నవాడికి ఏదో ఓ రోజు మరణించడం తప్పదుగా..” అనే వేదాంతమైనా ఉంది.. కానీ, మన జీవితాలకి ఓ ఆలంబన గా ఉండి, కన్నకలలు సాకారం చేసుకోడానికి దోహదపడ్డ, ఓ సంస్థ కనుమరగైపోవడం చాలా బాధాకరం.. దీన్ని సమర్ధించడానికి ఏ వేదాంతమూ సరిపోదు..

 నేను ప్రస్తావిస్తున్న సంస్థ.. 42 సంవత్సరాల అనుబంధం ఉన్న ,  గర్వంగా చెప్పుకోగలిగిన  “ ఆయుధ నిర్మాణ కర్మాగారాలు” (  Indian Ordnance Factories)..   నేను 1963 లో చేరిన కొత్తలో , దేశం మొత్తం మీద 39 ఉండేవి.. కాలక్రమేణా 41 దాకా పెరిగాయి.240 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. చేయగలిగినదేమీ లేదు… In the name of  “  ఆత్మనిర్భరత.. వీటిని ఓ 7  Corporations  గా తయారు చేసారు..అవి ఎంత బాగా పనిచేస్తాయో.. time only will tell.. ఈ  process  కరెక్టా కాదా అని చెప్పడానికి కాదు ఈ పోస్ట్.. ఆ సంస్థలో పనిచేయడం మూలాన నేను నేర్చుకున్న జీవిత పాఠాల గురించి చెప్పడానికే ఈ పోస్ట్ ల సీరీస్

1963 లో పూనా లోని  High Explosives Factory  లో చేరాను..150/- రూపాయల  మూల వేతనంతో..ఆరోజుల్లో డబ్బుకి ఓ రకమైన విలువ ఉండేది.. 18 సంవత్సరాలు నిండగానే ఉద్యోగంలో చేరాను..1000 కిలోమీటర్ల దూరాన్నుంచి, వచ్చి ఆ వయసులో నెగ్గుకురావడం కూడా ఓ ఎడ్వంచరే మరి..కానీ అందులో నాగొప్పతనం కంటే, ఆనాటి పరిస్థితులూ, స్నేహితులూ పేద్ద పాత్ర వహించారు.  మూతిమీద మీసం కూడా రాని , నా వయసురీత్యా నన్ను, మా కొలీగ్సూ , పై అధికారులూ కూడా ఓ తమ్ముడిలాగే చూసి, తెలియని విషయాలన్నీ నేర్పారు. అవసరం వచ్చినప్పుడు ఓ సారి లాలించి, ఓసారి గారం చేసి, ఒక్కోప్పుడైతే కోప్పడిన రోజులు కూడా ఉన్నాయి.కానీ అక్కున చేర్చుకున్నారు..ఆ విషయంలో సందేహం లేదు.

 18 సంవత్సరాల పాటు, తెలుగు తప్ప మరో భాష వినని, ద్వీపం లాటి మా అమలాపురం ( కోనసీమ) నుండి,ఒక్కసారిగా .. అదేదో ఓ చెట్టుని  Transplant  చేసినట్టయిపోయింది.. భాష రాదూ.. తెలిసున్న హిందీ ఏదో సినిమాల్లో /రేడియోల్లో విన్న భాషాయే.. ఇంక ఇంగ్లీషంటారా  ఎంత చెప్పుకుంటే అంత తక్కువ.. పైగా వీటికి సాయం ఇక్కడి భాషేమో  “మరాఠీ”.. ఏదో నా అదృష్టం కొద్దీ, మన తెలుగు, మరాఠీ భాషలలో , పదాలకి చాలా పోలికలున్నాయి.. ఏదో ఓ ఇంగ్లీషు ముక్క, సగం తెలుగు + ఓ సంజ్ఞ చేసేసి పని కానిచ్చేసేవాడిని..బస్సులో ఎక్కినప్పుడు కండక్టర్ ‘చుఠ్ఠా దేవో’ అనేవాడు.. వీళ్ళందరూ అడిగి మరీ కాలుస్తారేమో ‘ చుట్టలు’ అనుకునేవాడిని, మొదట్లో… చుఠ్ఠ అంటే చిల్లర అని మొత్తానికి అర్ధమయింది.  18 సంవత్సరాల “డొమీనియన్ ప్రతిపత్తి” నుండి “రిపబ్లిక్” లోకి మారిపోయానుగా, హిందీ సినిమాలు చూసేసి, భాష మీద ఓ రకమైన ‘పట్టు’ సాధించేసాను. మా ఫాక్టరీలో   most sensitive Initiatory Explosives  తయారు చేసే సెక్షన్ లో వేసారు.   Safety విషయంలో.. అతి చాధస్థంగా ఉండాల్సొచ్చేది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ప్రాణాలకే ముప్పు అని తెలిసినది అప్పుడే.. అప్పటినుంచే ఈ  Safety Precautions  అన్నవి  by default  ప్రవేశించేసాయి.. భావి జీవితంలో ఎంతో ఉపయోగించాయి. దానికి సాయం 1966 నుండీ , నన్ను  Safety Section  లో వేయడం వలన, అదీ ఓ Chemical Factory  లో..దేన్నీ ‘ take it for granted ‘  గా తీసుకోకూడదని తెలిసింది..ఆ ఫాక్టరీలో  Acids, TNT  కూడా తయారుచేసేవారు.. 24 గంటలూ పనిచేసేది.. మాకు కూడా Shifts  లో వెళ్ళాల్సొచ్చేది..ఓరకంగా చూస్తే జీవితంలో ఓ రకమైన క్రమశిక్షణ అలవాటయింది.. ‘పేద్ద గొప్పే.. కావాలంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు..’  అనుకోవచ్చు.. కానీ నిద్రపోతున్న సింహం బోనులో, రాత్రీ పగలూ ఉండడం కూడా కష్టమే..అక్కడ తయారుచేసే Explosives ఎప్పుడు పేల్తాయో తెలియదు.. దేశసరిహద్దులో పనిచేసే సైనికులకి సర్వీసులో కొంతకాలమైనా  Peace Area  లో పోస్టింగుంటుంది..కానీ, మా  Ammunition & Explosives  తయారుచేసే ఫాక్టరీల్లో అలాటి అవకాశాలుండవు.. రాత్రీ పగలూ వాటితోనే సహజీవనం..కట్టుకున్న మనిషి ‘ తాళి’ గట్టిదైతే ఉన్నట్టూ లేకపోతే గోవిందో గోవిందా..

  నా 42 ఏళ్ళ సర్వీసులోనూ, అన్ని రకాల విభాగాల్లోనూ పనిచేసే అదృష్టం కలిగింది.. ఏ విభాగమైనా సరే, వాటి రూల్సూ , రెగ్యులేషన్సూ అర్ధం చేసుకుంటే చాలు.. రాజ్యం చేయొచ్చు.. సెక్షన్ లో పనిచేసే వారి దగ్గర నేర్చుకోడానికి సిగ్గుపడకూడదు.. మనకి పని మీద పట్టంటూ ఉంటే, ఎవరికీ తలవంచాల్సిన అవసరం ఉండదు..అదే పధ్ధతిలో 42 ఏళ్ళూ, పనిచేసిన ఫాక్టరీ జనరల్ మానేజర్లతో సత్సంబంధాలే ఉండేవి.. అవేమీ ఏదో ‘ కాకా ‘ పట్టి సంపాదించినవికూడా కాదు.. pure hard and sincere work  అని గర్వంగా చెప్పుకోగలను.. I enjoyed every moment of my 42 Years of working life… maintained cordial relations with everybody from the Highest to the lowest, including Union Leaders. నాలా ఫాక్టరీల్లో పనిచేసిన వారికి తెలుస్తుంది ఎంత కష్టమో.. ఓ అశిధారా వ్రతం లాటిది..కానీ భగవంతుడి దయవలన అన్ని సంవత్సరాలూ ఎవరిచేతా మాట పడకుండా, పూర్తిచేయగలిగాను..

ఈ 42 ఏళ్ళ ప్రయాణంలోనూ నాకు కలిగిన అనుభవాలు రాస్తాను… Learnt a lot…

 జీవితంలో అతిముఖ్యమైన ‘ అవయవం’ కనుమరుగైపోతోందంటే బాధే కదా మరి..

 This is my humble tribute to my   Ordnance Factories…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. O T T ల్లో వస్తూన్న తెలుగు కళాఖండాలు…

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, అంటే, టెలివిజన్లు వచ్చిన కొత్తలో కూడా, సినిమాలు , సపరివారకుటుంబ సమేతంగా చూడగలిగేవిగానే ఉండేవి.. మరీ ఈ రోజుల్లో ఉన్నట్టు , విచ్చలవిడిగా ఉండేవి కావు. అలాగని నేనేదో ఛాందసుడినని అనుకోవద్దు. దేనికైనా ఓ ‘ హద్దు’ ఉంటుంది… సన్నని గీత లాగ… అది దాటితే అసహ్యం వేస్తుంది… చూడగా చూడగా వెగటుకూడా పుట్టే అవకాశం ఉంది. ఈ విషయం, నిర్మాతలకి, దర్శకులకీ తెలియదంటారా? లక్షణంగా తెలుసు..అయినా రాత్రికి రాత్రి డబ్బుచేసుకోవడమే వారి టార్గెట్..

ఈరోజుల్లో ఎలాటి శ్రమా లేకుండానే, మన ఇంట్లోనే కూర్చుని చూసే సౌలభ్యం, ప్రస్తుతం టీవీ/ స్మార్ట్ ఫోన్ ల ధర్మమా అని లభిస్తోంది.  O T T  లలో చూపించే, Web Series, Movies  వీటికి ప్రత్యక్ష సాక్ష్యాలు. వీటికి కూడా ఏదో  censoring  ఉంటుందని అప్పుడెప్పుడో ప్రకటించారు. ఆ విషయం అనుకున్నట్టుగానే, ప్రకటనకే పరిమితమయింది.  మన సినీప్రముఖులు అలాటివి జరగనిస్తారని ఆశించడం కూడా తప్పే.. ఎంతోమందికి  stakes  ఉన్నాయి …

 ఒకానొకప్పుడు గుర్తుందా… బ్లూ ఫిల్మ్స్ అని ఉండేవి.. మరీ పబ్లిగ్గా చూడ్డానికి వెనకాడేవారు..పైగా రహస్యంగా అలాటివి ప్రదర్శించే స్థలాలని, పోలీసులు raids  చేసి , వేసేవారినీ, చూసేవారినీ కూడా అరెస్ట్ చేసేవారు.

 ఒకానొకప్పుడు సెన్సార్ వారు, ఓ అభ్యంతరకరమైన  మాట / సంభాషణ / డాన్స్ లాటివి ఏదున్నా, పుటుక్ మని కట్ చేసేయడమే..  కొన్ని కొన్ని విషయాలైతే..  Viewer’s imagination  కే వదిలేసేవారు.. ఉదాహరణకి , ఏ స్త్రీమీదైనా అత్యాచారం జరిగితే.. ఏవేవో  figurative /graphic  గా చూపించేవారు. శృంగారం విషయానికొస్తే .. ఓ రెండు పువ్వులూ, ఓ తుమ్మెద తో చూపించి పని కానిచ్చేసేవారు. కాలక్రమేణా, ఆర్ధిక సంస్కరణలతో పాటు, ప్రతీ రంగం లోనూ “ సంస్కరణలు” రావడం ప్రారంభమయింది.. దానికి సాయం ఓ కొత్త స్లోగన్ “ పారదర్శకత్వం (  Transparency)”  రంగం లోకి వచ్చేసింది..  Nothing should be left for imagination.. it should be crystal clear.. అంతే.. దురదృష్టం ఏమిటంటే, దీన్ని  selective  గా ఉపయోగించడం.. అదేదో  R T I (  సమాచార హక్కు) అన్నారు.. దేశంలో ఏ పౌరుడైనా, ఏ విషయం గురించైనా అడిగే హక్కు..ప్రభుత్వాలను ఇరుకులో పెట్టే “ విషయాలు” ఈ చట్ట పరిధిలోంచి తీసేసారు.చట్టాలు చేసినట్టూ ఉంటుంది.. కావాల్సినవేవీ చెప్పాల్సిన అవసరమూ ఉండదూ..ఉభయతారకం.

 ఒకానొకప్పుడు “ మేధావులు” కొందరు, మన దేశ సంస్కృతి ,  Western Culture  వలన భ్రష్టు పడిపోతోందని ఎలుగెత్తి  అరిచిన రోజులు చూసాము… చూసామేమిటిలెండి, ఇప్పటికీ టీవీ ల్లో జరిగే “ అర్ధవంతమైన చర్చ “ ల్లో చూస్తూనే ఉన్నాము. ఆ చర్చ లే ఓ పేద్ద కామెడీ..ప్రతీవాడు తన అమూల్యమైన  Expert advice  ఇచ్చేవాడే..

 అసలు చెప్పాలంటే , ఈరోజుల్లో వస్తూన్న వివిధ భాషల్లో వచ్చే సినిమాలు  చూడ్డానికి అసహ్యం వేస్తోంది.. ఒకానొకప్పుడు, మలయాళం సినిమాల మీద పడి ఏద్చేవారు.. వాళ్ళ సినిమాలన్నీ  adult content  అని… కానీ ఈ రోజుల్లో వారు తీసే సినిమాలే  dignified  గా ఉన్నాయి, ఓ కథా కమామీషూ కూడా ఉంటోంది. హిందీ కొంచం పరవాలేదు.. మరాఠీ సినిమాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా బాగానే ఉంటున్నాయి.

అసలు దౌర్భాగ్యమంతా మన తెలుగు భాషా చిత్రాలతోనే..

హీరోకీ విలన్ కీ తేడా తెలియదు.. అందరూ “ బూచాడు’ గెడ్డాలతోనే.. ఏదో ప్రాంతీయ యాస ముసుగులో అర్ధం కాని భాష..ఉన్న గంట/ గంటన్నర సినిమాలోనూ , viewer’s imagination  అవసరం లేకుండా, విచ్చలవిడి శృంగారం చూపిస్తే డబ్బులొచ్చేస్తాయనే అపోహ..మామూలుగా కాపరాలు చేసుకునే సంసారుల కి కూడా అంతంత శృంగారాలు చేసుకునే టైముంటుందనుకోను.. Just disgusting… అలాటప్పుడు చూడ్డం ఎందుకూ అని అడగొచ్చు.. బుధ్ధిలేక, తిన్న తిండరక్కా..అనే చెప్పాలి.

ప్రతీ రోజూ టీవీ లో న్యూస్ చూసినా, పేపర్లలో వార్తలు చదివినా, ఎక్కడో ఎవడో అత్యాచారం చేసారనే వార్తే.. ఆ చేసినవాడదృష్టం బాగోపోతే, ఓ మూడురోజులు కనిపించకుండా పోయినా, నాలుగో రోజు ఏ రైలు పట్టాలమీదో శవమై తేలుతాడు..లేదా పట్టుబడినా, బెయిల్ దొరకడం ఏమంత పెద్దపనీ కాదూ.. ఏనైనా అంటే.. not guilty till proved..ఆమధ్యన వాడెవడో  ఓ ప్రముఖ నటి భర్త ట. హాయిగా బెయిల్ మీదొచ్చేసాడు.. అలాగే డ్రగ్స్ కేసులు.. మీడియాలో కొట్టుకు ఛస్తున్నారు..

మరి ఈ ఐడియాలన్నీ ఎవరి ధర్మం ట? మన నాయకులూ, మన సినిమాలూ..నూటికీ కోటికీ ఓ మంచి సినిమా  by mistake and not by intention  రావొచ్చు..

 మన “మేధావులు” ఈరోజుల్లో   O T T ల్లో వచ్చే తెలుగు “ కళాఖండాల” మీద తమ అమూల్యమైన “ అభిప్రాయా”లని, సోషల్ మీడియా ద్వారా చెప్తూంటారు… ఏ  సినిమా అయినా “ఆర్ట్” క్యాటగీరీయే వాళ్ళకి.. వీరి పరిభాషలో “ ఆర్ట్” అంటే  శృంగారం అన్నమాట.. ఇదివరకటి రోజుల్లోనూ వచ్చేవి ఈ “ ఆర్ట్” సినేమాలు.. ఉదాహరణకి షబానా ఆజ్మీ, అలాటి చాలా సినిమాల్లో నటించారు..అలాగే స్మితాపాటిల్ కూడా.శ్యాంబెనెగల్ లాటి దర్శకులు.. శృంగారాన్ని కూడా  dignified, polished  గా చూపించేవారు..

అసలీ గొడవంతా ఎందుకంటే, ఓ పెద్దాయన, అమెరికా నుండి ఓ సాహిత్య అంతర్జాల మాస పత్రిక నిర్వహిస్తూంటారు.. ఆయన Facebook  లో ఓ తెలుగు సినిమాగురించి  ప్రస్తావిస్తూ.. తాను చూడలేనందుకు ఎమ్తో బాధపడుతూ ఓ పోస్ట్ పెట్టారు.. సినిమా పేరు “ ప్రియురాలు”.. అయ్యో పాపం.. చూడలేకపోయారూ,, మనకి O T T  లో అందుబాటులో ఉందీ.. పోనీ చూద్దామూ.. అంత పెద్దాయన చెప్పారూ .. అనుకుని చూసాను..

అసలు ఆ సినిమాద్వారా ఏం చెబ్దామనుకున్నాడో ఆ దర్శక నిర్మాత అర్ధం అవదు.. పావుగంటకో సారి మంచం మీదపడి దొల్లడం, ముద్దులు పెట్టుకోవడం.. వీళ్ళిద్దరికీ సాయం మరో జంట శృంగారం కూడా బోనస్.

మరో విచిత్రం.. హీరో గారిని హీరోయిన్ మొదటి సారి చూసినప్పుడు వాడు పై బట్టలేకుండా ఓ “యజ్ఞోపవీతం” తో కనిపిస్తాడు.. తరవాత మళ్ళీ కనిపించదు, పైబట్ట లేకుండా కూడా.. ఏమో పొరబడ్డానేమో అనుకున్నా… అబ్బే , హీరో తండ్రి అడుగుతాడు..” నీ జంధ్యం ఏదిరా? తప్పు చేస్తున్నావని తీసేసావా..? “ అంటూ..మరో విషయం..రెండు జంటలవి కూడా ,  infidelity  కేసులే..

 సినిమా ద్వారా ఏం “ నీతి” బోధించాలనుకున్నారో ఆ సినిమా, దర్శక, నిర్మాత,రచయిత… ఆ భగవంతుడికే తెలియాలి.

 ఈమధ్యన ఈ  O T T  ల్లో వస్తూన్న సినిమాలు ఒకదాన్ని మించి మరోటి  దౌర్భాగ్యంగా ఉంటున్నాయి.

సర్వేజనా సుఖినోభవంతూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. టైంపాస్..

  ఒకానొకప్పుడు కిళ్ళీకొట్లలో అద్దెకు తీసుకుని, తెలుగు పుస్తకాలు  ( Pocket Books)  చదివినరోజులు గుర్తున్నాయా? స్కూలుఫైనల్ పూర్తిచేసుకుని, కాలేజీలో చేరగానే, ఏదో “ పెద్ద మనిషి” అయిపోయాననే ఫీలింగోటి వచ్చేది.. అప్పటిదాకా, ఏవో క్లాసుపుస్తకాలకే పరిమితమయిన , మన range కొద్దిగా పెరుగుతుంది.పొరుగూరికి వెళ్ళి హాస్టల్లో ఉండే పిల్లల గురించైతే చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు.. అలాగని మరీ బరితెగించేసారనీ కాదూ…ఇళ్ళల్లోనే ఉండి, కాలేజీ చదువులు వెలగబెట్టిన నాలాటి వారి మీద కొద్దిగా ఆంక్షలలాటివి ఉండేవి.. కిళ్ళీకొట్లలో , మరీ పబ్లీగ్గా వెళ్ళాలంటే, ఏ తెలిసినవారి కళ్ళల్లోపడితే, ఇంట్లో చెప్పేస్తారేమో అనో భయం..ఇంట్లోనే ఉండి చదువుకోవడం మూలాన,  Pocket money  లాటి సదుపాయాలుండేవి కాదు..అలాగని మరీ స్ట్రిక్టూ అనీ కాదూ, ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిసి ఏ సినిమాకైనా వెళ్దామనుకుని, డబ్బులు అడిగినప్పుడు, బీరువాలో ఉన్నాయీ తీసుకోరా అనేవారు.. అలాగ స్వతంత్రం ఇచ్చారుకదా అని, మరీ ఎక్కువా తీసుకునే ధైర్యమూ ఉండేది కాదూ.. ఆనాటి కాలమానపరిస్థితులు మరి అలాగే ఉండేవి.. ఆరోజుల్లో వచ్చే Pocket edition  డిటెక్టివ్ పుస్తకాలు… ఒకటా రెండా? కిళ్ళీకొట్లలో, తమాషాగా, ఓ పురుకోసకి కట్టి వేల్లాడతీసేవారు.. పబ్లీగ్గా తీసుకోగలిగిన పుస్తకాలు.. కానీ మరికొన్ని.. అర్ధమయిందిగా.. చదవాలని కోరికా, ఇంట్లో తెలిస్తే కాళ్ళిరగ్గొడతారాయే..అలాటివి, లోపల ఓ బొత్తిగా పెట్టుంచేవారు..  తెలిసున్న కొట్టైతే, కావాల్సినవి తెచ్చుకుని చదివిచ్చేయడమే.. రోజుకి ఎన్నైనా సరే.. కానీ అద్దె ( అణా ఉండేదనుకుంటా) లో మాత్రం ఎటువంటి రాయితీ ఉండేది కాదు.. అదే పొరుగూరికి వెళ్తే, ఆ కొట్టువాడికి మనతో పరిచయం లేదుగా.. అందువలన  పుస్తకం ఖరీదు డిపాజిట్ ( రిటర్నబుల్) గా కట్టి, తీసుకెళ్ళాల్సొచ్చేది.. అయినా పుస్తకం ఖరీదుమాత్రం ఎంతా రెండు..మూడు రూపాయలు… ఆరోజుల్లో అదికూడా ఎక్కువే మరి… కాలక్రమేణా, చదువుసంధ్యలు పూర్తిచేసుకుని, ఉన్నఊరు వదిలి, ఉద్యోగార్ధం పూనా వచ్చాక, ఇంక పట్టేవారెవరూ లేరు.. అంతా మనిష్టం.. ఏ సినిమా చూడాలనుకుంటే, ఆ సినిమా, ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం, అడిగేవారెవరూ లేరు.. పూనా వచ్చిన కొత్తలో,  మాకు దగ్గరలో ఓ లైబ్రరీ ఉండేది.. అక్కడ ఆరోజుల్లో వచ్చే.. విదేశీ పత్రికలు  Time, Life, Saturday Review, National Gegraphic,  .. దేశీ పత్రికలు Illustrated Weekly, Blitz, Mother India,Filmfare  లాటివి  అద్దెకు తీసుకోవడం,తెలుగు మాసపత్రికలు జ్యోతి, యువ కొనుక్కోవడం..  రైల్వే స్టేషన్ బుక్ స్టాల్ లో దీపావళి ప్రత్యేక సంచికలొచ్చేవి..అవన్నీ కొనడం.. ఇవేకాకుండా, అన్ని తెలుగు వారపత్రికలూ కూడా కొనడమే.. అదేవిటో కానీ,  ఎవరికీ చదవడానికి ఇంటికిచ్చేవాడిని కాదు.. కావాల్సొస్తే మా రూం లోనే చదువుకోవడం..కొంతమందికి నచ్చేది కాదు.. పోనిద్దురూ..   ఇంటినిండా ఈ పుస్తకాలే.. పెళ్ళయి నా భార్య కాపరానికి వచ్చేటప్పటికి, ఉన్న రెండుగదుల్లోనూ ఎక్కడ చూసినా పుస్తకాలూ, గ్రామఫోన్ రికార్డులూనూ.. కావాల్సినంత కాలక్షేపం..

 1983 లో వరంగాం వెళ్ళేటప్పటికి, సగం లగేజీ ఈ పుస్తకాలే..ఆరోజుల్లో వచ్చే దీపావళి ప్రత్యేక సంచికలైతే.. ఏ 250-300 పేజీలుండేవి.. ఓ పేద్ద భోషాణం నిండా ఉంచేవాళ్ళం.. వీక్లీలలోవైతే, వట్టిల్లోని సీరియళ్ళూ, వంటలూ కాగితాలు చింపి, పైగా వాటికి బైండ్ చేయించడమోటీ.. ఇప్పుడు తను చేస్తూన్న పజిల్స్ ఆరోజుల్లో పత్రికల్లో వచ్చేవి మాత్రం ఎప్పుడూ దాచుంచలేదు.. శుభం..ఎక్కడికక్కడే.. లేకపోతే లగేజీ ఇంకా పెరిగిపోయేదేమో..

 మొత్తానికి, అక్కడనుండి , పుణె తిరిగివచ్చేటప్పుడు, మాస్నేహితుడు, కేంద్రీయవిద్యాలయం లో , ఇంగ్లీషు మాస్టారు.. చదువుకుంటారు కదా అని, నమ్మండి నమ్మకపోండి, రెండు మూడు బియ్యబ్బస్తాలనిండా పుస్తకాలు ఇచ్చేసాము.. ఒకటా రెండా 35 ఏళ్ళ కలెక్షన్ మరి.. ఆ తరవాత పుణె వచ్చాక, దీపావళి సంచికలు మాత్రమే మిగిలాయి.. వీక్లీలు రెండేసి నెలలకి రద్దీలో ఇచ్చేసేవాళ్ళం..చివరకి రిటైరయేనాటికి, ఆ దీపావళి సంచికల ముద్రణా ఆగిపోయిందీ, మా దగ్గరున్నవన్నీ పేద్ద మనసు చేసుకుని ఎవరెవరికో ఇచ్చేసాము..

 ఆ తరవాత కంప్యూటర్ నేర్చుకోవడమూ, ఏదో నాకొచ్చిన టూటీ ఫూటీ తెలుగు/ఇంగ్లీషుల్లో రాయడమూ మొదలెట్టాము..తరవాత్తరవాత మాత్రం , ఎన్నో సందర్భాల్లో అనుకునేవారం… అయ్యో అన్నేసి పుస్తకాలుండేవీ, ఇప్పుడు ఉండుంటే ఎంత కాలక్షేపంగా ఉండేదో కదా అని అనుకోని రోజులేదు..చెప్పొచ్చేదేమిటంటే, ఆ పుస్తకాల విలువ, ఇప్పుడిప్పుడే తెలుస్తూంట.. అవేమీ పేద్ద పేద్ద క్లాసిక్స్ అని కాదు.. కానీ.. ఆనాటి కాలమానపరిస్థితుల్లో అవేకదా మన నేస్తాలూ…వాటి విలువ వాటికెప్పుడూ ఉంటుంది..మన దృష్టికోణం మీద ఆధారపడుంటుంది

ఏదో అంటారు… మనం ఏదైనా సహృదయంతో ఏపనైనా చేస్తే ఎప్పటికో అప్పటికి దాని ఫలితం ఉంటుంది.. ఆ మధ్యన ఎవరో చెప్పగా, వెదికితే, నా 40 సంవత్సరాల  కలెక్షనూ, నేనిచ్చేసిన ప్రతీ పుస్తకమే కాక, చిన్నప్పుడు కిళ్ళీకొట్లలో అద్దెకు తెచ్చి చదివిన పుస్తకాలే కాక, ఇంకా ఎన్నో..ఎన్నెన్నో తెలుగు సాహిత్యం అంతా, అంతర్జాలంలో దొరికేటప్పటికి, నా ఆనందం ఏమని చెప్పనూ?  It was just awesome.. ఓ 2 TB External Hard Disk  లు రెండు తీసుకుని, హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడే చదువుకోవచ్చు.. ఒకటిమాత్రం నిజం..  Print Book  చదివితే ఉండే ఆనందం ఈ  pdf  లతో ఉండదు.. పోనిద్దురూ మనంకూడా మారాలిగా..టెక్నాలజీ ఉపయోగించుకుని, మనంకూడా ముందుకు కదలాలిగా…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు..వాక్సినేషన్ నోము–ఉద్యాపన

మన రాష్ట్రాల్లో  వివాహిత స్త్రీలు  రకరకాల నోములు చేసుకుంటూంటారు ..గుర్తుండే ఉంటుంది… నోముల మాటెలా ఉన్నా, ఆ వ్రత/ నోముకి “ ఉద్యాపన” చాలా ముఖ్యంట. ఫలానా టైముకే చేసుకోవాలని లేదు.. ఎప్పటికో అప్పటికి చేసుకోవడం ముఖ్యం.. అందుకే చూస్తూంటాం.. పెళ్ళిళ్ళలో , ఎవరో ఒకరు, వారు చేసుకున్న నోములకి ఉద్యాపన చేసేసుకుంటూంటారు..

 అలాగే ప్రస్తుతం  జరుగుతున్న  “వాక్సినేషన్” కి, రెండో “ డోస్ “ వేసుకోవడం, ఆ నోముల ఉద్యాపన లాటిదే.. కానీ వచ్చిన గొడవేమిటంటే, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటామంటే కుదిరే పని కాదు..  ప్రస్తుతం వాడకంలో ఉన్న రెండు వాక్సీన్లకీ , 4 వారాల్లో ( 28 రోజుల్లో) , రెండో డోసు  తప్పకుండా తీసుకోవాలన్నారు.. పైగా, March 1  కి ముందర తీసుకున్నవారందరూ అంటే, డాక్టర్లూ వగైరా తీసుకున్నారు కూడానూ..మార్చ్ 1 తరవాత సీనియర్ సిటిజెన్లకి మొదలెట్టారు.. ఏదో కిందా మీదా పడి, మొదటి డోసు, ఎవరికి అందుబాటులో ఉన్నది, తీసుకుని, ఫొటోలు కూడా పెట్టి నానా హడావిడీ చేసారు.. నోము/ వ్రతం అయితే చేసుకున్నారు, కానీ ఉద్యాపన మాటేమిటి.. అకస్మాత్తుగా ఇక్కడ కథకి ఓ ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం.. కోవాక్సీన్ తీసుకున్నవారికి, 28 రోజుల్లో రెండో డోసు కూడా ఇచ్చేట్టూ, కానీ ఆ రెండోదుందే   కోవీషీల్డ్ కి మాత్రం, కనీసం 40+ రోజులైనా పూర్తవాలి, అప్పుడే ప్రభావం ఎక్కువగా ఉంటుందీ అన్నారు.. ఇదీ కథ..

 మేము 6 మార్చ్ న మొదటి డోసు తీసుకున్నాము.. మొదట్లో చెప్పినట్టుగా, 28 రోజుల తరవాత, అదే హాస్పిటల్ లో  slot book  చేసుకుని, ఫోన్ చేస్తే,  రావొద్దుపొమ్మన్నారు.. 40+ రోజుల తరవాతకే  reschedule  చేసుకోమన్నారు. శుభం..కానీ సడెన్ గా  vaccine shortage  మొదలయింది.. ఓవైపున కేసులు విపరీతంగా పెరుగుతూండడంతో, 45+ వయసువారికి కూడా మొదలెట్టడంతో, ఓ రకంగా  rush  ఎక్కువవడంతో, వాక్సీన్లు లేక, చాలా సెంటర్లు మూసేసారు.. నానా గందరగోళం జరిగింది, ఇంకా జరుగుతోంది కూడా.. ఏదో ఆ 40+ రోజులూ పూర్తయాయి కదా అని, ఉన్న సెంటర్లలో బుక్ చేసుకోవడం, తీరా వెళ్దామనుకునేటప్పటికి, వాళ్ళ దగ్గరనుండి  s m s  .. your scheduled vaccination is cancelled..  please reschedule.. inconvenience caused is regretted.. అంటూ..కనీసం 3 సార్లు జరగ్గా జరగ్గా… నిన్న మా అబ్బాయి మరో హాస్పిటల్ లింక్ పంపాడు.. వాళ్ళకి ఫోనుచేస్తే, ఇవేళ 1030 కి ఆధార్ కార్డ్ తీసుకుని డైరెక్ట్ గా వచ్చేయమన్నారు.. విషయం అబ్బాయికి చెప్పగానే,  కార్ పంపాడు.. కొత్త మాస్క్ లు కూడా పంపించాడు.. అక్కడకి వెళ్ళేసరికి అప్పటికి ఓ అయిదుగురుండగా, మాకు 06, 07  టోకెన్లు ఇచ్చారు..ఇంతలో ఓ డాక్టరు గారొచ్చి, ఉన్నవి 10 డోసులు మాత్రమే, 10 లోపు నెంబర్లవారు మాత్రమే ఉండి, మిగిలినవారిని పంపేసారు.. మొత్తానికి, మా నెంబర్ రావడం, 500/- కట్టి రెండో డోసు తీసుకుని, ఓ అరగంట అక్కడే wait  చేసి, ఇంటికి చేరుకోవడమూ జరిగింది.

అవ్విధంగా మా “కోవిషీల్డ్ వాక్సీన్ నోము” కి ఉద్యాపన కూడా విజయవంతంగా పూర్తిచేసుకున్నాము.. ప్రస్తుతం వరకూ ఎటువంటి side effects  కనిపించలేదు..

   May 1  వ తారీకునుండి, 18+ వయసువారందరూ వాక్సినేషన్లకి ‘అర్హులు’ అంటున్నారు..పరిస్థితి మెరుగుపడుతుందో, లేక జనాలెక్కువయి మరింత గందరగోళంగా ఉంటుందో, ఆ పైవాడికే తెలియాలి..

బైదవే వాక్సినేషన్  ఫైనల్ సర్టిఫికేట్ కూడా download  అయింది….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు… సంస్కరణలు– ఇంటా , బయటా…

1992 లో దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిపోవడంతో, మన తెలుగుతేజం శ్రీ నరసింహారావు గారు, కొన్ని ఆర్ధిక సంస్కరణలు ఆవిష్కరించడం తో, ఆర్ధికస్థితి , నియంత్రించబడి పరిస్థితి చక్కబడిందనే చెప్పొచ్చు.. ఆ సంస్కరణలు అమలులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రం, నానా గొడవా జరిగింది…

 దేశంలో.. ఇంటా బయటాకూడా ‘సంస్కరణ’ ల జోరు ఎక్కువయింది కదూ.. ఒకానొకప్పుడు అంటే 90 వ దశకంలో , ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి, దేశాన్ని తాకట్టుపెట్టకుండా రక్షించినందుకు, “ స్వదేశీ” గోలతో, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీవారే, నెత్తీ నోరూ బాదుకున్నారు.. అలాగే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా నానా హడావిడీ చేసి, అల్లర్లు చేసారు… విదేశీ పెట్టుబడులను , ఎక్కువ అనుమతించినప్పుడూ ఇదే గోల చేసారు… అలాటిది, అకస్మాత్తుగా ‘జ్ఞానోదయం ‘ ఎప్పుడయిందో తెలియదు కానీ, అన్నిరంగాల్లోనూ, విదేశీపెట్టుబడులను ఎడాపెడా అనుమతిస్తూ పోతున్నారు.. ఏమిటంటే.. ‘ సంస్కరణలు’ అంటారు.. ఏమో నిజమేనేమో.. కానీ ఒకనాటి ‘కట్టర్ స్వదేశీ” మంత్రం, ‘విదేశీ’ లోకి ఎలా ఎప్పుడు మారిందో మాత్రం అంతుబట్టడంలేదు..

 పాతతరం వారికి ఈ ‘ సంస్కరణలు’ జీర్ణం చేసుకోవడమయితే కొద్దిగా కష్టమే..ముఖ్యకారణం వారి దృష్టికోణం.. ఎంతైనా ఓ వయసుదాటినవారందరూ కూడా, నూటికి 70 మంది దాకా, ప్రభుత్వసంస్థలలో పనిచేసినవారే అనడంలో సందేహం లేదు..కారణం ఆరోజుల్లో ప్రెవేటు సంస్థల్లో ఉద్యోగాలకి గారెంటీ ఉండేదికాదు.. ఎప్పుడు పీకేస్తారో, కంపెనీ ఎప్పుడు దివాళా తీస్తుందో తెలిసేదికాదు.. ఓరకంగా చూస్తే, ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాటి అఘాయిత్యాలు లేకుండా, సంసారాలు లాగించేసేసారు..బహుశా దేశం మీద అభిమానం కంటే, కడుపులో నీళ్ళు కదలకుండా జీవితం వెళ్ళిపోయేది.. ఓరకమైన  complacency  అనుకుందాం..ఓ ‘ తరం’ అంతా అలాగ వెళ్ళిపోయినదే.. కాలక్రమేణా, ప్రభుత్వరంగ సంస్థలలో, నాణ్యత తగ్గడం మొదలయింది.. దానిక్కూడా, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా , ప్రభుత్వ విధానాలే ముఖ్యకారణం..అందరికీ తెలిసినవే…

 రోజులన్నీ ఒకలా ఉండవుగా.. రాజకీయపార్టీల విధివిధానాలుకూడా మారాయి.. ఇళ్ళల్లోనే ఓ తరం మారి మరో తరంలోకి అధికారం వెళ్తున్నప్పుడు..  keeping up with times  గా మార్పులు చోటుచేసుకుంటాయే.. సందేహం లేదు..గుర్తుందా Bajaj Scooters .. యాజమాన్యం , రాహుల్ బజాజ్ గారినుండి, వారి కొడుకు చేతిలోకి వెళ్ళడమేమిటి, కొద్దిరోజుల్లో.. అప్పటిదాకా ఎన్నో సంవత్సరాలనుండి ఉన్న  Bajaj Scooter  ఉత్పత్తి ఆపేసారు.. పాతతరం వారైతే , ఏదో తమ కుటుంబసభ్యుడే కనుమరుగైనంతగా బాధపడ్డారు కూడా..కానీ వ్యాపారరీత్యా, స్కూటర్లు తయారుచేయడం మూలానే , నష్టాలు వస్తూన్నట్టు గుర్తించి, కొత్త యాజమాన్యం, స్కూటరు తయారీ ఆపుచేసేసారు..  కొన్ని సంవత్సరాలకి జనాలూ అలవాటుపడిపోయారు..

ఇవన్నీ “బయటి” సంస్కరణలలోకి వస్తాయి… ఇంక “ఇంటి” సంస్కరణల విషయం లోకి వద్దాం..సాధారణంగా మనిషి జీవితం ఓ 70-75 ఏళ్ళనుకుందాం..అందులో15- 20 ఏళ్ళదాకా చదువు, ఆ తరవాత ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు ( ఓ 40 ఏళ్ళనుకుందాం).. సాధారణంగా ప్రతీ గృహస్థూ,  అప్పోసప్పో చేసి, తన భార్యా పిల్లలని, కంఫర్టబుల్ గా ఉంచుదామనే చూస్తాడు..ఓ కొత్తవస్తువు కొని ఇంటికి తెచ్చినప్పుడు, తన కుటుంబసభ్యుల మొహంలో కనిపించే ఆనందం, తను చేసిన అప్పు కష్టాన్ని కూడా మరిపింపచేస్తుంది.సందేహం లేదు.. అలాగే పిల్లలని , ఓపికున్నంతవరకూ చదివిస్తాడుకూడా.. ఈ నలభైఏళ్ళ సంసారప్రస్థానంలో ఎన్నో మధురజ్ఞాపకాలు.. వాటన్నిటికీ సాక్ష్యంగా ఇంట్లో ( అదృష్టముంటే అది కూడా స్వంత ఇల్లే)  ఎదురుగుండా కనిపించే వస్తువులు చూసి మురిసిపోతూంటాడు పాపం వెర్రి మనిషి.

 రోజులన్నీ ఒకేలా ఉండవుగా..  పాత నీరుపోయి కొత్తనీరు వస్తుందే..ఈ కొత్తనీరులో ఉన్న గమ్మత్తేమిటంటే, ఇంట్లో ఉన్న వస్తువులనండి, ఇల్లనండి.. అన్నీ ఇంతకాలం చూసి చూసి మొహం మొత్తేసినట్టనిపిస్తుందిట.. కాలంతో పాటు మనమూ మారాలనే స్లోగన్ ప్రారంభం.రైటే కాదనలేం.. పాత జ్ఞాపకాలని ఎంతకాలం పట్టుకుని వేళ్ళాడతామూ? కానీ తన కళ్ళెదురుగుండానే, తను ‘కడుపుకట్టుకుని’ తన కుటుంబం కోసం కొన్నవస్తువులన్నీ.. బయటకి దారితీయడం.. కొద్దిగా  digest  చేసుకోవడం కష్టంగానే ఉంటుంది మరి.. ఇదికూడా దేశంలో జరుగుతూన్న  “సంస్కరణల” లాటివే…

 సంస్కరణల పేరుతో దేశంలో జరుగుతున్న పరిణామాలు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణ, ఇన్స్యూరెన్స్ లో ఎక్కువ విదేశీపెట్టుబడులు, మిగిలిన  Disinvestment  కార్యక్రమాలని జీర్ణించుకోవడానికి టైము పడుతుందనడంలో సందేహం లేదు.. కానీ ఈ ‘ సంస్కరణలు’ అమలు పరుస్తూన్న పాలకుల దృష్టికి కొన్ని కార్యక్రమాలు రానేరావు.. అక్కడకూడా ఖర్చవుతున్నది, మనం కట్టే పన్నులే కదా.. కానీ ఆ ‘ రాయితీలు’ ఆపితే, వీళ్ళు మళ్ళీ ఎన్నికయే అవకాశాలుండవు. చేసేదేదో ధైర్యం ఉంటే, అన్నీ అమలు చేయాలి.. అంతేనేకానీ selective implementation కాదు…