బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– చెవిలో పువ్వులు….


    సాధారణంగా , ఎవరినైనా ఆట పట్టించాలంటే, హిందీలో उल्लू बनाया, అనీ, ఇంగ్లీషులో అయితే taken for a ride అనీ అంటారని విన్నాను. ఈ రెండు ప్రక్రియలనీ తెలుగులో “ చెవిలో పువ్వు పెట్టడడం “ అంటారనుకుంటాను. ఆ పెట్టబడిన పువ్వు, కనకాంబరం పువ్వా, లేక కాలీ ఫ్లవరా అన్నది, పరిస్థితుల మీద ఆధార పడుంటుంది.నేను ఉద్యోగం చేసే రోజుల్లో, మాకో ఆఫీసరుండేవారు. ప్రతీదానికీ, జిఎం తో మాట్టాడతాననేవారు. జిఎంగారి పిఏ ఆఫీసుదాకా వెళ్ళి, ఈ ద్వారం గుండా వెళ్ళడం, బయటకి రావడమూనూ, పెద్దాయన్ని కలిసిందీ లేదూ, పెట్టిందీ లేదూ. ఆంధ్రప్రదేశ “ యువరాజావారి, అమెరికా పర్యటన విషయం చూస్తూంటే, పై రెండు పువ్వులకంటే, ఏదో ఇంకా పెద్దపువ్వే పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నెల 7 వ తారీకున, అమెరికా అద్యక్షుడు ఒబామా, మన యువరాజావారిని కలుస్తున్నారా? నిఝంగానే? ఆయనకి ఇంతకంటే పనేమీ లేదా? ఈ పెద్దమనిషి, ఏదేశానికైనా అద్యక్షుడా, ప్రధానమంత్రా, కనీసం శాసనసభ్యుడా, అబ్బే ఏదీకాదు. శ్రీ మోదీ గారు ప్రధానమంత్రి గా కానప్పుడు, అసలు అమెరికాలోనే అడుగెట్టనీయలేదు. అలాటిది, అకస్మాత్తుగా మన యువరాజావారికి appointment ఇచ్చారంటే , నమ్మదగ్గదిగా ఉందా అసలూ? ఈ సందర్భంలో ఒక వార్త చదివాను ఇక్కడ.

    8 వ తారీకున, ఈటీవీ లోనూ, ఈనాడు పేపరులోనూ, మన యువరాజావారు, ఒబామా గారూ కలిసి తీయించుకున్న ఫొటోలు చూసికూడా నమ్మకపోతే మీ కర్మ.. అని కూడా అనొచ్చు. రాఘవేంద్రరావు గారిని అడిగితే, ఒబామా ఏమిటి, ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో తీయించుకున్న ఫొటోలుకూడా పెట్టొచ్చు. గుర్తులేదూ, ఏ తాజ్ మహల్ చూడడానికైనా వెళ్తే, అక్కడుండే ఫొటోగ్రాఫర్లు, తాజ్ మహల్ ని మన అరచేతిలో ఉండేట్టు ఫొటో తీసేవారు. అదేం బ్రహ్మవిద్యా ఏమిటీ? ఈ మధ్యనే యువరాజా వారు అన్నారు కూడానూ—రాష్ట్రాభివృధ్ధికి ప్రకటించిన విరాళాల్లో సగానికి సగంకూడా రాలేదని. మరి ఇప్పుడు అమెరికా పర్యటనలో వీరు సాధించేదేమిటో…పైగా ఈయన వెళ్ళాడని, పక్క రాష్ట్ర యువరాజా వారు కూడా, రేపో మాపో అమెరికా వెళ్తున్నారుట. కనీసం ఆయనకి మంత్రిపదవైనా ఉంది. వీళ్ళిద్దరి కాంపిటీషనూ చూస్తూంటే నవ్వొస్తోంది.

    “రాబోయే గోదావరి పుష్కరాలకి రాజమండ్రీ దాకా ఎందుకూ, మన రాష్ట్రంలోనే గోదావరి ఎక్కువగా ప్రవహిస్తోందీ..” అంటారొక “చంద్రుడు” గారు. రెండో “ చంద్రుడు” గారైతే, vision 2050 అని మొదలెట్టేశారు, ఎందుకైనా మంచిదీ అని. ఈలోపులో “చెట్టూ చేమా”, “గాలీ నీరూ” అంటూ కొత్త కొత్త స్లోగన్ల తో కాలక్షేపం చేయమన్నారు.
ఒకానొకప్పుడు, విదేశాల్లో ఉండే తెలుగుభాష మాట్టాడేవారందరూ, ఒకే తాడుమీద ఉంటారనే అపోహ ఉండేది. ఇప్పుడు ఆ ముచ్చటా తీరిపోయింది. ఇద్దరు “ చంద్రుల “ ధర్మమా అని, అక్కడ కూడా polarization ప్రారంభం అయింది. “ఆటాలు” “ తానాలు” ఏమైపోతాయో మరి ?

    అప్పుడెప్పుడో ఓ సినిమాలో చూశాను—ఇంట్లో కూతురి పెళ్ళవుతుంటే, అక్కడ వీరికి దగ్గరైన ఒకతను , వధువు తండ్రిని అడుగుతాడు—వాజపేయీ గారికీ, కలాం గారికీ కార్డులు పోస్ట్ చేశావా అని. అదేమిటీ, వాళ్ళకి మనమెవరో తెలియదుగా అంటే, మనకి వాళ్ళు తెలుసుగా అంటాడు. అలాగే, మన ప్రముఖ నటుడొకాయన, శ్రీ మోదీ గారిని, తన కుమారుడి పెళ్ళికి ఆహ్వానించారుట. ఆయనేమో “ అయ్యో .. అదే తేదీకి నేను చైనా కో ఇంకో దేశానికో వెళ్తున్నానూ… ఏ మాత్రం వీలున్నా తప్పకుండా వచ్చి అక్షింతలు వేస్తానూ..” అన్నారుట.

    ఏమిటో ఈమధ్యన దేశాద్యక్షులకీ, ప్రధానమంత్రులకీ, పెద్ద పనున్నట్టు కనిపించడం లేదు. ఎవరొచ్చి కలుస్తారా, ఎవరి పెళ్ళికి పిలుస్తారా అనే చూస్తూండుంటారు కదూ…

    చెవుల్లో పువ్వులు పెట్టించుకునే వాళ్ళు పుష్కలంగా ఉన్నంతవరకూ, పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. వాళ్ళదేంపోయిందీ?

   సర్వే జనా సుఖినోభవంతూ…

2 Responses

  1. very good

    Like

  2. ఏంటో సార్, చెవుల్లో పువ్వులు అందులోనూ కేలీఫ్లవర్లు పెట్టించుకోడం అలవాటయిపోయింది కదండీ.. 🙂

    Like

Leave a comment