ఈరోజుల్లో పుస్తకాల ఖరీదు ఆకాశాన్నంటుతూన్నా, ఇంకా కొంతమంది పుస్తక ప్రేమికులు ఉండబట్టే గా, “ పుస్తక ప్రదర్శనలు” ఇప్పటికీ నిరాటంకంగా జరుపుతున్నారూ… పాపం తమకు ఇష్టమైన పుస్తకాలు ఖరీదు ఎంతైనా కొనుక్కోవడమూ, వాటి గురించి ఫొటోలు తీసుకుని, ఫేస్ బుక్ లో పెట్టుకోవడమూ కొంతమందికి చాలా ఇష్టం..మూడేళ్ళ క్రితం కోవిడ్ టీకాలు వచ్చినప్పుడు కూడా ఇదే రంధి..ఎక్కడచూసినా అవే ఫొటోలు… ఎవరి సరదా వారిదీ.. వారిని విమర్శించడానికి కాదు ఈ పోస్ట్ .
పుస్తకాలు కొనకపోవడానికి, ఎవరి కారణాలు వారికి ఉంటాయి..
ఈరోజుల్లో పుస్తక ప్రచురణకి చాలా ఖర్చుపెట్టడం మూలాన, పుస్తకాల ఖరీదు లకి రెక్కలొచ్చేసాయి. అయినా చదివేవాళ్ళు కొంటూనే ఉంటారు.
కొంతమందికి, అరే నూటయాభై పేజీల పుస్తకం మరీ రెండేసివందలు పెట్టి కొనడం , అవసరమా అనుకునే ఆస్కారం ఉంది.
కొంతమంది అంతంత ఖరీదులు పెట్టి కొనలేక, ఊళ్ళో ఉండే ఏ గ్రంధాలయానికో వెళ్ళి చదివేవారూ ఉన్నారు.
ఈరోజుల్లో ఇంగ్లీషైనా, తెలుగైనా , టెక్నాలజీ ధర్మమా అని అన్నీ PDF రూపంలో, అంతర్జాలం లో ఉచితంగా దొరుకుతున్నాయి. ఆమధ్య వరకూ, అదేదో సైట్ లో లక్షపైగా, కొత్త ( latest editions) కూడా దొరికేవి, ఈ మధ్యనే మూసేసారు.. అలనాటి పుస్తకాలు చాలా మట్టుకు Telegram లోనూ Internet Archives లోనూ దొరకనే దొరుకుతున్నాయి. “అసలు సిసలు పుస్తకం, పేజీలు తిప్పుకుంటూ, ఓ పడక్కుర్చీలో కూర్చుని, ఆరారగా భార్య పక్కనే పెట్టిన కాఫీయో, చాయో మధ్యమధ్యలో తాగుతూ, చదువుకోవడంలో ఉండే ‘మజా’, ఇప్పుడొస్తున్న Kindle లో చదువుకుంటే ఎక్కడొస్తుంది మాస్టారూ…” అనేవారూ ఉన్నారు. ఎవరిష్టం వారిది.కొత్త పుస్తకం నుంచి వచ్చే సువాసన “ ఆఘ్రాణించడానికి” పెట్టిపుట్టాలి మాస్టారూ, అనేవారూ ఉన్నారు.
కొంతమందైతే ప్రపంచం లో ఎక్కడున్నా, వెతికి పట్టుకుని , ఖరీదెంతైనా కొని, తమ పుస్తకాల బీరువాలో అందరికీ తెలిసేలా, ఫొటోలు కూడా తీసి, Social Media లో పెడితేనే కానీ, నిద్రపట్టదు.
ఈ వ్యాసం ప్రస్తుతం ‘ తెలుగు పుస్తకాల గురించి మాత్రమే.ప్రస్తుత వాతావరణం లో, కనీసం భారతదేశంలో, ( విదేశాల్లో తెలుగు ఇంకా బతికే ఉన్నట్టు దాఖలాలు చాలానే ఉన్నాయి), ఈ ఆధునిక యుగం లో ఎంతమంది ఇళ్ళల్లో, ఇప్పుడున్నవారు కాకుండా, తరవాతి తరం వారిలో తెలుగు చదవగలిగినవారు , ఎంతమందున్నారో, గుండెల మీద చెయ్యేసుకుని, ఎంతమంది “ పుస్తకప్రియులు” చెప్పగలరూ?.. పాపం తెలుగు మాట్టాడ్డమైతే వచ్చు భగవంతుడి దయవలన, కానీ రాయడం, చదవడం నేర్చుకునే అవకాశం బహు తక్కువ. ముఖ్య కారణం విద్యావిధానం, obcession with marks..ఎక్కడ చూసినా Corporate Schools, Convents మధ్యలో, తెలుగులో నవ్వితేనే మహాపాపం ట. KG నుండీ ఇంగ్లీషులోనే ఏడవడం నేర్పుతారుట Oh mummy.. అంటూ. ఈమధ్య వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు లో పాఠాలు నేర్పేవారు. ఈమధ్య తెలుగు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయని చదివాము.. “ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలోనే బోధన..” అని. కనీసం స్కూల్లోనైనా నేర్చుకుంటారనే ఆశ కాస్తా అడుగంటిపోయింది. కొంతమంది తల్లితండ్రులకి ఎంతగానో ఉంటుంది.. తమ పిల్లలకి మాతృభాష నేర్పాలని… కానీ టైమెక్కడిదీ? రోజంతా హోంవర్కూ, ప్రాజెక్టులూ, శలవల్లో కూడా అవేవో మాయదారి assignments ట.. ఇంత హడావిడిలో, ఆ పసిప్రాణాల్ని “ తెలుగు” తో హింసించడం ఎందుకూ ..అనుకుని, ఆ “ తెలుగు యజ్ఞం” కి మంగళం పాడేస్తారు. “కథ కంచికీ మనం ఇంటికీ”.
ఏదో ఇల్లులాటివి ఉన్నవాళ్ళెవరో , పుస్తకాల కోసం , “ బీరువాలేం కర్మ, విడిగా గదులు కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ ఈరోజుల్లోని “ ఎపార్ట్మెంట్’ లలో పుస్తకాలకి ప్రత్యేకంగా ఓ రూమ్ము కేటాయించడం, ఏదో పిల్లలతో కాకుండా, విడిగా ఉంటే సాధ్యమేమో కానీ, సెంటిమెంటుకో, అవసరార్ధమో పిల్లలతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా కష్టమేమో అని నా అభిప్రాయం.కొత్త దంపతులకి పిల్లలు పుట్టేదాకా, ఈ దబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లు బాగానే ఉంటాయి..ఓ పిల్లో పిల్లాడో పుట్టాక, అమ్మమ్మ/నానమ్మ తో మనవరాలో మనవడో… తాతయ్యగారికి ఏ బాల్కనీలోనో, హాల్లోనో మడత మంచమూనూ.ఇంత హడావిడిలో పుస్తకాలకి ప్రత్యేక హోదా కావాలంటే కుదిరే పనేనా? ఇవన్నీ ముందరే ఊహించి, కొంతమంది విజ్ఞులు పుస్తకాలు కొనడం మానుకున్నారు.
ఇన్ని అవరోధాలు దాటుకుంటూ పుస్తకాలు కొని ఎవరిని ఉధ్దరించడానికీ అనుకునేవారు కొందరూ.. పుస్తకాలు అమ్మడానికి ఇచ్చిన కొట్టువాడు, పాపం కొద్దికాలం, తన కమిషన్ తగ్గించుకుని, తృణమో పణమో ఇస్తాడు.. చివరకి తన inventory పెరిగిపోతోందని, అమ్ముడు కాని పుస్తకాలు , రచయితకి తిరిగి ఇచ్చేస్తాడు..చివరకి ఆ రచయిత, ఈమధ్యన సోషల్ మీడియాలో జరిగే పదబంధాలకి, ప్రహేళికలకీ.. బహుమతి గా ప్రదానం చేయడమో, లేక ఇంటికి ఎవరైనా వచ్చినా, తను ఎవరింటికైనా వెళ్ళినా వారి చేతిలో పెట్టడం .
పాతిక ముఫైసంవత్సరాలక్రితం పుస్తక ప్రచురణ కిట్టుబాటయేది.. కొంతమంది ప్రసిధ్ధ రచయితలు “కోటేశ్వరులు” అయారనడం లో సందేహం లేదు. ఒక్కోపుస్తకం నాలుగైదు ప్రచురణలకి కూడా వెళ్ళేది.వాటికి కూడా కారణాలనేకం.. కొంతమంది రచయితలు తమకున్న “ పలుకుబడి” తో , రాష్ట్రం లో ఉండే ప్రతీ ప్రభుత్వ గ్రంధాలయం లోనూ, వారిచేత “కొనిపించి” పెట్టగలిగేవారు. అవేకాకుండా, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ కూడా..ఇవేకాకుండా, పుస్తకం “ content “ ని బట్టి , కిళ్ళీకొట్ల ద్వారా, పుస్తకాలు “అద్దెకు’ కూడా దొరికేవి, చవకలో పనైపోయేది. ఇన్నేసి అవకాశాలున్నప్పుడు, పేరొందిన రచయితలు “ కోటీశ్వరులు” అవడం లో ఆశ్చర్యం ఏముందీ? అసలు వారు రాసే నవలలో, కథలో చదువరులకు నచ్చడం ముఖ్య కారణం.. పుస్తక ప్రపంచం లో ఓసారి పేరొచ్చాక, సాధారణంగా జీవితాంతం ఆ ప్రఖ్యాతి ఉంటూనే ఉంటుంది కూడా.. కొన్ని పత్రికలైతే, రచయిత పేరు చూసి, బహుమతులు కూడా ఇవ్వడం చూసాము..అందులో content ఎలా ఉన్నాసరే..
కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటీ?పుస్తక ప్రచురణకి ఒకానొకప్పుడున్న ప్రముఖ సంస్థలు మూతబడిపోయాయి.. కారణం “కిట్టుబాటు” కాకపోవడం మూలాన. పుస్తకం “అచ్చు” వేయడానికి , ఏదో ఓ Estimate ఇస్తారు,వాళ్ళు చెప్పే ఖరీదుకి, మహా అయితే, ఎక్కీ తొక్కీ ఓ 500-600 పుస్తకాలకి ఆర్డరిస్తారు. ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే అమ్ముడవవుగా,ఏదో పుస్తకాల షాప్ వాడిని పట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళకి కమిషనూ..పుస్తకానికి ఇంత .. అని.. పోనీ ఆ షాపు వాడైనా నిజాయితీగా , మన పుస్తకాన్ని అమ్ముతాడా అంటే .. తనేమైనా మన మేనత్తకొడుకా ఏమిటీ… మనలాగ “కమిషన్” ( పుస్తకం అమ్మడానికి) ఇచ్చే రచయితలు ఎంతో మందుంటారు..ప్రస్తుత Commercial atmosphere లో, ఎవడెక్కువిస్తే , వాడి పుస్తకమే Prominent గా కనిపిస్తుంది పుస్తకాల దుకాణం లో..అదీ నలుగౌరైదుగురు రచయితల genre కూడా ఒకటే అయితే..అంతే సంగతులు.. ఎవరి పుస్తకం Best Seller గా ఉంటుందో అడగక్కర్లేదు. రాసిన పుస్తకాలకి వార్తాపత్రికల్లో రివ్యూలు రాయడానికి, ప్రతీ పేపర్ వాడికీ , ఉచితంగా తన పుస్తకం పంపిణీ చేయాలి. ఇవన్నీ ఓ ఎత్తూ, ఈ పుస్తకాల “ ఆవిష్కరణ” మరో ఎత్తూ.. ఎవరినో పట్టుకుని, ఓ సభ ఏర్పాటు చేయాలి, ఓ ముఖ్య అతిథి, వక్తలు ఏర్పాటు చేయాలి..ఇదివరకటి రోజుల్లో, ఆ “ మహాసభ” కి వచ్చిన ప్రేక్షకులకి , ఆవిష్కరణ చేసిన పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలో, ఆ కార్యక్రమానికి స్వస్థి చెప్పి, వేదికమీద ఉండే ప్రముఖులకి మాత్రమే ఇచ్చి, కావలసిన వారు ప్రాంగణం బయట పెట్టిన స్టాల్ లో కొనుక్కోమంటున్నారు.
చివరకి ఆతావేతా తేలిందేమిటంటే, ఏడాదికోసారి ఏ హైదరాబాదులోనో, విజయవాడలోనో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఎన్ని పుస్తకాలు అమ్ముడైతే అన్ని విక్రయించుకుని సంతోషించడం మిగిలింది.
ఇదేదో ఎవరినీ చిన్నబుచ్చడానికి కానీ, పుస్తక ప్రదర్శన నిర్వాహకులని హేళన చేయడానికి కానీ రాసింది కాదని, వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నది మాత్రమే..
ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకోమని మనవి. ఇంక అయితే పుస్తకాలు రాయడం మానేసి, మాలో ఉన్న సృజనాశక్తి మాటేమిటీ అనొచ్చు.. రాయడం మానేయమని ఎవరన్నారు? హాయిగా రాసుకోండి.. అభివృధ్దిచెందుతున్న టెక్నాలజీ ఉపయోగించుకుని, అంతర్జాలం లో….
సర్వే జనా సుఖినోభవంతూ…
నా బ్లాగులో ఈవేళ్టి టపా...
Filed under: Uncategorized | 7 Comments »
You must be logged in to post a comment.