బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఫుకట్ సర్వీసులు

    ‘భ్రమ’ ల గురించి వ్రాద్దామనుకున్నాను. అవెక్కడికి వెళ్తాయిలెండి, మనతోపాటే ఉంటాయి. వాటిగురించి ఇంకో రోజు వ్రాయొచ్చులే అని, ఇంకో విషయం గుర్తుకొచ్చింది. దానిగురించీ టపా.మనం కానీ, మన పక్కింటివాళ్ళో,అదేబిల్డింగులో ఉండే ఇంకోరో, లేక అదే సొసైటీలో ఉండే మరోరో,ఫుకట్ గా ఏదైనా వస్తోందన్నా, లేక పనైపోతుందన్నా, ఛాన్సొదలరు!అది ఎవరినో విమర్శిస్తున్నానని కాదు, నేనైనా ఇదే పని చేస్తాను,మానవ సహజం అది.

7nbsp;  మా చిన్నప్పుడు టార్చి లైట్లనుండేవి. అంటే ఇప్పుడు లేవనికాదు,ఇప్పుడు అవేవో చాలా sleek గా ఉండేవి వస్తున్నాయి.సెల్లులో లైటు,తాళం కప్పలో లైటు, లేకపోతే ఇంకో లేసరు లైటో చాలా వచ్చాయి. కానీ, మా రోజుల్లో Eveready వాళ్ళవి, స్టీలుతో ( అలా అనేవారు!) చేసిన టార్చ్ లైట్లొచ్చేవి, బుల్లిదీ, కొద్దిగా పెద్దదీ,మూడు బ్యాటరీలు వేసికునే పేద్దదీ. ఇందులో బుల్లిది మామూలుగా డాక్టర్లదగ్గర ఉండేది.మనకేమైనా వచ్చి డాక్టరుగారిదగ్గరకు వెళ్తే, ఆయన ముందుగా మన నోరు తెరిచి నాలుక బయటకు పెట్టమంటారు, మళ్ళీ అలా కాదూ, ఇంకా సౌండొచ్చేలా నాలిక బా…..గా చాపమంటారు, అప్పుడు ఆ బుల్లిలైటు దాంట్లోకి(అంటే తెరిచున్ననోట్లొకి) వేసి, ఓసారి నిట్టూర్పు విడిచి, బాగా inflame అయిపోయిందీ అంటూ ఏదో మందు రాసిచ్చేసేవారు. అలాగే పళ్ళడాక్టరుగారుకూడా పళ్ళ గ్రహస్థితులు తెలిసికోడానికి ఉపయోగించేవారు. వాటిలో టార్చ్ లైటు సైజులాగే మీడియం సైజు బ్యాటరీలు వేసేవారు.

ఇంక కొద్దిగా పెద్దసైజువి, వాటిని ఇంచుమించు ప్రతీ ఇంట్లోనూ వాడేవారు. అదిలేకపోవడం ఓ నామోషీగా ఉండేది.చీకట్లో బయటకి వెళ్ళాలన్నా, లైట్లుపోతే ఫ్యూజు వేయాలన్నా, ఏ పురుగో పుట్రో ఇంట్లోకి వస్తే, దాన్ని పట్టుకోవాలన్నా దీని ఉపయోగం అమోఘం.ఆ రోజుల్లో సైకిళ్ళకి లైటుండకపోతే, పోలీసులు పట్టుకునేవారు. అందరికీ సైకిళ్ళకి డైనమో పెట్టుకునే స్థోమతుండేది కాదు కదా, అలాటి వారు, సైకిలు మీదెళ్తుంటే, ఏ పోలీసైనా ఎదురుపడితే, ఈ టార్చ్ వేసి పనికానిచ్చుకునేవాడు!

7nbsp;  ఇంక మరీ పెద్ద టార్చ్ లైటు-దీంట్లో మూడో నాలుగో బ్యాటరీలు వేసేవారు. దాని ఫోకస్ కూడా చాలా దూరం వచ్చేది.వాటిని జనరల్ గా, రాత్రిళ్ళు కాపలా కాసే, నైట్ వాచ్ మన్లదగ్గరుండేవి. ఆరోజుల్లో నైటువాచ్ మన్లెక్కడుండేవారూ అనడగకండి,బ్యాంకుల్లోనూ వాటిలోనూ ఉండేవారు.పొలాల్లోకి వెళ్ళడానిక్కూడా వీటి ఉపయోగం ఉండేది.ఇదేమిటీ ఈయన, ఆయన రాసిన టపాలు చదువుతున్నాము కదా అని, టార్చ్ లైట్ల ‘ప్రవర’ చెప్తున్నాడూ అనుకుంటున్నారు కదూ!
ఇంక అసలు కథలొకి వచ్చేద్దాం.

ప్రతీ ఇంట్లోనూ ఓ టార్చ్ ఉంటుందన్నాను కదా, ఆ టార్చ్ లైటుని ప్రతీరోజూ ఉపయోగించంకదా, ఎప్పుడో ఏడాదికో, ఆర్నెల్లకో వాడుతాం.పనైపోగానే దాన్ని ఏగూట్లోనో పెట్టేసి వదిలేస్తాం.ఏ వస్తువైనా, ఆఖరికి, మనుష్యులైనా సరే, వాటికీ
periodical maintenance అనేది ఒకటుండాలి. లేకపోతే పడకెక్కుతాయి. అలా పడకెక్కిన టార్చ్ లైటు,మన కళ్ళల్లో పడుతుంది.పడకెక్కిందనెందుకు తెలిసిందంటే, ఆ ముందురాత్రి, పక్కవాళ్ళింట్లో అవసరమై, టార్చ్ లైటు గురించి అడగ్గానే, పేద్ద పోజు పెట్టి, వాళ్ళపిల్లాడికి మన గూట్లో ఉన్న లైటిస్తాము.వాడు నిమిషంలో తిరిగొచ్చేసి, అంకుల్, ఈ బాట్రీ లైటు ( టార్చ్ లైటుకి ముద్దుపేరు) వెలగడంలేదూ, అని మన మొహాన్న కొట్టి పారిపోతాడు.అదేమిటీ, ఆమధ్యనే
బ్యాట్రీలు కూడా మార్పించాను, అని ఓసారి ఇంట్లో వాళ్ళందరిమీదా ఎగురుతాడు,ఎవరడిగితే వాళ్ళకి ఎరువిచ్చేస్తూంటారూ, ఏ వెధవ, దీంట్లో బ్యాట్రీలు మార్చేశాడో అంటూ.నిజం చెప్పాలంటే, దాంట్లో బ్యాటరీలు మార్చి, ఆరునెలలైనా అయిఉంటుంది.సరే, రేపు దీని సంగతి చూద్దాం అనుకుని, అప్పటికి వదిలెస్తాడు.

మర్నాడు ప్రొద్దుటే గెడ్డం వగైరా గీసికుని, ఓ కాఫీ తాగేసి, ఈ టార్చ్ లైటు వ్యవహారం ఏదో తేలుద్దామని, ఓ పాత గుడ్డా, ఓ మూతలో కిరసనాయిలూ వేసికుని సెటిల్ అవుతాడు. ముందుగా ఆ టార్చ్ లైటు వెనక్కాలుండే మూత, అప్పటికే బిగుసుకుపోయుంటుంది, తీసి నీరు కారిపోతున్న బ్యాటరీలు( ఆ లిక్విడ్ ఇల్లూ వళ్ళూ చేసికుంటూ)అవతల పారేస్తాడు.పైగా ఆ ముందురోజు రాత్రేమన్నాడూ-ఈ మధ్యనే కొత్త బ్యాటరీలు వేయించానని (ఉత్తిదే)– అంత కొత్తబ్యాటరీలైతే నీళ్ళెందుకు కారుతాయమ్మా? మొత్తానికి, ఆ బ్యాటరీలు తీసి,కిరసనాయిల్లో ముంచిన గుడ్డతో ఓ సారి, లోపలంతా శుభ్రంగా తుడుస్తాడు.ఆ బల్బుండేచోటోటి, దాని బుడిపికింద నీలంగా ఓ కోటింగోటొస్తుంది.దాన్ని కూడా తుడిచి, కొత్త బ్యాటరీలు వేయగానే, కొత్త పెళ్ళికొడుకులాగ వెలుగుతుంది.

ఇంట్లో వాళ్ళందరూ, అబ్బ మా నాన్న ఎంతబాగా రిపెరు చేశాడో అని పిల్లలూ, మా ఆయనెంత ఇంజనీరులా,బాట్రీని మళ్ళీ వెలిగించారో అని ఇంటావిడా ఆనందపడిపోయి, కాలనీలోఉన్న ప్రతీ వాళ్ళకీ చెప్పేయడం, ఈయన ఏ బజారుకో వెళ్తూంటే, అందరి కళ్ళూ తనమిదే ఉన్నాయని మురిసిపోడం.ఇంతాచేసి ఆయన చేసిందేమిటయ్యా అంటే ఓ బాట్రీ లైటుకి మళ్ళీ వెలుగివ్వడం. ఇంతటితో ఆగదీ వ్యవహారం, బాట్రిలు బాగుచేసేవాడొకడు దొరికాడుగా, కాలనీలో ఉన్న ప్రతీవాడూ,వాళ్ళింట్లో పనిచేయని బాట్రిలు, పనిగట్టుకుని మరీ వెదికి, వీళ్ళింట్లో వాటికి తన పేరున్న కాగితం అంటించి, వాళ్ళబ్బాయిచేత పంపించి, ‘అంకుల్ మా టార్చ్ వెలగడం లేదు,డాడీ మిమ్మల్నోసారి చూడమన్నారు’ అంటూ కాలనీ లో ఉన్న, ఓ పది టార్చ్ లైట్లు మనకొంపలోకి చేరతాయి.దీంతో ఆగదు,ఎప్పుడో బజార్లో స్నేహితుడితో వెళ్తున్నప్పుడు, పనిమాలా ఆపి, ‘మాస్టారూ మా బాట్రీ రిపేరయిందా, అయితే మావాడిని పంపిస్తాను సాయంత్రం’ అంటూ ఓ పలకరింపూ. తనతో ఉన్న స్నేహితుడు, ఆశ్చర్యపడి ‘ ఇదేమిట్రా, ఈ మధ్యన సైడు బిజినెస్సు మొదలెట్టావా ఏమిటీ, నాతో చెప్పనేలేదూ’అంటూ పరామర్శా.

ఏ కొట్లోకో వెళ్ళి టార్చ్ లైట్లు రిపేర్ చేసికోవచ్చు. మళ్ళీ దీనికి డబ్బులు తగలేయడం దేనికనీ, అప్పనంగా అవుతోందని పక్క వాళ్ళమీద బతికేద్దామనే ఆబ ఉందే, చాలా మందిలో చూస్తూంటాము.అలాగే మిక్సీలూ, రేడియోలూ ఇంకా ఏమైనా సరే మీకు రిపెరీ చేసికోడం వచ్చిందా, సైలెంటుగా మీపనేదో మీరు చూసుకోండి. అంతేకానీ గొప్పకోసం ఊళ్ళో అందరికీ టముకెసికున్నారా అంతే సంగతులు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    రెండు మూడు రోజులనుండి, పేపర్లలోనూ, టి.వీ ల్లోనూ హోరెత్తించేస్తున్నారు- బాబ్లీ డ్యాం కి మన నాయుడుగారూ, ఇంకో డెభ్భై మంది ఎం.ఎల్.ఏ లూ, మీడియావాళ్ళనీ కలుపుకుని అక్కడకు వెళ్ళారనీ, అక్కడ వీళ్ళని మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారనిన్నూ, దగ్గరలో జైలూ అదీలేక, ఐ.టి.ఐ క్యాంపస్సులో బంధించారనిన్నూ, వారికి బ్రేక్ ఫాస్టులూ, మధ్యాన్న భోజనాలూ సరీగ్గా పెట్టడం లేదనిన్నూ.

   అసలు నాకోటనిపిస్తోంది, రోశయ్యగారే అశోక్ చవాన్ కి ఫోను చేసి,‘మావాళ్ళందరినీ జైల్లో పడేయ్, ఇక్కడ రోజూ అసెంబ్లీలో నా ప్రాణం తీస్తున్నారూ, ఓ వారంరోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చూ’అని చెప్పారేమో ! ఒకవిషయం చెప్పండి, వీళ్ళేమైనా పిక్నిక్కు కి వెళ్ళారా లేక హనీమూన్ కి వెళ్ళారా, సకల మర్యాదలూ చేయడానికి! గొడవంతా ఎక్కడొచ్చిందంటే, తెలంగాణా విషయంలో, నాయుడు గారు, అటు ఆంధ్రావాళ్ళకీ, ఇటు తెలంగాణా వారికీ సద్ది చెప్పలేక,ఎవరు పట్టించుకుంటారులే అని ఏవేవో స్టేట్ మెంటులు చేసేశారు. రాబోయే ఉప ఎన్నికల సందర్భంలో, తెలంగాణా వారికి ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి, ఇక్కడకొస్తే కాళ్ళిరక్కొడతామన్నారు. ఇంక issue లేకపోయింది,ఎన్నికలకి.
దాంతో ఉభయతారకంగా ఉంటుందని ఈ బాబ్లీ వ్యవహారంలో popular అవుదామని ఇలా మందీ మార్బలంతో వెళ్ళారు.To be on safe side, మనల్ని టి.వీ ల్లో బోరుకొట్టడానికి, ఓ ముగ్గురు నలుగురు నిలయవిద్వాంసుల్ని, ఇక్కడే వదిలేసి!

   మన టి.వీ. వాళ్ళకి ఏదో ఒక కాలక్షేపం కావాలిగా.ఈ లోపులో, టి.ఆర్.ఎస్ రావుగారు, ఇదేమిటీ బాబ్లీ గోడ పెంచేస్తే మనకి కదా నీళ్ళు రానిది,ఈ నాయుడేమిటీ,తనెళ్ళిపోయాడూ, అనుకుని ‘ఇదంతా ఎన్నికల స్టంటూ’ అని ఓ స్టేట్మెంటిచ్చేశారు!నారాయణ గారికీ, రాఘవుల గారికీ ఊళ్ళో ఎక్కడ గొడవైనా, ఓ స్టేట్మెంటిచ్చేస్తే పోదా అనుకుని left,right,centre బాదేస్తున్నారు.ఈ మధ్యలో మన హోం శాఖామంత్రిణి గారు,’ఎవరింటికో వెళ్ళి, అక్కడ గొడవచేస్తే
వాళ్ళు అరెస్ట్ చేయరా అంటూ ‘ నా పుట్టలో వేలెడితే కుట్టనా’అని చీమన్నట్లు,
ఓ స్టేట్మెంటిచ్చారు. పాపం నాయకులందరూ అక్కడేక్కడికో వెళ్ళి కష్టపడిపోతున్నారూ అనుకుని, మన మిగిలిన ఛోటా, మోటా నాయకులంతా ఓ ‘బంద్’ ఏర్పాటుచేసి, బస్సులన్నీ ఆపేసి గొడవ చేస్తున్నారు.Let the common man go to hell అనేట్లుగా!ఒక్కరోజు ఈ బందులూ, హర్తాళ్ళూ చేయడం వలన, ఆ బాబ్లీ గోడ తగ్గుతుందా, అదేమీ ఒక్కరోజులో చేసిందికాదే, అందరు రాజకీయనాయకులకీ తెలుసు ఆవిషయం.ఎవడికి కావలసినట్టుగా వాడు, దాన్ని exploit చేసుకుంటున్నారు.

    ఇంకో విషయం- గోదావరీ, కృష్ణా కూడా మహరాష్ట్రలోనే పుట్టాయికదా, ఏదో అక్కడ ఖాళీ లేక ఆంధ్రదేశంలోకి పొంగిపొర్లి, సముద్రంలో కలుస్తున్నాయి.మరాఠీ వాళ్ళు వాళ్ళింట్లో ఏదో చేసుకుంటున్నారు,అది పక్కవాడికి బాగోలెదూ అని, ఏదో అన్ని పార్టీలూ కూర్చుని మాట్లాడుకుని, వ్యవహారం సెటిల్ చేసికోవడం పోయి ఈ బందులూ అవీ చేసి, మామూలు జనాల్ని ఇరుకులో ఎందుకు పెడతారో తెలియదు.ఇన్నాళ్ళూ మనవాళ్ళకీ, మరాఠీలకీ ఏ గొడవలూ లేకుండా, హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు నాయుడు గారి ధర్మమా అని, ఏం గొడవలొస్తాయో?

    ఈ రాజకీయనాయకులందరూ దొందుకు దొందే,వీళ్ళూవాళ్ళూ బాగానే ఉంటారు, మధ్యలో నలిగిపోయేది మనలాటివాళ్ళే.రోశయ్యగారేమో ఢిల్లీ లో ఆయనగొడవేదో ఆయన పడుతున్నారు. చిరంజీవి గారు తిరుపతి వెంకన్న గురించి, పాదయాత్రచేస్తే పుణ్యం పురుషార్ధం అనుకున్నారు. ఇంక మన టి.వీ.వాళ్ళు అదేదో రెండు దేశాలమధ్య యుధ్ధం అవుతున్నట్లుగా,ఫలానా సరిహద్దు ప్రాంతం అంటూ ఊదరకొట్టేస్తున్నారు…మనదృష్టం ఎలాఉందో, ఈ బస్సుల్నీ,రైళ్ళనీ నమ్ముకుని, రిజర్వేషన్లు చేయించుకోడానికి లేదు, ఏ క్షణాన్న ఏ రాజకీయపార్టీకి ఏలాటి ఆలోచన్లొస్తాయో ఆ దేముడిక్కూడా తెలియదు.