చాలామంది, పుట్టి, పెరిగిన ఊరు వదిలి, ఉద్యోగరీత్యానో, ఇంకో కారణం చేతనో, వేరే పట్టణానికో, నగరానికో, రాష్ట్రానికో, దేశానికో వెళ్ళి స్థిరపడిన తరువాత, ఓ వయసు వచ్చిన సమయంలో, అదేదో nostalgia పేరు చెప్పి, ఓసారి మనం పుట్టిన ఊరువెళ్ళి చూసొస్తే బాగుండునూ అనే ఓఅర్ధరహితమైన భావన వస్తూంటుంది. అర్ధరహితం అని ఎందుకన్నానంటే, ఎప్పుడో పుట్టిపెరిగిన ఊళ్ళో, ఇన్ని సంవత్సరాల తరువాత చూసేందుకేమీ ఉండదు. ఎక్కడ చూసినా మార్పే. అరే ఇక్కడ “ఫలానా వారిల్లుండేదీ.. పిన్నిగారు ఎప్పుడు వెళ్ళినా పటిక బెల్లం పెట్టేవారూ, వాళ్ళ ఇంటరుగుమీద హాయిగా ఆడుకునే వారమూ..”, ఇక్కడ ఓ పెద్ద కొబ్బరి తోటుండేదీ, మా ఇల్లు ఇక్కడే కదూ ఉండేదీ..ఇంటికి పెద్ద కాంపౌండూ, వెనకాల పెద్ద పెరడూ..10-15 గదులూ, పెరట్లో నుయ్యీ.. అక్కడే కదూ తువ్వాలు కట్టుకుని స్నానం చేసేవాడినీ…( ఆరోజుల్లో ఆడవారికి మాత్రమే స్నానం గదులు ). నూతిగట్టు పక్కనే ఓ పొయ్యీ దానిమీద ఓ “డేగిసా” తో వేణ్ణీళ్ళు కాచుకోడమూ, తెల్లారేసరికి అమ్మ, పెరట్లో తులసికోట దగ్గర ప్రదక్షిణాలు చేయడమూ, అన్నిటిలోనూ ముఖ్యం పెరట్లో ఓ రుబ్బురోలూ, పండగల్లో అమ్మ గారెలకోసం మినపప్పు రుబ్బడం, పచ్చళ్ళు వంటగదిలో ఉన్న బుల్లి రుబ్బురోలులో.ఇంట్లోనే ధాన్యం పోసుకోడానికి ఓ గాదె…. ఇలా సినిమా రీలులాగ యాభై ఏళ్ళ క్రితం పాత గుర్తులన్నీ తిరుగుతాయి. కానీ, యదార్ధానికి ప్రస్తుతం అక్కడ ఉన్నదేమిటీ– ఓ కార్పొరేట్ స్కూలూ, దానికో సెక్యూరిటీ వాడూనూ. ఏదో వాడి కాళ్ళావేళ్ళా పడి, ఓసారి లోపలకి వెళ్ళి చూసొస్తామని వెళ్ళడం. మనకి కనిపించేది ఏమిటీ, ఉత్త ప్రహారీ గోడ. ఆ ప్రహారీ గోడమీదే, సుద్ద ముక్కతో నాలుగు నిలువు గీతలు గీసికుని, వాటినే వికెట్లనుకుని, చక్క బ్యాట్టు, టెన్నిస్ బాలుతో క్రికెట్ ఆడిన రోజులు గుర్తొచ్చి, ఎమోషనల్ అయిపోవడం. అదృష్టమేమిటంటే, ఆరోజుల్లో నాతో క్రికెట్ ఆడిన నా కజిన్ కూడా నాతో ఉండడం. ఇద్దరం కలిసి, ఆ మిగిలిన ప్రహారీ గోడ మీద ఆప్యాయంగా చెయ్యి వేసి ఫొటో తీసికోడం !
అదే వీధిలో, మా అమ్మమ్మ గారి ఇంటికి ఎదురుగా, రామాలయం దగ్గర ఒక ఇల్లుండేది. అక్కడ రేమెళ్ళ శేషమ్మ్మ గారని ఒక పండు ముత్తైదువ, ఒంటి నిండా నగలు పెట్టుకుని, మహలక్ష్మి లా ఉండేవారు. ఎప్పుడైనా అమలాపురం భూపయ్య అగ్రహారం అంటే, ఆవిడే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడో.. శిథిలమైపోయిన ఆ ఇల్లు చూసేటప్పటికి గుండె నీరైపోయింది
ఆనాటి జ్ఞాపకాల లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది ఏమైనా ఉందీ అంటే, రామాలయం. ఆరోజుల్లో ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. శ్రీరామనవమికి పానకాలూ, తాటాకు విసినకర్రలూ గుర్తుచేసికుని ఓ సారి సంతోషించాను.
అక్కడనుండి బోడసకుర్రు గోదావరి మీద వేసిన కొత్త వంతెన మీదుగా, పాశర్లపూడి వెళ్ళి, మా స్నేహితుడిని కలవడానికి వెళ్తే, అక్కడ చూసిందేమిటీ, ఓ అరడజను 10 లీటర్ల మినరల్ వాటర్ సీసాలు. కోనసీమ అంటేనే, నీరు అమృతంలా ఉండేది. అలాటిది త్రాగడానికి మంచినీరు లేక, అదీ గోదావరికి 2 కిలోమీటర్ల దూరంలో, మినరల్ వాటర్ వాడాల్సిన దౌర్భాగ్యం !. మళ్ళీ జీవితంలో తిరిగి రాకూడదనుకుని , వస్తే ఇంకా ఎన్నెన్ని భయానక దృశ్యాలు చూడాల్సొస్తుందో అని భయం వేసింది.
కానీ ఇంత బాధలోనూ ఊరట కలిగించిన దృశ్యం అలనాటి గుర్రబ్బండి…
అందుకే పుట్టిపెరిగిన ఊరికి వెళ్ళి, ఏదో ఉధ్ధరించేయడంకంటే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా దాచుకోవడమే ఉత్తమం..
Filed under: Uncategorized | 5 Comments »
You must be logged in to post a comment.