బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Unsung Heroine

    కేంద్రప్రభుత్వం వారు ఇదివరకటి రోజుల్లో ఫిబ్రవరి 28 న సాయంత్రం 5.00 గంటలకి సాధారణ బడ్జెట్ సమర్పించేవారు. ఆ గొడవంతా గజిబిజి అయిపోయి, ఆ బడ్జెట్ కి ఓ తేదీ అన్నది లేకుండా, ఎప్పుడుబడితే అప్పుడే సమర్పించేస్తున్నారు.

7nbsp;  కానీ ఆ ‘తేదీ (ఫిబ్రవరి 28)’ తో ఎంతో ముఖ్యమైన అనుబంధం మారదుగా ! ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే ఆరోజున, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో, 38 సంవత్సరాల క్రితం, నేనూ ఓ ఇంటివాడినయ్యాను!!
అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆ పెళ్ళి అయిన పరిస్థితులూ,వగైరా నేను ఇప్పటికే మీకు నా ‘బాతాఖానీ కబుర్లు’ 1-50 ద్వారా బోరుకొట్టాను. మళ్ళీ అవన్నీ చెప్తే ఇంక నా బ్లాగ్గులోకి ఎవరూ అడుగెట్టరు !!

ఇప్పటికీ నాకు ఓ విషయం అర్ధం అవదు–అసలు నాలో ఏంచూసి నన్ను అంగీకరించిందా తను అని.పోనీ అడుగుదామా అంటే ‘మిథునం’ లో లాగ ఏమైనా సమాధానం వస్తుందేమో అని భయం !ఓ రూపమా, చదువా, ఉద్యోగమా, పోనీ ఏదైనా విషయంలో ప్రావీణ్యతా, ఒక్కటంటే ఒక్కవిషయంలోనూ ఎటువంటి ప్రత్యేకతా లేని సాధారణ జీవిని.

మా ఇంటావిడ గురించి చెప్పాలంటే చాలా ( అంటే నాలో కాగడా పెట్టివెదికినా కనిపించనివి) ఉన్నాయి.తనో పేద్ద ‘క్రమశిక్షణ’ఇస్ట్.ప్రతీదానికీ, అలా మాట్లాడకూడదూ,ఇలా మాట్లాడకూడదూ అంటూ ఊరికే ఊదరకొట్టేస్తుంది. ఇంట్లో అన్నీ వేటి స్థానంలో అవి ఉండాలంటుంది.ప్రతీదీ శుభ్రంగా ఉండాలంటుంది.నా అప్పుఎంతో అడుగుతూంటుంది.ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాటిది జరిగితే, వీళ్ళకు పెట్టాలీ, వాళ్ళకు పెట్టాలీ అంటూ నాచేత ఎవేవో తెప్పిస్తూంటుంది.నేను ఎప్పుడైనా కోపం వచ్చి అరుస్తే సమాధానం ఇవ్వకుండా ‘కూల్’ గా ఉండిపోతుంది. సమాధానం చెప్తేనేకదా నాకూ ఇంకా అరవడానికి అవకాశం వస్తుందీ( ఏమిటో ఎవరూ అర్ధంచేసికోరూ !!). ఎప్పుడో జరిగిన సంగతులు అన్నీ గుర్తుపెట్టుకొని,ఛాన్స్ దొరికినప్పుడు ‘ర్యాగ్’ చేస్తూంటుంది.రోజుకో డ్రెస్ మార్చమంటుంది.నాకు చిరాకూ.సరీగ్గా బయటకు వెళ్ళే ముందర సాగతీసుకుంటూ’ఆ డ్రెస్ మాసిపోయిందేమో, పోనీ మార్చకూడదూ’అని.

ఏమిటో ఇలా రాసుకుంటూ పోతే ఎన్నెన్ని ఉన్నాయో! మీరనొచ్చు ఇలాటి గుణాలు ప్రతీ భార్యలోనూ ఉంటాయీ, మీరేమిటీ అదేదో పేద్ద గొప్ప విషయాలుగా చెప్తున్నారూ అని.అక్కడే ఉంది అసలు విషయం అంతా--ఎందుకూ పనికిరాని నాలాటి వాడిని పెళ్ళి చేసికోవడం ఎందుకూ, నన్ను ఉధ్ధరించడం ఎందుకూ?

ప్రతీ వారం నేను తెచ్చే పుస్తకాలు కొన్ని రోజులైనా (కొత్తపుస్తకం వచ్చేవరకైనా) దాచిపెట్టుకోవచ్చుగా, అబ్బే, వెంటనే చదివేయాలి.నేను ఈ గోలంతా భరించలేక, కంప్యూటర్ లో తెలుగు వ్రాయడం మొదలెట్టి ఏదో నా గొడవేదో నేను పడుతున్నానుగా,అబ్బే తనూ నేర్చేసికొని నాతో పోటీ!

ఇంక ఆవిడలో నాకు నచ్చే విషయాలకొస్తే–వంట బ్రహ్మాండంగా చేసేస్తుంది. ఇంటికి ఎవరు ఏ సమయంలో వచ్చినా ఢోకా లేదు. రెండు కూరలూ, పచ్చడీ,పప్పూ,పులుసూ తో శుభ్రంగా భోజనం పెడుతుంది.అందుకే, మా ఇంటికి వచ్చేవాళ్ళు నన్ను గుర్తు పెట్టుకొని రారు,ఆవిడనే గుర్తు పెట్టుకుంటారు.ఆవ పెట్టి పనసపొట్టుకూరా, కారం పెట్టి వంకాయ కూరా,కందా బచ్చలి కూరా – అద్భుతం!

నేను ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తుంది. అందుకే ఏం తోచక రాజమండ్రీ లో కాపరం పెడదామంటే వచ్చేసింది.ఇప్పుడు పూణే లో ఇంట్లో సామాన్లు అన్నీ పట్టవూ, ఇంకో ఫ్లాట్ అద్దెకు తీసికొని ఉందామూ అంటే, వెంటనే ఒప్పేసుకొంది.

జనవరిలో పుట్టిన మా మనవడు చి.అగస్త్య తో కలిపి నాకు ‘నవరత్న మాల’ తయారుచేయడానికి కారణం తనే కదా ! అసలు పెళ్ళే అవుతుందా అని అనుకున్న నాకు సమాజంలో ఓ స్థానం కలిగింది ఈవిడవల్లేగా.అయినా పాపం ఎవరుచెప్పినా ఫలానా ఫణిబాబు గారూ అంటారే కానీ
తను ఓ ‘అన్ సంగ్ హీరోయిన్’ గానే ఉండిపోతుంది.అసలు విజయమంతా ఆవిడదే.

పైన ఇచ్చిన ఫొటో, మా కోడలు, మా మనవడిని చూసుకుంటూ,స్వయంగా పైంట్ చేసి, వాటిలో మా ఫోటోలు పెట్టి మాకు వివాహ వార్షిక దినోత్సవ సందర్భంగా ఇచ్చినది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-inspiring others.

    ఈ వేళ జీ తెలుగు లో చిన్నపిల్లల సంగీత కార్యక్రమం చూశాను.అందులో సినిమా నటుడు శ్రీ నూతన్ ప్రసాద్ గారిని అతిథిగా పిలిచారు. ఈ వేళ్టి కార్యక్రమం లో ‘ ఇన్సిపిరేషన్ పాటల’ పోటీ జరిగింది.అందరికీ తెలుసుగా-శ్రీ ప్రసాద్ గారు 21 సంవత్సరాలనుండీ,చక్రాల కుర్చీకే పరిమితమయ్యారుట ( ఆయనే చెప్పారు). ఇదివరలో రెండు నంది బహుమతులు, ఏక్సిడెంట్ అయిన తరువాత ఇంకో రెండు నందులూ, డాక్టరేటూ వచ్చాయిట.ఇది చాలా గొప్పవిషయం. ఈనాటి మీడియా ధర్మమా అని అందరికీ తెలిసింది.

    నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ మీడియా ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, బయటి ప్రపంచానికి తెలియని ఘనాపాటీలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి, మాకు దగ్గరలోనే మిలిటరీ వారి ‘పారాప్లెజిక్ హోమ్ ‘ అని ఒకటుంది.మేము వారంలో రెండురోజులు ఆ రోడ్డుమీదకు వెళ్తూంటాము.అక్కడ సాయంత్రం వేళల్లో చక్రాల బళ్ళమీద ఎందరో మాజీ సైనికులు తిరుగుతూ కనబడతారు.’ ఆహా వీళ్ళు మన సరిహద్దుల్లో ఉండడం వలనే కదా మనం ఈవేళ ఇంత హాయిగా శ్వేఛ్ఛా వాయువు పీల్చకలుగుతున్నాము కదా’ అనిపిస్తుంది.వీరిగురించి ఈ linkలో చదవండి. వీరందరూ ఏ స్వార్ధం లేకుండా తమ జీవితాన్ని త్యాగం చేశారు.

    నేను శ్రీ ప్రసాద్ గారిని చిన్నబుచ్చుతున్నానని కాదు.ఎవరికైనా కొంతకాకపోతే కొంతైనా ‘ఇన్ఫ్లుఎన్స్’ ఉంటేనే తప్ప వారి గొప్పదనం బయటివారికి తెలియదు.మరి ఏ విధమైన ‘వశీలా ‘ లేనివాళ్ళగురించి ఎలా తెలుసుకోవడం? నా ఉద్దేశ్యంలో , ఈ బ్లాగ్గులు చదువుతున్నవాళ్ళందరూ, అంతర్జాలం లో దేనికో దానికి వెదుకుతూంటారు కదా,ఆ వెదికే సమయంలో, కొంచెం కన్నేసి,తెర మరుగున ఉండే ప్రతిభావంతుల గురించి, మన బ్లాగ్గు మిత్రులందరికీ పరిచయం చేయమని నా విన్నపం. భగవంతుడు మనకి ఇంత అందమైన జీవితాన్ని ప్రసాదించాడు కాబట్టి దాన్ని ఈ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందేమోనని నా కోరిక.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-హైపర్ ఏక్టివ్ తరం

    మా చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళో, అమ్మా నాన్నల స్నేహితులో వచ్చినప్పుడు, ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండేవాళ్ళం కాదు.ఆడుకోవడానికి బయటకు వెళ్ళాలంటే అదే మంచి అవకాశంగా ఉండేది.మన తల్లితండ్రులు కూడా, పిల్లల్ని ఆ వచ్చినవారికి చూపించడం,వారి ప్రావీణ్యాలు ప్రదర్శించడం వగైరాలు ఉండేవి కావు.ఇంట్లో ఎవరైనా నానమ్మలో, అమ్మమ్మలో ఉంటే , అసలు వాళ్ళే అడ్డు పెట్టేవారు.’ ఊరికే అస్తమానూ పిల్లల్ని పిలవకండి, దిష్టి తగులుతుందీ’అనేవారు. ఏ కారణం చేతైనా బయటవాళ్ళు చూడడం పడితే, వాళ్ళు వెళ్ళగానే, దిష్టి తీసిపడేసేవారు! రాత్రిళ్ళు పసిబిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడిస్తే–‘ ఎవరి కళ్ళు పడ్డాయో కానీ, కొంచెం దిష్టి తీసేయండిరా’ అని ఓ ఆర్డరు వేసేవారు.
ఉప్పుచేతిలో వేసికొని, మూడుసార్లు ఇంట్లో ఉన్న చిన్నవాళ్ళందరి చుట్టూ తిప్పేసి,తడిచేయి చేసికొని,కళ్ళకీ, కాళ్ళకీ రాసేవారు.అదేం చిత్రమో స్విచ్ ఆఫ్ చేసేసినట్లుగా,ఏడుపు ఆపేసి, హాయిగా పడుక్కునేవారు.ఇవన్నీ ఈప్పటి వారికి విచిత్రంగా కనిపించొచ్చు.ఒక్కవిషయం మాత్రం ఒప్పుకోండి, ఈ బ్లాగ్గులు చదివే ప్రతీవారూ ఇలా పెరిగి పెద్దైనవాళ్ళే. కావలిసిస్తే మీ ఇంట్లో ఉన్న అమ్మనో, నాన్ననో అడగండి !

    ఇప్పటివాళ్ళు పెరిగే వాతావరణం ఇంకోలా ఉంది.న్యూక్లియర్ ఫామిలీలూ, అమ్మా, నాన్నా, ఒకరో ఇద్దరో పిల్లలు.వారి ప్రపంచం అంతా కలిపి ఆ నలుగురే, ఇంటికి ఎవరు వచ్చినా అందరూ కలిసే ఉంటారు.వీళ్ళెంతసేపు మాట్లాడుకున్నా, పిల్లలు కూడా అందులో భాగమే.అలాగే అమ్మా నాన్నా మాట్లాడుకుంటున్నా, ఆ పిల్లల ఎదురుగానే మాట్లాడుకోవాలి.ఈ పిల్లలు కూడా ‘ ఆవలిస్తే పేగులు లెఖ్ఖపెట్టే వారే ‘. అందువలన తల్లితండ్రులు మాట్లాడుకునేవి అన్నీ వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి.ప్రతీ రోజూ కొత్త కొత్త మాటలు నేర్చుకుంటూంటారు.అందువలన తల్లితండ్రులు కూడా, చాలా డిసిప్లీన్డ్ గా ఉంటున్నారు.అయినా ఒకటీ అరా ఇంకోళ్ళగురించి మాట్లాడుకుంటూంటారు. మా స్నేహితుడొకరు, వాళ్ళ ఫ్రెండ్’సత్యనారాయణ’ అని ఒకరుండేవారు. వీళ్ళు అస్తమానూ ఆయనగురించి మాట్లాడుకునేటప్పుడు ‘సత్తిపండు’ ఇలా అన్నాడూ, అలా అన్నాడూ అనుకునేవారు. ఆ మాట ఇంట్లో ఉన్న పిల్ల పట్టేసింది. ఓ రోజున ఆయన వీళ్ళింటికి వస్తే, ‘ డాడీ సత్తిపండు గారొచ్చారూ’ అంది.ఆయనకి షాక్కు కొట్టింది.ఇదేమిటి ఈ పిల్ల అలాగ అంటోందీ, అని ఇంక మాస్నేహితుడికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు.

&nb;   ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా మనవరాలు నవ్య కూడా ఈ తరానికి చెందినదేగా.వీలున్నంతవరకూ నేను ఎప్పుడూ నోరుమూసుకునే ఉంటాను. నోరెత్తితే ఏం అవాకులూ,చవాకులూ మాట్లాడుతానో అని.మా అబ్బాయీ, కోడలూ, మా ఇంటావిడా తన ఎదురుగుండా ఒక్క మాటా కాజుఅల్ గా మాట్లాడరు. నేను ఏం మాట్లాడినా క్యాజుఅల్ గానే మాట్లాడతాను! ఈ వయస్సులో ఇలాంటి కర్ఫ్యూలు ఉంటే కష్టం కదాండీ? అయినా నా జాగ్రత్తలో నేనుంటాను. మనకీ ఓ బాధ్యత ఉందిగా ! మా పిల్లలసంగతి చెప్పాలంటే పాపం వాళ్ళకి క్రమశిక్షణ కొంచెం ఎక్కువే. అది మేమేమీ నేర్పలేదు. ఇంట్లో ఎప్పుడూ వాళ్ళెదురుగా ఎవరిగురించీ మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఏం మాట్లాదుకుందామన్నా బయట వాక్ కి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడమే.

    నేను బయటకు వెళ్ళినప్పుడు,ఏమైనా స్వీట్స్ తెస్తూంటాను. నాకు తినడానికి మెత్తగా ఉంటాయని మిఠాయి ఉండలు ప్రతీసారీ తెస్తూంటాను.మరీ అన్నీ నేనే తింటానూ అనలేనుగా, అందుకోసమని, మా మనవరాలు నవ్య తో చెప్తూంటాను-ఈ లడ్డూలు నీకూ, నాకూ మాత్రమే. మిగిలినవన్నీ అందరికీ ఇద్దాము అని.తెచ్చినవన్నీ తనే తినేస్తే ఏ అనారోగ్యమైనా వస్తుందేమో అని ఈ ఎరేంజ్ మెంటన్నమాట. ఇంతవరకూ బాగానే ఉంది, ఈ మధ్యన ఒక రోజు, మా అబ్బాయి స్నేహితుడు ఈమధ్యనే కొత్తగా పెళ్ళి అయింది, మా మనవడిని చూడడానికి తన భార్యతో వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళకేవో చాయ్ తోపాటు ఏదైనా పెట్టాలిగా. మా కోడలు, ఇంట్లో ఉన్న మిగిలిన స్నాక్స్ తోపాటు, మా (అంటే నాకూ, మానవ్యకీ మాత్రమే హక్కున్న) లడ్డూలు కూడా ప్లేట్ లో పెట్టింది.పాపం మా నవ్య ఎంతో ఫీల్ అయిపోతూ ‘తాతయ్యా ఆప్ అప్నేలియే లాయేహుఏ లడ్డూ అభీ దూస్రోంకే సాత్ షేర్ కర్నా పడ్ రహా హై, క్యా కరే’ అని ఆ వచ్చినవాళ్ళెదురుగుండానే చెప్పేసింది.తనకి తెలుగులో మాట్లాడడం చక్కగా వచ్చును, అయినా ఆ వచ్చినవాళ్ళు అర్ధం చేసికోరేమో అని హిందీ లో నన్ను వీధిన పెట్టేసింది.అది విని అందరూ నవ్వడమే ! పాపం ఆ వచ్చిన వాళ్ళుకూడా
ఆ లడ్డూలమీద చెయ్యిపెడితే ఒట్టు !
అందువలన చెప్పొచ్చేదేమిటంటే, ఈ కాలపు పిల్లలముందర అదేదో ఎడ్వర్టైజ్ మెంటులోలాగ నోటికి సీల్ వేసేసుకుని ఉంటే ఇంటికీ వంటికీ సర్వవిధాలా క్షేమం !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-తృణమూలమ్మ

    ఈ వేళ లోక్ సభలో పెట్టిన రైల్వే బడ్జెట్ సందర్భంగా మన రైల్వే శాఖా మంత్రి, మమతా బెనర్జీ ప్రసంగం వినే అ(దుర)దృష్టం కలిగింది. అందులో ఆవిడేం చెప్పిందో ఏమీ అర్ధం అవలేదు. రైల్వే టైంటేబిల్ లో ఉన్న స్టేషన్ ల పేర్లు రమారమి అన్నీ వినిపించినట్లయింది. ఒక్క బెంగాల్ లో ఉండే స్టేషన్లు తప్పించి, మరే స్టేషను పేరూ సరీగ్గా పలకలేకపోయింది.

    ఆంధ్ర ప్రదేశ్ లోని స్టేషన్ ల పేర్లు అయితే మరీ దరిద్రంగా పలికింది. నాకు ఒక విషయం అర్ధంఅవదు–ఆ బడ్జెట్ వివరాలు చెప్పేముందర ఒకసారి
వాటి ఉఛ్ఛారణ గురించి, వారి మంత్రిత్వ శాఖలో ఉన్న ఎవరినైనా అడిగి తెలిసికుంటే ఏం పోయింది? పైగా ఇంకోటి,ఆవిడ మాట్లాడుతున్నంతసేపూ, ఎవడో ఒకడు లేచి నుంచొని అరుపులూ వగైరా…ఇంక ఈవిడేమో మన ‘సూర్యకాంతం’ గారిలాగ, తిరిగి వాళ్ళని కోప్పడడం.

    అంతంత ఊకదంపుడు అంతా చదవడం ఎందుకో అర్ధం అవదు. ఎలాగూ, అచ్చేసిన బడ్జెట్ పేపర్లు అందరికీ పంచుతారు కదా, ఈ కంఠశోష ఎందుకో? ఈ విషయంలో దక్షిణభారత మంత్రులు నయం.ఎక్కడి పేరైనా శుభ్రంగా పలుకుతారు.ఉత్తరభారతానికి చెందినవాళ్ళకే ఈ రోగం.అందులో బెంగాలీ వాళ్ళకి ఈ తెగులు ఎక్కువ.
వీళ్ళు ఓ సంగతి మర్చిపోతూంటారు-వారు జాతీయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, అంతే కానీ ఏదో ప్రాంతీయ బడ్జెట్ కాదు.అదంతా ఓ కామెడీ లాగ ఉంది.ఇన్నాళ్ళూ, లాలూ పెట్టేవాడు. తనైతే ఓ గొప్ప జోకర్!

   ఇంక ఆ స్పీకర్ సీట్లో కూర్చొన్న మీరాకుమార్ సంగతి అడక్కండి. ఎవడిదారిన వాడు అరుస్తూంటారు. ఇక్కడేమో ఈవిడ ఓ హెడ్మిస్ట్రెస్స్ లాగ వాళ్ళని కూర్చోమంటూంది. ఎవడూ ఈవిడ మాట వినడు. పార్లమెంటవనీయండి, లేక మన గ్రేట్ శాసనసభ అవనీయండి, ఏ రోజైనా చిన్నపిల్లలు చూస్తే,ఇంక జీవితంలో వాళ్ళు ఎవరిమాటా వినరు!

    ప్రతిపక్షం అంటే ఏదో ఒక అల్లరిచేయడమే వారి ధ్యేయం. ఏమైనా అంటే బలమైన ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి పెట్టనిగోడా వగైరా వగైరా…బ్లా బ్లా.. అని నీతులూ.అలాగని పాలక పక్షం ఏమీ పొడిచేయడంలేదు.మన దురదృష్టం ఏమిటంటే, ఈ బడుధ్ధాయిలందరినీ మనమే ఎన్నుకున్నాము.
అలాగని ప్రతీవారూ అలాగ అనికాదు-ఒక్కొక్కప్పుడు ఏ మధ్యాన్నం పూటో లోక్ సభ డిబేట్ లు వింటే, చాలా బాగుంటాయి.మంచిమంచి పాయింట్లు కూడా ఉంటాయి.

    మన ఎం.ఎల్.ఏ లగురించి ఎంతతక్కువ చెప్పుకుంటే అంత ఆరోగ్యం మనకి.మా చిన్నప్పటి రోజుల్లో ఉండే ఎం.పీ/ఎం.ఎల్.ఏ ఏ పార్టీకి చెందినవారైనా సరే-ఓ నీతీ నిజాయితీ ఉండేవి. భాష కూడా వినసొంపుగా ఉండేది. వాళ్ళ ప్రసంగాలు మర్నాటి పేపర్లలో చదవడానికి అందరూ ఎదురు చూసేవారు. అసెంబ్లీ లో శ్రీ తెన్నేటి విశ్వనాధం, శ్రీ వావిలాల, శ్రీ ఎన్.జి.రంగా, శ్రీ పుచ్చలపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే అతిరథ మహారథులుండేవారు.ఇంక పార్లమెంటు కొస్తే ఆచార్య కృపలానీ,నాథ్ పాయ్,రాజ్ నారాయణ్,నెహ్రూ,కృష్ణమీనన్ వగైరా వగైరా..

    మన తెలుగు చానెల్స్ లో అసెంబ్లీ సెషన్ ప్రత్యక్షప్రసారాలు వింటూంటే నవ్వాలో, ఏడవాలో తెలియదు.పైగా ఇంకో గొడవా-ఈమధ్యన జరిగిన పరిణామాల దృష్ట్యా, ఎవరో కొంతమంది రాజీనామాలు చేశారని చదివాము. మరి అలాటప్పుడు వీళ్ళ వెనక్కాలే ఉండే సెక్యూరిటీ కి మనం ఎందుకు డబ్బు పెట్టుకోవడం ఎందుకూ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టి.వీ –

    ఒక విషయం నాకు అర్ధం అవడం లేదు. చూపించిన సినిమానే మన చానెల్స్ ఎన్నిసార్లు చూపిస్తాయో.ఒకసారి ‘బ్లాక్ బస్టర్’ అంటారు,ఇంకోసారి ‘మూవీ ఆఫ్ ద మంత్’అంటారు,ఇంకోసారి ఏదో సింగినాదం అంటారు. ఇంకో విచిత్రం ఏమంటే స్పాన్సర్స్ కూడా యాడ్ లు ఇస్తూనే ఉంటారు. ఈ హింస నుండి మనకు విముక్తే లేదా? ఒకసారి ఫర్వా లేదు.రెండో సారి ఓ నెలపోయిన తరువాత ఓ.కే. ఇదేమిటండీ వాళ్ళ దగ్గరున్న సో కాల్డ్ పాప్యులర్ సినిమాలు ఏడాది లోనూ 15-20 సార్లు చూపించాలా? ఆ స్పాన్సర్లు కూడా పట్టించుకోరా?

    ఇంక డ్యాన్సు పోటీల సంగతికొస్తే ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యానికి అంత మంచిది! కార్యక్రమాల మధ్యలో ఆ డ్యాన్సు పోటిలు- ఢీ, మగధీర, ఇంకోటేదో–గురించి ప్రొమోస్. దానిలో, ఆ జడ్జీలు మాట్లాడే భాష వింటూంటే, వికారం పుట్టుకొస్తోంది. ఇదివరకటి రోజుల్లో ‘రికార్డింగ్ డ్యాన్సు’ అని ఉండేది, గుర్తుందా? వాటిగురించి ఇళ్ళల్లో మాట్లాడితే చాలు, చెప్పుదెబ్బలు తగిలేవి. ఇప్పుడు అవి తిన్నగా మన డ్రాయింగు రూం లలోకి వచ్చేశాయి.అందులో ఏం ఆనందం అనుభవిస్తారో వాళ్ళకే తెలియాలి.

    శాస్త్రీయ పధ్ధతి లో చేసే నృత్యాలకి ఇప్పటికీ ప్రక్కనే కూర్చొని పాట పాడతారు. ఈ టి.వీ డ్యాన్సులకి ( అవే ఆ కుప్పిగంతులు) ఈ గొడవేం అఖ్ఖర్లేదు.డాల్బీ సౌండు లో ఓ సి.డి.పెడితే, ఆ సో కాల్డ్ కళాకారులు ఏవేవో గంతులు వేస్తారు. సినిమాల్లో చూస్తున్నాముగా ఇంకా ఎందుకండీ బాబూ ఈ గోల? ఏమైనా అంటే మిమ్మల్నేమైనా చూడమన్నామా, అంత అసహ్యం అయితే మానేయండి. మీరొక్కరు మానేయడం వల్ల, మా టి.ఆర్.పీ లు ఏమీ తగ్గవు!

   ఇంక సీరియల్స్ కొస్తే, భారత దేశంలో ప్రతీ కుటుంబంలోనూ, ఒకళ్ళో, ఇద్దరో విలన్లు ఉంటారనుకుంటారు. ఈ మధ్యన కొంచెం వయస్సు పెద్దగా ఉండే స్త్రీలని కూడా విలన్లలాగ చూపిస్తున్నారు. ఇన్నాళ్ళూ, కనీసం ఇంట్లో పెద్దవాళ్ళకు కొంచెం ‘ఎథిక్స్’ ఉంటాయేమో అనుకునే వాళ్ళం. నా ఉద్దేశ్యంలో హిందీ లో ఉన్న ఏక్తా కపూర్ సీరియల్స్ చూసి చూసి, ఈ పెద్దాళ్ళ ఆలోచనా సరళి కూడా మారిపోయుండొచ్చు! హిందీ లో ఈ మధ్యన వస్తున్న కొన్ని సీరియల్స్ చూస్తూంటే, ఇన్నాళ్ళూ పెద్దవారంటే ఉన్న గౌరవం కూడా పోతూంది.

    తెలుగులో అదేదో ‘సతీ లీలావతి’ ట-అందులో హీరోయిన్ అనుకుంటా మాట్లాడే ఓ సీను అస్తమానూ యాడ్ వేస్తున్నారు. వీళ్ళనీ, ఈ సీరియల్స్ నీ చూస్తే ఇంకా పెళ్ళి కాని అబ్బాయిలెవరైనా ఉంటే ఖంగారు పడిపోతారు. పెళ్ళైతే ఇలా ఉంటుందేమో అని !

    నాకు ఒక విషయం ఇప్పటికీ మిస్టరీ గానే ఉండిపోయింది- ఇన్ని హింసలు, చిత్రహింసలూ పెడుతున్న టి.వి. ఛానెల్స్ ని ఆ డి.టి.ఎచ్ వాళ్ళు
మెనూ లో ‘ఎంటర్టైన్ మెంట్’ క్యాటిగరీలో ఎందుకు పెడతారూ
అని. అందులో రకాలు- న్యూస్, కిడ్స్, స్పోర్ట్స్,మూవీస్,రీజినల్,రెలిజియన్, మ్యూజిక్–అని. ఎంటర్టైన్ మెంట్ అనేది ఓ వర్గం.అందులో మన సీరియల్స్ అన్నీ వస్తాయి. ఎవరిని ఎంటర్ టైన్ చేస్తున్నారో?

    ఇంక సంగీత కార్యక్రమాలకొస్తే ప్రస్తుతం జీతెలుగు,మా, ఈటివీ లోనూ చూస్తున్నాము.ఎస్.పి బాలూ గారు చేస్తున్న కార్యక్రమంలో ఓ పాలసీ పెట్టారు.ఇంకే కార్యక్రమంలోనూ పాల్గొనని వారినే ఎలిజిబుల్ అన్నారు. దీని ధర్మమా అని ఓ గొడవ తప్పింది, చూసిన వాళ్ళనే, విన్నవాళ్ళనే అస్తమానూ భరించఖ్ఖర్లేదు. ఇంక మిగిలిన చానెల్స్ లో ఎప్పుడు చూసినా ‘ఆస్థాన/నిలయ విద్వాంసులే’ ఇదివరకు రేడియో లో ఉండేవారు-ఈ నిలయ విద్వాంసులు అనే వారు. ఏ ప్రోగ్రామూ లేకపోతే వారి కార్యక్రమాలు వినవలసి వచ్చేది.

    ఇప్పటి మన న్యూస్ చానెల్స్ లోలాగ, ఎక్కడ చర్చా కార్యక్రమం ఉన్నా వాళ్ళే కనిపిస్తూంటారు. ఈవేళ రైల్వే బడ్జెట్ గురించి, మన చానెల్ ఏదో, ఇద్దరు ఎం.పీ. లని వారి అభిప్రాయాలు అడిగింది. వాళ్ళు చెప్పేవి వింటూంటే, వాళ్ళ హావభావాలు చూస్తూంటే, ప్రజలని ఈ రాజకీయనాయకులు ఎంత వెర్రివెధవలు చేస్తున్నారో తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎన్నికలొస్తున్నాయికదా అని తృణమూలమ్మకి బెంగాలు తప్ప ఇంకేమీ కనిపించవు.రైళ్ళన్నీ
అక్కడే ప్రారంభం అయి అక్కడే అంతం అవుతాయి.

    వాడెవడో ఎం.ఎల్.ఏ అదేదో ‘విక్రమార్కుడు’ సినిమాలోలాగ అందరినీ హింస పెట్టేస్తున్నాడుట. దానిమీద ఓ చానెల్ వాడు ‘స్టోరీ’ చేశాడు. ఓహో అలాగా ఈ ప్రభుత్వంలో ఎంత అరాచకంగా ఉందీ అనుకున్నంత సేపు పట్టలేదు, ఈవేళ సదరు’విక్రమార్కుడి’ లో ‘విలన్’ ని ఇంకో చానెల్ వాడు ఇంటవ్యూ చేసి, వీడంత అమాయకుడు లేడూ అన్నాడు. ఎవడిని నమ్ముదామూ? ఈ చానెల్స్ వాళ్ళు మనల్ని ‘బక్రా’ చేస్తూనే ఉంటారు.మనం వెధవలౌతూనే ఉంటాము, ప్రపంచం ఏమీ ఆగిపోదు !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పేర్లు గుర్తుకు రావు-2

    నిన్న ‘పేర్లుగుర్తుకు రావు’ అనే శీర్షిక క్రింద ఓ బ్లాగ్ వ్రాశాను.24 గంటలు తిరక్కుండా, ఈ వేళ వీధిన పడిపోయాను ! ప్రొద్దుటి కార్యక్రమాలు
గుడి, పిల్లలకి టాటా లు చెప్పడం,బ్రేక్ ఫాస్టూ పూర్తయిన తరువాత కంప్యూటర్ ముందు ఏదో కెలుకుదామని కూర్చున్నాను.ఇంతలో మాఇంటావిడ వచ్చి, ‘ఎవరో రమేష్ ట, మీ గురించి అడుగుతున్నారు, చూడండి’అని పిలిచింది.

    సరే అని వచ్చి చూస్తే, బయట ఒకాయన ఉన్నారు.ఎక్కడో చూసిన మొహంలాగే కనిపించింది.పేరు రమేష్ అని ఆయనే చెప్పడంతో, ఓ గండం తప్పింది! లోపలకి వచ్చిన తరువాత గొప్పగా, ఈయన రమేష్ అనీ..సాగతీసుకుంటూ పరిచయం చేయబోతే, మా ఇంటావిడ ఊరుకోచ్చా,’పేరు ఆయనే చెప్పారు…’ అని ఆపేసింది.అంటే దానర్ధం ‘ఆమాత్రం నాకూ తెలుసునూ, ఈయన గురించి మిగిలిన పరిచయం చెయ్యవోయ్’ అని!
ఇంక నా ఎక్సర్సైజ్ మొదలెట్టాను.ఎంత ప్రయత్నించినా ఎక్కడ చూశానో గుర్తుకు రాలేదు. తెలుగాయన అని తెలిసింది(తెలుగులో మాట్లాడారు కాబట్టి!). అయినా ఓ రాయేద్దామని, ‘మీరు బ్యాంకు లో కదూ పనిచేస్తోంట’. ‘కాదండీ సత్యం లోనూ’ అని ఆయన జవాబూ.మొదటి వికెట్టు డౌన్ !’ ఔనౌను చెప్పారుకదూ, సత్యం మహీంద్రా అని,గుర్తొచ్చింది’. అక్కడ ఆ ‘మహీంద్రా ‘ అని చెప్పడం దేనికీ, నా అప్రయోజకత్వాన్ని దాచుకోడానికి !!నేను ‘కంఫర్ట్ లెవెల్ ‘ కి రావడానికి, ఓ పావుగంట పట్టింది !అంతసేపూ, మా ఇంటావిడ అక్కడే కూర్చొని కదలదే! ఇంకా ఎన్నిసార్లు వెర్రిమొహం పెడతానో అని చూడ్డానికన్నమాట!ఇంక ఇది కాదు పధ్ధతీ అని,’ మీది ఏ ఊరూ, మీ భార్యగారిది ఏ ఊరూ’ లాటి రొటీన్ ప్రశ్నలు వేసి, ఇంక తనే సిట్యుఏషన్ కంట్రోల్ లోకి తీసేసికొంది !

    ఇంతట్లో నా బుర్రకి ‘తట్టూ’ అయింది, ఆయనని ఎక్కడ కలిశానో- చెప్పానుగా నాకున్న దురల్వాట్లలో ఒకటేమిటంటే, ఎవరి చేతుల్లోనైనా తెలుగు పేపర్ చూస్తే, పనిమాలా వాళ్ళని ఆపి, పరిచయం చేసికోవడం!పైగా దాంతో ఆగను, వాళ్ళెక్కడుంటున్నారూ, ఎంతకాలంనుండుంటున్నారూ,ఏ ఊరూ
లాటి అన్ని వివరాలూ అడగడం. దానికి సాయం, మేము ఎక్కడుంటున్నామో అదీ చెప్పడం. ఏం లేదూ, మేం ఉండే ఎపార్ట్మెంట్ చాలా సుళువుగా గుర్తుంటుంది.పైగా బిజీ గా ఉన్న రోడ్డు మీద,మంచి లొకేషన్ లో ఉంది.ఆ మాట అవతలివాళ్ళచేత ఓ సారి అనిపించుకుంటే అదో సంతోషం!
పోనీ ఇంతసేపు మాట్లాడింతరువాత గుర్తు పెట్టుకోవాలిగా, అబ్బే! అక్కడ ఎప్పుడూ బధ్ధకమే!అదండి సంగతి! కానీ నేను ఆయన్ని మొదటిసారి ఎక్కడ కలిశానో గుర్తొచ్చిన తరువాత, ఇంక నన్ను పట్టేవాళ్ళెవరూ ఉండరు!కబుర్లు చెప్పాలంటే నా తరువాతే! ఏమైనా ఆఫీసుకెళ్ళాలా,పిల్లల్నేమైనా ఎత్తుకోవాలా ? కబుర్లేగా, కావలిసినన్ని చెప్పగలను! మాకు దగ్గరలోనే ఉంటున్నారు. వచ్చే రెండు రోజుల్లోనూ వాళ్ళింటికి వస్తానని చెప్పాను. ఇంక మళ్ళీ మర్చిపోకుండా. అలాగ ఓ రెండు మూడు సార్లు కలిస్తే ఫర్వాలేదు, గుర్తుంటారు.ఆయనతో ఓ గంట గడిపాము.

    నా అలవాటు ప్రకారం, ఈవేళే ప్రొద్దుట ఓ అబ్బాయిని, ‘సాక్షి’ పేపరు చదువుతూంటే చూశాను. షరా మామూలే.. ఏ ఊరూ, పేరేమిటీ, ఎక్కడ ఉంటున్నారూ వగైరా వగైరా…వివరాలూ, మొహమూ ప్రస్తుతం వరకూ గుర్తున్నాయి. నా అదృష్టం ఎలా ఉందో? అయినా ఈవేళ కూర్చొని,
పరిస్థితి రివ్యూ చేశాను- ఎంతమందిని ఈ మధ్యన కలుసుకున్నానూ ఇలాగ అని. ఓ నలుగురు లెఖ్ఖకొచ్చారు. నా యోగం బాగుంటే, వారిని త్వరలోనే, ఏ రోడ్డుమీదో కలుస్తాననీ, ఆ టైములో మా ఇంటావిడ నాతో ఉండదనీ తలుస్తూ
….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పేర్లు గుర్తుకు రావు!

    నెమలికన్ను వ్రాసిన ‘మరచిపోయా..’బ్లాగ్గు చదివిన తరువాత, నేను దానిమీద వ్యాఖ్య వ్రాయడం మొదలెడితే, అదో బ్లాగ్గంత అవుతోందని,ఆపేసి,ఓ చిన్న వ్యాఖ్య మాత్రం పోస్ట్ చేశాను.నెమలికన్ను గారూ, మీరు వ్రాసినది చదివినతరువాత ఆలోచిస్తే, నాకు ఇలాటి అనుభవం
చాలా సార్లు జరిగింది.

    మీరు చెప్పినది అక్షరాలా కరెక్టు.రోడ్డుమీద వెళ్తూంటే ఎవరో కనిపించి ‘హల్లో ఫణిబాబూ’ అని పలకరిస్తారు.నేనుకూడా సమాధానంగా ‘హాయ్’ అనేసి ఊరుకోలేను.అతని మొహం గుర్తుంటుంది కానీ పేరు మాత్రం చచ్చినా గుర్తుకు రాదు. అతనితో మాట్లాడుతూ,ఫాక్టరీలో నాతో పనిచేసినవాడా,
లేక నాతో పరిచయం ఉన్న ఏ వెండరా( నేను మా ఫాక్టరీలో పర్చేస్ డిపార్ట్మెంటు లో 7 సంవత్సరాలు పనిచేశాను), లేక ఇంకోరా అని బుర్ర బ్రద్దలుకొట్టుకుంటాను.నా మొహం ఒకసారి చూసినవాళ్ళకి గుర్తుంటుంది.అంటే అదేదో ‘ఫేమస్’ అనికాదు.నా బట్టతలా, బొట్టూ,కళ్ళజోడూ లాటివి
కొంతమంది ఆద్వానీగారిలాగ ఉంటానంటారు.ఇంకోళ్ళు గాంధీగారిలాగ అని. ఏమైతేనేంలెండి గొప్పవాళ్ళతోనే పోల్చారు!!తిట్టడం లేదుగా !

    ఈ సందర్భంలోనే ఓ సంఘటన గుర్తొస్తుంది-ఒకసారి మా రోడ్డుమీదనుండి ఎల్.కే.ఆద్వానీ గారి రాక సందర్భంలో పోలీసు బందోబస్తూ అవీ పెట్టారు.అంతమంది పోలీసులిని చూసి, ఏమిటి సంగతీ అని ఓ పోలీసు ఇనస్పెక్టర్ ని అడిగితే, అతను నన్ను చూసి ముందర ఆశ్ఛర్యపడిపోయి, ఎటెన్షన్ లోకి వచ్చేసి’ అర్రే బాప్రే, ఆప్ యహా కైసా’ అన్నాడు.’హమారా ఘర్ పాస్ మే హై’ అనగానే, ‘సారీ సర్, ఆప్కో మే ఆద్వానీసాబ్ సంఝా’ అన్నాడు !

    ఎప్పుడైనా ఓ రిటైర్ అయిన స్నేహితుడెవరైనా కనిపిస్తే,చాలా కష్టాల్లో పడుతూంటాను.పేరు గుర్తుకు రాదు, ఎక్కడ పనిచేసేడో గుర్తుకు రాదు,అంతా అయిన తరువాత పేద్ద గొప్పగా ‘నీ ఫోన్ నెంబర్ ఇయ్యి’అని సెల్ లో నోట్ చేసికోవడం, పేరేం రాయాలో తెలియదు,సిగ్గు విడిచి, పేరేం వ్రాయమంటావూ అని అడిగేయడం.’అర్రే నా పేరు మర్చిపోయావా’అని అతగాడు నిలదీసినా, ‘మర్చిపోలేదూ, షార్ట్ లో ఏంరాయాలో అనీ...’అడిగానూ అనడం !

    నా అదృష్టం బాగోక రోడ్డుమీద వెళ్తున్నప్పుడు నాతో మాఇంటావిడో, అబ్బాయో ఉన్నారా, ఇంక నా కష్టాలు అడక్కండి- ఇంట్రడ్యూస్ చేయాలి, పేరు తెలియదూ,’ వీళ్ళు మా ఫామిలీ అని చెప్పేసి ఊరుకుంటాను’. ఇంక ఆ తరువాత మా వాళ్ళు నన్ను ఆట పట్టేస్తూంటారు. ‘ఆయనెవరో గుర్తు లేదు కదూ’ అని.

    ఈ మధ్యన బస్ స్టాప్ లో బాగా తెలిసున్న ఒకాయన (తెలుగు వారే) కనిపించారు. ఆయన పేరు ఇంకోలా అనుకొని ధైర్యం చేసేసి,అదేదో నేను ఆయన మూవ్మెంట్స్ ఫాల్లో అవుతున్నట్లుగా-‘ ఈ మధ్యన ఇక్కడ ఫ్లాట్ కొన్నారుటకదా ‘అన్నాను.ఆయన మొహం కొంచెం అదోలా పెట్టడం చూసి,టాపిక్ మార్చేసి,’చాలా రోజులయిందీ,ఎలా ఉన్నారూ ఫలనా ఫలానా…’ అని అడిగేసి ఊరుకోపెట్టాను.ఆయన బెంగుళూరు నుండి అదే రోజు వచ్చారుట, మా ఇంకో ఫ్రెండు ఇంట్లో ఉన్నారుట.ఇంతలో ఆయన బస్సొచ్చింది, నేను బ్రతికిపోయాను.కొంతసేపటికి మా కామన్ ఫ్రెండొస్తే, ఈ సంగతంతా చెప్పి,’బాబూ ఆయన పేరు మర్చిపోయానూ ‘అని చెప్పి నా గోలంతా చెప్పాను.అతనికీ ఇదే సమస్య !

   మా ఇంటావిడ అలాగ కాదండోయ్, ఎవరు పలకరించినా సరే, వాళ్ళ పిల్లల పేర్లూ, చుట్టాల పేర్లూ పెరు పేరునా అడిగి వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతుంది.అవతలివాళ్ళు ఐసై పోతూంటారు.ఎప్పుడో సంవత్సరాల క్రింద పరిచయం ఉన్నవాళ్ళైనా సరే మర్చిపోదు!

    మా చుట్టాల విషయంలోనూ నాకు ఇదే బలహీనత!ఒక్కళ్ళ పేరూ గుర్తుండదు.అయినా ఏదో పెద్దాడైపోయాడూ అని వదిలేస్తూంటారు. ఈ సీనియర్ సిటిజెన్ పదవి వల్ల కొన్ని సుఖాలూ ఉన్నాయి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఆప్త మిత్రులు

రాజమండ్రి లో ఉన్నప్పుడు నాకు ప్రాప్తించిన అదృష్టాలలో శ్రీ అప్పారావు (సురేఖ) గారితో పరిచయం. వారింటికి వెళ్తే సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు.ఆయన గురించి ‘ఈనాడు’ 20/02/2010 తూ.గో.జి ఎడిషన్ లో వచ్చిన వార్త. ఇలాటివారితో మాకు పరిచయం ఉండడం వలన, మా అంతస్థు కూడా పెరిగిపోయిందోచ్చ్ !
Sri Appa Rao

Read it here

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పూణే మే సురక్షా వ్యవస్థా

    చాలా రోజుల తరువాత, మా ఇంటావిడ ఈవెనింగ్ వాక్ కి వెళ్దామంటే, ఇద్దరమూ కలిసి రేంజ్ హిల్స్ వెనక్కాల ఉన్న యూనివర్సిటీ రోడ్ మీద నడుస్తూ వెళ్ళాము.ఆ రోడ్డంతా రక్షణ మంత్రిత్వ శాఖ వారి హయాములో ఉంది.ఓ ప్రక్కన ఖడ్కీ మిలిటరీ హాస్పిటలూ, ఓవైపున మిలిటరీ వారి క్వార్టర్సూ,ఇంకో వైపు సెంట్రల్ క్యాంటీనూ,పారాప్లెజిక్ హోమ్, ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో ఉన్నాయి.వాటికి ఆల్మోస్ట్ ప్రక్కనే, ఓ స్థలం అంతా
ఓ ప్రెవేట్ బిల్డర్ కి అమ్మేశారు.అతను అక్కడ లక్జరీ ఎపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాడు.

    ఓ వైపు దేశ రక్షణా, సెక్యూరిటీ ఇంకా పటిష్టంగా ఉండాలీ అంటూ, రక్షణ విభాగాల ప్రక్కనే ఇలాటివి ఎలా అనుమతిస్తారో తెలియదు.అక్కడ కాలనీ ఇంకో రెండేళ్ళలో వచ్చేస్తుంది.అక్కడ సెక్యూరిటీ ఎలా చూస్తారో భగవంతుడికే తెలియాలి.

    ఈ బిల్డర్ కి రాజకీయ పలుకుబడి చాలా ఉంది.అయినా ఆమధ్య ఏదో కేసులో పాస్పోర్ట్ సీజ్ చేశారు.అయినా ఏ బెంగా లేకుండా హాయిగా, రక్షణ శాఖ వారి ప్రక్కనే ఓ పేద్ద కాలనీ కట్టేయకలుగుతున్నాడు.

    బాంబు పేలుళ్ళూ అవీ అయినప్పుడు, అదేదో ‘సాఫ్ట్ టార్గెట్’, హార్డ్ టార్గెట్’ అని పేర్లు పెట్టి, ఒకచోట సెక్యూరిటీ ఎక్కువగానూ, రెండో చోట ఏదో ఆషామాషీ గానూ పెడతామంటారు. ఈ సందర్భంలో పూణే రైల్వే స్టేషను ఏ వర్గంలోకి వస్తుందో ఆ పరమాత్మ కే తెలియాలి.ఈ సందర్భంలో PUNE MIRRORలో వ్రాసిన వార్త చదవండి. బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరామంటే అదేదో సురక్షా వ్యవస్థ బాగా ఉందనికాదు అర్ధం. మన అదృష్టం బాగుందనిన్నీ, ఇంట్లో వాళ్ళ మంగళసూత్రాలు ఇంకా గట్టిగా ఉన్నాయనిన్నీ అర్ధం చేసికోండి.

   మన రాజకీయ నాయకులకి ఇస్తున్న జెడ్ క్యాటిగరీలూ, సినిమా వాళ్ళకీ, ఇంకా మిగిలిన రౌడీ షీటర్స్ కీ ఇస్తున్న సెక్యూరిటీ కవర్ లలో లక్షోవంతు, ఇవ్వవలసిన చోట ఇస్తే ఈ పేలుళ్ళూ అవీ ఉండవు. పైగా ఈ బడుధ్ధాయిలకి ఇస్తున్న సెక్యూరిటీ ఖర్చంతా మీరూ, నేనూ పెట్టుకుంటున్నాము.అయినా కామన్ మాన్ గురించి ఎవడూ పట్టించుకోడు. బ్రతక్క ఏం చేస్తాడులే!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-వ్యాపార ప్రకటనలు

కప్పగంతు శివరామప్రసాద్ గారు ఈ మధ్యన ఇప్పుడు టి.వీ. ల్లో వస్తున్న వ్యాపార ప్రకటనల గురించి ఆవేదన వ్యక్త పరిచారు His Blog
అది చదివిన తరువాత యూట్యూబ్ లోకి వెళ్ళి 80-90 లలో దూరదర్శన్ లో వచ్చిన వ్యాపార ప్రకటనలు వెదికితే వచ్చిన కొన్ని ఆణిముత్యాలు

దొరికాయి.

Watch them here