బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

    ఒక్క విషయం మాత్రం మెచ్చుకోవాలి, మన పాలకుల విషయంలో. మంచం మీదనుండి దింపేసి, చాప మీద పడుక్కో పెట్టేసిన తరువాత కూడా, ” ఫరవాలేదు.. ధైర్యంగా ఉండండి.. మన ప్రయత్నం మనం చేద్దాం..” అన్నట్టే, పార్లమెంటులొ, ఎటువంటి సందేహాలూ లేకుండా, ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా లేదూ.. అని నొక్కి వక్కాణించి చెప్పినా సరే, మన అధికార పక్ష నాయకులు మాత్రం.. ” అబ్బే ప్రణాలికాసంఘం కదండీ చెప్పిందీ, మరేం పరవాలేదు, ప్రధానమంత్రిగారు కాదు కదా చెప్పిందీ.. మన నాయకుడు, నెలకోసారి ఢిల్లీ వెళ్ళి మాట్టాడుతున్నారుగా.. పనిలో పని మొన్నోసారి సింగపూర్, చైనా, కూడా వెళ్ళొచ్చారూ.. ధైర్యంగా ఉండండి..” మీకెందుకు చూస్తూ ఉండండి.. ఏ దేశం వెళ్తే, వెంటనే తిరిగొచ్చేసి, మన రాష్ట్రాన్నికూడా తను చూసొచ్చిన దేశం లా తయారుచేసేద్దామనడం లేదూ? ఏమిటో మీరు మరీనూ.. కొద్దిగా సహనం ఉండాలండి..” అంటారు. ఓ నాలుగేళ్ళు ఇలా లాగించేస్తే సరీ.. रात गयी बात गयी.. తరువాత మీరెవరో మేమెవరో.. ఈలోపులో ఇంకోటేదో దొరకదా ఏమిటీ? ఒకాయనేమో ” స్వర్ణాంధ్ర” అంటారు. ఇఁకొకాయనేమో పోటీగా “బంగారు తెలంగాణా” అంటారు. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, ఇద్దరిలోనూ ఉన్న సుగుణం- ఇద్దరూ తమ పుత్రరత్నాలని వారసులుగా ప్రకటించేశారు. ఇన్నాళ్ళూ, నెహ్రూ గారి కూతురూ, ఆవిడ కొడుకూ దేశాన్ని భ్రష్టు పట్టించేశారూ అని గొడవచేశారు. మరి వీళ్ళు చేసేదేమిటో? అదృష్టం బాగుండి, దేశం ఓ “పుత్రరత్నం,” రాష్ట్రం ఇంకో ” పుత్ర్రరత్నం ” చేతుల్లోకీ వెళ్ళలేదు. దేశప్రజలు చేసికున్న ఏ పూర్వజన్మ పుణ్యమో కానీ, మన ప్రధానమంత్రిగారికి అసలు ఆ గొడవే లేదు.

    బతికున్న వాళ్ళ సంగతి తరువాత చూసుకోవచ్చూ అనుకుని, “పోయిన” వాళ్ళతో సంపర్కం ఉంచుకోవచ్చుననేమో, భాగ్యనగరం లోని శ్మశానాలని ఆధునీకరణించేసి, అందులో wi-fi కూడా పెట్టేస్తున్నారుట.EENADU – Ts-state News. వాటిని కూడా modernise చేసేస్తున్నారు. ఇన్నాళ్ళూ, ఏ అంత్యక్రియలకైనా వెళ్ళాల్సొస్తే, ఏదో ఆ పోయిన వ్యక్తి గురించి, బాధ వ్యక్తపరచి, సాబుభూతి వాతావరణం పాటించాలనుకునే వారం, ఇప్పుడు ఆ గొడవ లేదు. హాయిగా net browsing చేసికుంటూ గడిపేయొచ్చు. పైగా పక్కనే ఇంకొన్ని సదుపాయాలుకూడా కలుగ చేస్తారుట ! అద్గదీ అలా ఉండాలి.

    బతికున్న రైతులు ఆత్మహత్యలు చేసికుంటున్నా పట్టించుకునే నాధుడు లేదు.ఓవైపున, కేజ్రీవాల్ గారు స్టేజి మీద ప్రసంగం చేస్తూనే ఉన్నారు, ఇంకోవైపున ఓ చెట్టుమీద ఓ రైతు సావకాశంగా ఓ చెట్టు మీదకెక్కి, ఉరి వేసికున్నాడు. మొత్తం, ఈ దురదృష్టకర సంఘటన జరగడానికి ఓ గంట దాకా పట్టిందిట. అంతసేపూ చుట్టూ ఉన్నవారు, ఏదో తమాషా చూస్తున్నట్టున్నారే కానీ, పోలీసులు కానీ, జనం కానీ, ఆ రైతు చేస్తూన్న పనిని ఆపాలని అనుకోలేదుట. అన్నిటిలోకీ నికృష్టం ఏమిటంటే, ఈ పూర్తి సంఘటనని, మన మీడియా ప్రబుధ్ధులు, తమ వీడియో కెమేరాల్లో భద్ర పరుచుకోవడం. అప్పుడెప్పుడో జరిగిన నిర్భయ కేసుకి సంబంధించిన సంఘటన మీద, ఆవిడెవరో బిబిసి తరపున, ఓ డాక్యుమెంటరీ చిత్రిస్తే, మన దేశ పరువు బజారు పాలైపోతుందని, మన చానెళ్ళ మీద ఆంక్షలు పెట్టడం గుర్తొచ్చిందేమో, అలా కాకుండా, మనమే ప్రస్తుత సంఘటనని వీడియో తీసేస్తేనె బాగుంటుందనుకున్నారు. మరి ఇప్పుడు మన దేశ పరువు ఎక్కడకివెళ్తోందీ? మామూలుగా జరిగినట్టే, మర్నాడు పార్లమెంటులో మన వాళ్ళందరూ హడావిడి చేసి, ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు. ఓవైపున ఈ చర్చలు వాటిదారిన అవి జరుగుతూనే ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసికుంటూనే ఉన్నారు. పైగా గత అరవై ఏళ్ళనుండీ జరుగుతున్నవే కదా, ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందీ అనే సమర్ధింపోటీ. దేశ రాజధానిలో అందరి ఎదుటా జరిగింది కాబట్టి ఇంత హడావిడి చేశారు. లేకపోతే, ఏరోజు పేపరు చూసినా దేశమంతా ఇవే వార్తలు.

    ఇదివరకటిరోజుల్లోనూ ఉండేవి, వర్షాలూ, తుఫానులూనూ, కానీ వాటికీ ఓ సమయం సందర్భమూ ఉండేది. ఈ ఆత్మహత్యలూ, పంట భీమాలూ అవీ ఉండేవి కావు. కానీ ఈ రోజుల్లో నెలకో వాయుగుండం, అకాల వర్షాలూ, ఉపరితల ద్రోణులూ, వాటికో ప్రత్యేకమైన ముద్దుపేరూ. వీటన్నిటికీ కారణం- Global warming అని అందరికీ తెలుసు. కానీ వాటి గురించి ఎవడూ పట్టించుకోడు. పైగా అదేదో EARTH DAY అని సభలూ, సమావేశాలూ, స్లోగన్లూ… వీటితోనే సరిపోతోంది.

    మేరా భారత్ మహాన్…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– keeping fingers crossed…

    ఈ టపా కి పెట్టిన శీర్షిక చిత్రంగా ఉంది కదూ.. ఏం చేస్తాను.. ఏ దిక్కూ లేకపోతే చేయగలిగిందల్లా అంతకంటే ఉండదు. గత పదేళ్ళుగా, ప్రతీ ఏడాదీ, పెన్షను బట్వాడా చేసే మా SBI కి నవంబరు నెలొచ్చేసరికల్లా, వెళ్ళడమూ, ” బతికే ఉన్నాను మహాప్రభో..” అని మొరపెట్టుకోవడమూ, తిరిగి ఓ ఏడాది దాకా నిరాటంకంగా( అదృష్టం బాగుంటే ) ప్రతీ నెలా పెన్షన్ తీసికోవడమూనూ. ఈ ప్రక్రియకు నేను పెట్టుకున్న ముద్దు పేరు..thaద్దినం. దీనిమీద ఓసారి ఓ టపా కూడా వ్రాశాను. ఒకటేమిటీ ప్రతీ ఏడూ వ్రాసేవాడిని. శ్రీ మోదీగారి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇందులో కొంత వెసులుబాటు కల్పించారు. ప్రతీ నవంబరులోనూ, పెన్షనర్లందరూ బ్యాంకులకి వెళ్ళనక్కరలేదూ, online లో బతికే ఉన్నామని ఋజువు చేస్తే చాలూ అన్నారు. అమ్మయ్యా బతికామురా బాబూ అనుకున్నాను. ఈ తతంగం అంతా ఏం చేస్తారూ, ఎలా చేస్తారూ అన్నది ఇన్నాళ్ళూ ప్రకటించలేదు. పోనిస్తూ.. ఇంకా 7 నెలల పుణ్యకాలం ఉందిగా ఆ తతంగానికి అనుకున్నాను. కానీ, ఆ ముహూర్తం కూడా వచ్చేసింది.

    ఈవేళ నా మొబైల్ లో ఓ సందేశం…నా పేరూ, నా ppo నెంబరూ, ఓ లింకూ అందులో నా ఆధార్ నెంబరు నమోదు చేసికోడానికి ఓ పాస్ వర్డూ..”అంతవరకూ బాగానే ఉంది. వెంటనే నా సిస్టం లో ఆ లింకుకి వెళ్ళి, వారిచ్చిన సమాచారం ఉపయోగించి, నా ఆధార్ నెంబర్ నమోదు చేసేసికున్నాను. అంతవరకూ కూడా బాగానే ఉంది. మనం బతికుండడమే కాకుండా, దానికి ఓ సర్టిఫికెట్ ఒకటి ఉండొద్దూ. అదేదో సంపాదించడానికి, ఆ సైట్ లో సైన్ అప్ చేసికోమన్నారు. అక్కడ వివరాలన్నీ, నింపినా, అదేదో డౌన్ లోడ్ చేసికుని, దానిమీద ఓ స్టాంపు వేయించి అప్ లోడ్ చేయమన్నారు. పోనీ చేద్దామని తీరా చూస్తే, దాని లింకు మెయిల్లో పంపుతామన్నారు. చాలాసేపు చూసి, రాకపోతే, వారిచ్చిన నెంబరుకి ఫోను చేయడం దగ్గర మొదలయింది, ఈ టపాకి పెట్టిన శీర్షిక. ఓ పదినిముషాలు వెయిట్ చేసిన తరువాత ఒకతను లైనులోకి వచ్చి, నా గోల విని, మీకు ఇచ్చిన కోడ్ చెప్పమన్నాడు. అది చెప్పగానే, ఓ నిముషం ఆగి, ” మీ పని అయిందీ, ఆధార్ నెంబరుతో అనుసంధానం పూర్తయిందీ.. హాయిగా కూర్చోండీ..” అన్నాడు. సరే, తరువాత ఏం చేయాలీ అని అడిగితే, ఏమీ చేయనక్కరలేదూ అన్నాడు. మరి నవంబరు సంగతి ఏమిటయ్యా అంటే, ఫరవాలేదూ, మీరు బతికున్నట్టే లెఖ్ఖా అంటాడు. అలా కాదూ, ఈలోపులో టపా కట్టేస్తే.. ఫరవా లేదూ అంటాడు. మరి చెప్పండి, బతికున్నట్టా లేదా.. అంటే డిశంబరులో పెన్షను వస్తే బతికున్నట్టూ, లేకపోతే, లక్షణంగా బ్యాంకుకి వెళ్ళి ఇదివరకటిలాగే సంతకం పెట్టి, మన అస్థిత్వాన్ని ఋజువు చేసికోడమూ.. ఇదేదో కొత్తగా మొదలెట్టి, లేనిపోని కొత్త సమస్యలు మొదలెట్టారు. ఇప్పుడు అర్ధం అయిందా ఈ టపాకి అలా శీర్షిక పెట్టానో?

    కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత, మన ప్రధాన మంత్రిగారు, పాస్ పోర్టులూ, వీసాల విషయంలో నిమిషాలమీద పనైపోతుందన్నారు. ఎంత తొందరగా అవుతుందో చెప్పడానికి, మా అనుభవం ఒకటి చెప్తాను– మా కోడలు తను అమెరికా Carneigie Mellon University కి వెళ్ళాల్సిన సందర్భంలో, Passport renewal కి తత్కాల్ లో 1500 కట్టి ఎప్లై చేసింది. ఫలానా తేదీ న రమ్మన్నారు. కాగితాలన్నీ తీసికెళ్తే, అదేదో సర్టిఫికేట్ లేదూ, గవర్నమెంటులో ఫలానా జీతం పైబడ్డవారిదగ్గరనుండి సర్టిఫికెట్ తెమ్మన్నారు. సరే అని, నాకు తెలిసిన ఒక డాక్టరు గారి దగ్గర తీసికుని, రెండో సారి వెళ్ళింది. అందులో మా అబ్బాయి పేరు పూర్తిగా రాయలేదూ అని పంపించేశారు. మూడో సారి వెళ్ళినప్పుడు ఫొటో మీద సరీగ్గా సంతకం లేదూ అన్నారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే, మూడు సార్లు వెనక్కి పంపించేస్తే , మళ్ళీ 1500 లూ కట్టాలి. తిరిగి 1500 కట్టి, మూడో సారి వెళ్తే, ఆ సర్టిఫికెట్ ఇచ్చినాయన జీతం అంతుందా అంటారు. మా కోడలికి చిర్రెత్తుకొచ్చేసి, ఇప్పటికి మూడు సార్లు వెనక్కి పంపేసి, తిరిగి 1500 కట్టించుకున్నారూ, ఈ విషయాలన్నీ మొదటిసారో, రెండోసారో చెప్పడానికేంరోగం అని గయ్యిమంది. మీఈష్టం వచ్చినట్టు చేసికోండీ, నేనిక్కడనుండి కదలనూ అని ఝణాయించేసరికి, నోరుమూసుకుని, ఆ విషయాలన్నీ వాళ్ళే verify చేసికుని, మొత్తానికి సంతకం పెట్టింది. అందుకేనేమో అంటారు.. ” అమ్మ పెట్టేవన్నీ పెడితే కానీ…” అని. ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఇదో మార్గం అనుకుంటా. ఏదో కారణం చూపడమూ, మూడు సార్లు reject చేసేయడమూనూ. రైల్వేల్లో చూడండి, ఓ రెండు గంటల్లో waiting list కొల్లేరు చాంతాడంత అయిపోతుంది. పెళ్ళాం పిల్లలతో వెళ్ళేవారు చచ్చినట్టు ” తత్కాల్ ” లో తీసికుంటారనే కదా…

    అఛ్ఛే దిన్ అంటే ఇవేనేమో… ఆ భగవంతుడికే తెలియాలి...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    మగాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఎంతో ఉంటుందనే సామెత అందరూ వినే ఉంటారు. అది నూటికి నూరుపాళ్ళూ నిజం అనడానికి, మన దైనందిక జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఇంటి ఇల్లాలుని బట్టే కదండీ, మన అస్థిత్వం ! వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి పురుషాహంకారం అడ్డొస్తూంటుంది. అయినా నిజం నిజమేగా.. సాధారణంగా చాలామందికి ఒక passion అనేదుంటుంది. ఆ passion కొన్నిసార్లు, ఇంట్లోవారికి, ముఖ్యంగా ఇంటి ఇల్లాలుకి కొంచం, చిరాగ్గాకూడా ఉంటూంటుంది. అయినా ఏదోలా సద్దుకుపోతూంటారు. అదేకదా మనక్కావాల్సిందీనూ. ఏదోలా సహించేస్తోందికదా అని, మనం కూడా హద్దులు దాటకూడదు. కొంతమందికి విహారయాత్రలు చేయడం ఇష్టం, కొంతమందికి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం ఇష్టంగా ఉంటుంది. కానీ, ప్రతీసారీ ఇంటాయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంటి ఇల్లాలుకి వీలవకపోవచ్చు. అయినా సరే, ఇంటివిషయాలు తను చూసుకుంటానని చెప్పి, భర్త ఉత్సాహంమీద నీళ్ళు చల్లలేక, ” సరే.. ఈసారికి మీరెళ్ళొచ్చేయండి.. ఇక్కడ నేను చూసుకుంటానులెండి..” అని భర్తకు భరోసా ఇస్తుంది. మరి ఇదేకదా ప్రతీభర్త విజయం వెనుకా ఓ స్త్రీ పాత్ర ఉందంటే. ఏదో ఉదాహరణకి చెప్పాను. కానీ ఇలాటివే , ఎటువంటి passion ఉన్నా సరే, భార్య సహకరిస్తేనే, విజయవంతం అవుతాయన్నది పదహారణాల నిజం.

    కానీ, చిత్రంగా దంపతులిద్దరికీ ఒకే వ్యాపకం ఉంటే ” సోనేపే సుహాగా ” కదూ. అలాటి దంపతులే, మా స్నేహితులు శ్రీమతి రమణ గారూ, శ్రీ కృష్ణమూర్తిగారూనూ. మా పరిచయం ఓ రెండేళ్ళ క్రితం జరిగింది.. మేము 2014 మే నెలలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు, శ్రీ కృష్ణమూర్తిగారు, మా దంపతులని, తమ స్వగృహానికి తీసికెళ్ళి అతిథిసత్కారం చేశారు. ఆ సందర్భంలో ఒక టపా వ్రాశాను. వారింటికి వెళ్ళినప్పుడు, శ్రీమతి రమణ గారు చూపించిన ఆప్యాయత, అభిమానం జీవితంలో మర్చిపోలేము. అక్కడ అప్పుడు గడిపిన మధురక్షణాలు ( 4 గంటలు) ఇప్పటికీ, ఎవరిని కలిసినా పంచుకుంటూంటాము. అచ్చ తెలుగు , షడ్రసోపేతమైన విందు, కొసరికొసరి వడ్డించడమూ, ఆవిడ మాతో మాట్టాడిన పధ్ధతీ ( ఎటువంటి భేషజాలకీ పోకుండా ) ఎప్పటికీ మరువలేనివి. ఓ మంచి స్నేహితులతో పరిచయమయిన సంతృప్తి కలిగింది. ఈ వయసులో ఇలాటివే కదండీ కావాల్సినవి.

    ఈవేళ మధ్యాన్నం, మా అబ్బాయి ఫోను చేసి చెప్పాడు– ఒక విషాద వార్త– శ్రీమతి రమణ గారు ఇక లేరని. నమ్మలేకపోయాను. ఆవిడ మాతో చెప్పిన కబుర్లు ఇప్పటికీ గుర్తున్నాయి.
వెంటనే శ్రీకృష్ణమూర్తి గారికి ఫోను చేసి, పరామర్శించాను. అంతకంటే ఏమీ చేయలేక. ఆయనకి ఈ వయసులో, జీవిత భాగస్వామిని కోల్పోడమంటే చాలా పెద్ద దెబ్బ. జీవితంలో ఆయన కష్టసుఖాలలో పాలుపంచుకోవడం , సాధారణంగా అందరూ చేసేదే. కానీ ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే కళాఖండాలని, స్వంత బిడ్డల్లా సాకడం చాలా గొప్ప విషయం. ఆవిడకే చెల్లింది.
ఈవిషాద సమయంలో శ్రీ కృష్ణమూర్తి గారికి, ఆ భగవంతుడు, శక్తినీయాలని ప్రార్ధిస్తున్నాను. శ్రీమతి రమణ గారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అయ్యో… పాపం…

    మనకు తెలిసిన వ్యక్తైనా, సంస్థ అయినా కనుమరుగైపోయినట్టు తెలిస్తే, అయ్యో ..పాపం .. అనుకోవడం జరుగుతూంటుంది కదూ. అంతదాకా ఎందుకూ, ఆరోజుల్లో మన ఇళ్ళల్లో ఉండే చెట్టో, చేమో, ఏ గాలివానైనా వచ్చి కూకటి వేళ్ళతో లేచిపోయినా అంతే బాధగా ఉండేది. పెంపుడు జంతువుల విషయంలోనూ అలాగే ఉంటుంది కదూ..ఈ ఆధునిక యుగంలో, అలాటి బంధాలూ, అనుబంధాలూ అంతగా కనిపించడం లేదు. మనుషులకే దిక్కులేదు, ఇంక సంస్థలూ, చెట్లూ చేమల మాటెవడికి పడుతుంది? ఇంక సంస్థలంటారా, రోజుకో సంస్థ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూన్న ఈ రోజుల్లో, మహ అయితే, రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలనే దురాశ తో ఆ ఫైనాన్సు కంపెనీలోనో, బ్యాంకులోనో డబ్బులు “పొదుపు” చేసికున్నవారు మాత్రం, ఆ “సంస్థలు” జెండా ఎత్తేసినప్పుడు మాత్రం అయ్యో..అయ్యయ్యో.. అని నెత్తీ నోరూ బాదుకుంటారు, కనీసం వాళ్ళు దాచుకున్న డబ్బులొచ్చేవరకూ

ఇంక చెట్టూ పుట్టా అంటారా, ఈరోజుల్లో పెరుగుతూన్న జనాభా దృష్ట్యా రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమంలో, ఈరోజుల్లో ప్రతీ చోటా అడ్డం వచ్చిన చెట్లన్నీ కొట్టిపారేస్తున్నారు. “అభివృధ్ధి” కావాలంటే ఆమాత్రం ” త్యాగాలు ” చేయాలిగా !! ప్రతీదానికీ సెంటిమెంటు పెట్టుకోలేముగా మరి! చెప్పేనుగా మనుషులకే ఠికాణా లేదు. ఏదో ఆ కట్టుకున్నవాడో, కట్టుకున్నదో తప్ప, మిగిలినవారికి అంతగా పట్టింపు ఉండడంలేదు. ఏదో ఆ పదిరోజులూ కార్యక్రమాలు చేసేసి చేతులు దులిపేసికోవడం. ఆ తరువాత గుర్తుండి, వీలుంటే మాసికాలూ, తద్దినాలూ పెట్టడం. లేకపోతే ఓ దండం పెట్టేయడం. చేసికున్నవాడికి చేసికున్నంతా. పైగా ఇంకో విషయం, ప్రతీదానినీ సమర్ధించుకోవడం– ” ఈరోజుల్లో అంత టైమెక్కడిదండీ..” అని. మరి ఆరోజుల్లో టైముండే చేసేవారా, ఉన్న అనుబంధాన్ని బట్టి ప్రతీదానికీ టైము కేటాయించేవారు. కనీసం సంవత్సరంలో ఒకసారైనా గుర్తుచేసికుని, ఆ వ్యక్తి గురించి నాలుగు మంచిమాటలు చెప్పుకునేవారు. కానీ ఈరోజుల్లో , ఓ ప్రముఖ వ్యక్తై పోయాడంటే, ఆ ఒక్కరోజుకీ మాత్రం, మీడియా ధర్మమా అని, ఆ కుటుంబ సభ్యులకే కాదు, దేశం/ రాష్ట్రం లో , ఎవడు టివీ పెట్టినా అతన్ని హాస్పిటల్ నుండి, అంత్యక్రియలదాకా జరిగే కార్యక్రమాలని చూడాల్సిందే. ఆ వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టి “అయ్యో..పాపం ” అనుకుంటాము.
పైన ఉదహరించినవన్నీ, ఎవరి అనుబంధాన్ని బట్టి వారు అనుభవిస్తూంటారు. ఒకరికి నచ్చింది ఇంకోరికి నచ్చాలని లేదు. ఓ వ్యక్తున్నాడనుకోండి, అందరికీ ఉపకారాలు చేసుండకపోవచ్చు, ” పోన్లెద్దూ ఓ గొడవొదిలిందీ.. ” అనుకోవచ్చు. ఓ చెట్టు కొట్టేసినా, పోనిద్దూ ప్రతీరోజూ ఆకులెత్తుకోలేక చచ్చేవాళ్ళం అని అనుకునేవారున్నా ఆశ్చర్యం లేదు. అలాగే ఓ పెంపుడుజంతువు గురించి కూడా, ఆ పెంచుకున్నవాడికుండొచ్చేమో కానీ, చుట్టుపక్కలున్నవాళ్ళు ” అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ, ఎప్పుడు చూసినా భొయ్యిమంటూ అరవడమే, ఎప్పుడు మీదపడుతుందో తెలిసేది కాదు..” అన్నవారే ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు.

కానీ కొన్ని సంవత్సరాలపాటు, అందరి జీవితాలతో ఓ “బంధం” పెనవేసికుని, ఎందరో ఎందరెందరో మొహాలలో, ఓ సంతోషం చేకూర్చిన ఓ సంస్థ, ఒక వ్యవస్థ కనుమరుగైపోతూందని చదివినప్పుడు మాత్రం, ” అయ్యో.. అలాగా..” అని అనుకోని వారుండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇరవయ్యో శతాబ్దంలో పై ఊళ్ళకి చదువులకోసం, వెళ్ళినవారనండి, ఎక్కడో దూరప్రదేశాల్లో ఉద్యోగరీత్యా ఉంటూ, స్వగ్రామంలో ఉండే తల్లితండ్రులనండి, లేదా ఆరోజుల్లో తమ రచనలు ఏ పత్రిక్కో పంపినవారనండి, చిన్నచిన్న గ్రామాల్లో గ్రంధాలయాలకి నాగా లేకుండా, పత్రికలు తెప్పించుకునేవారనండి… ఇలా చెప్పుకుంటూ పోతే లక్షలాది మనుషులకి, తోడునీడగా ఉండే ఆ ” మనీ ఆర్డరు ” వ్యవస్థ కనుమరుగపోతూందని ఈవేళ పేపర్లో చదివేసరికి, నిజంగా గుండె చెరువైపోయిందంటే నమ్మండి.MO

MO Form

అలాగని నాకు ఈ మనీఆర్డర్లతో పెద్దగా అనుబంధం లేదు.ఊళ్ళోనే స్కూలుఫైనలు దాకా స్కూలూ, ఇంటి దగ్గరలోనే డిగ్రీ సంపాదించుకోడానికి ఓ కాలేజీ, ఆ డిగ్రీ ఏదో సంపాదించగానే, అదృష్టం కొద్దీ పూనా లో ఉద్యోగమూ. మొదటిజీతం వచ్చేలోగా, కావాల్సిన డబ్బులేవో, ట్రైనెక్కేముందే చేతిలో పెట్టేశారు.ఇంక మళ్ళీ మనీఆర్డర్లంటే, కాళ్ళిరక్కొట్టేవారేమో. దేనికైనా పెట్టిపుట్టాలంటారందుకేనేమో..అబ్బ మా పెద్దన్నయ్యగారిలా మెడ్రాసులోనో, చిన్నన్నయ్యగారిలా ఏ కాకినాడలోనో, వాల్తేరులోనో , హాస్టల్లో ఉండి చదువుకుంటే ఎంత హాయిగా ఉండేదో, నాక్కూడా ఈ మనీఆర్డర్లు వచ్చేవేమో అని ఊహించేసికుని సంతోషపడడంతోనే సరిపోయింది. పొట్టకోస్తే అక్షరమ్ముక్కొస్తేనేకదా, పైచదువులకి పైఊళ్ళకి పంపడం? అదేమో లేదాయె, మరి ఈ మనీఅర్డర్లూ అవీ ఎక్కణ్ణుంచొస్తాయీ? పోనిద్దురూ, ఆ మనిఆర్డరేదో, టైముకి రాకపోతే పడే ” కష్టాలు” భరించాల్సిన అవసరం లేకపోయింది. అలా సరిపెట్టేసికుంటే హాయి కదా. టైముకి ఇంటిదగ్గరనుండి, మనీఆర్డరు రాకపోతే, పడే కష్టాలలో పాలుమాత్రం పంచుకున్నానండోయ్.. ఆరోజుల్లో మా స్నేహితుడొకరు ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుకునేవారు. మరి ఆరోజుల్లో అప్పటికే ” భవదీయుడు” ఉద్యోగస్థుడుగా, ( కాలరెత్తికుని తిరిగే వ్యవహారం మరి ! ), అప్పుడప్పుడు, తనకి మనీఆర్డరు రాకపోతే, ఓ పదో, పాతికో చేబదులడిగేవారు ! తరువాత్తరువాత నేనే చేబదుళ్ళడిగే పరిస్థితికి చేరిపోయాననుకోండి, అది వేరే సంగతి. మనీఆర్డర్లతో నా అనుబంధంగురించి ప్రస్తావించడానికి చెప్పేను.

పైఊళ్ళకి పైచదువులకి పంపేటప్పుడు, ఆ ఊళ్ళో తెలిసినవారికి పరిచయం చేసేవారు తప్పకుండా. కారణం మరేమీ కాదూ, ఏ కారణం చేతైనా టైముకి మనీఆర్డరు అందకపోతే, ఆ పరిచయం ఉన్నాయన దగ్గరకి వెళ్ళి, పని కానిచ్చుకోవచ్చని. అసలు ఆ మనీఆర్డర్ల ప్రక్రియే తమాషాగా ఉండేది. మా కాలేజీలో బుల్లబ్బాయిగారని ఓ పోస్టుమాస్టారుండేవారు. శలవల్లో ఆ పోస్టాఫీసుకి వెళ్ళి ఆయనతో కబుర్లు చెప్పేవాడిని. అప్పుడు చూసేవాడిని. కిటికీలోంచి, డబ్బూ, నింపిన మనీ ఆర్డరు ఫారమ్మూ ఇవ్వగానే, ఆ ఫారం వెనక్కాల ఎర్ర సిరాతో పెద్దగా ఓ నెంబరువేయడం, రెండు కార్బన్ పేపర్లు, అందులో ఒకటి తిరగేసి, రసీదుపుస్తకంలో ఎడ్రసు వ్రాసేసి, ఆ రసీదునెంబరు మళ్ళీ ఆ ఫారంమీద వ్రాయడమూ, అందులో రాసింది కానిపించని ఓ కాపీ మీద ఓ పెద్ద స్టాంపు కొట్టి, చేతిలో పెట్టడమూ. క్షేమసమాచారాలో, విశేషాలో వ్రాసుకోడానికి, ఓ జాగా ఉండేది. కావాల్సినన్ని విశేషాలు వ్రాసేసేవారు, ఆ కాగితం వెనక్కాలా, ముందు భాగాల్లోనూ. ఎప్పుడైనా మనీఆర్డరు వచ్చిందంటే, పోస్టుమాన్ ఓ సంతకం పెట్టించుకుని, ఆ ” సందేశ” కాగితం చింపి మనకిచ్చేవాడు. సంతకం పెట్టించుకున్న భాగం , ఎవరైతే పంపారో వారికి తిరిగిపంపేవారు. అంతకుముందు డబ్బుపంపిన రసీదూ, సంతకం పెట్టిన ఎం.ఓ. రసీదూ ఉంటే చాలు , ఆ రెండిటినీ ఓ తీగకు గుచ్చేయడంతో పని పూర్తైపోయినట్టే. ఈ మనీఆర్డర్ల బట్వాడా ద్వారా, బోర్డర్లలో ఉండే జవాన్లు, వారివారి కుటుంబాలకి డబ్బులు పంపేవారు.

e-transfers వచ్చిన ఈ యుగంలో మరింక ఈ మనిఆర్డర్లతో పనుండదు, నిజమే. కానీ లక్షలాదిమంది ముఖాలలో నెలకోసారైనా, ఓ “మెరుపు” మెరిపించిన ఆ మనీఆర్డర్ల ప్రక్రియ, ఇంక చూడలేమంటే, మరి బాధగానే ఉంది…

This is my humble tribute to the Good Old MONEY ORDER… R.I.P